Skip to main content

APPSC Group 2 Notification 2022 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

appsc group 2 notification and preparation guidance

గ్రూప్‌–2 సర్వీసులు.. ప్రభుత్వ ఉద్యోగార్థుల అత్యంత క్రేజీ కొలువులు. గ్రూప్‌ 2 ద్వారా డిప్యూటీ తహశీల్దార్, ఏసీటీఓ, ఎక్సైజ్‌ ఎస్‌ఐ తదితర కీలక పోస్టులు సొంతం చేసుకోవచ్చు. ఇటీవలే గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ ప్రకటించిన ఏపీపీఎస్సీ.. త్వరలోనే గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు తమ లక్ష్య సాధన దిశగా సన్నద్ధతకు పదును పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు!! ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష విధానం, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌తో ప్రత్యేక కథనం.. 

  • మరికొద్ది రోజుల్లో గ్రూప్‌–2 నోటిఫికేషన్‌కు అవకాశం
  • నోటిఫికేషన్‌ నుంచి మూడు నెలలలో తొలి దశ పరీక్ష
  • సన్నద్ధతకు పదును పెట్టుకోవాలంటున్న నిపుణులు

ఏపీపీఎస్సీ.. గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ విడుదల దిశగా శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈసారి మూల్యాంకన విధానంలో మార్పులు చేయాలని భావించి.. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటికి ఆమోదం లభించగానే నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

చ‌ద‌వండి: APPSC Group 1 Notification 2022: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక... పూర్తి వివ‌రాల‌కు క్లిక్ చేయండి 

182 పోస్టులకు అనుమతి..

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 182 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చింది. దీంతో త్వరలో వెలువడే నోటిఫికేషన్‌ కూడా ఇదే సంఖ్యతో ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇందులో డిప్యూటీ తహసీల్దార్‌–30, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌–2–16, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్, కోపరేటివ్‌–15, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3–05, ఏఎల్‌వో (లేబర్‌)–10, ఏఎస్‌వో (లా)–02, ఏఎస్‌వో(లేజిస్లేచర్‌)–04, ఏఎస్‌వో(సాధారణ పరిపాలన)–50, జూనియర్‌ అసిస్టెంట్స్‌(సీసీఎస్‌)–05, సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–10, జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ)–20, సీనియర్‌ అడిటర్‌(స్టేట్‌ ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌)–05, ఆడిటర్‌(పే అండ్‌ అలవెన్స్‌ డిపార్ట్‌మెంట్‌)–10 తదితర పోస్టులు ఉన్నాయి.

రెండు దశలుగా రాత పరీక్ష

గ్రూప్‌–2 ఎంపిక ప్రక్రియను రెండు దశల్లో రాత పరీక్షల ద్వారా నిర్వహించనున్నారు. తొలి దశ రాత పరీక్షను స్క్రీనింగ్‌ టెస్ట్‌గా, రెండో దశ రాత పరీక్షను మెయిన్‌ టెస్ట్‌గా పేర్కొంటారు.

స్క్రీనింగ్‌ టెస్ట్‌

గ్రూప్‌–2 తొలిదశ రాత పరీక్షగా పేర్కొనే స్క్రీనింగ్‌ టెస్ట్‌ మూడు విభాగాల్లో 150 మార్కులకు జరుగుతుంది. సెక్షన్‌ ఏలో జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ; సెక్షన్‌ బీలో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం; సెక్షన్‌ సీలో ప్లానింగ్‌ అండ్‌ ఎకానమీ ఉంటాయి. 

రెండో దశ మెయిన్‌

తొలిదశ స్క్రీనింగ్‌ టెస్ట్‌ తర్వాత రెండో దశగా నిర్వహించే గ్రూప్‌–2 మెయిన్‌ పరీక్షను మూడు పేపర్లుగా 450 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ 150 మార్కులకు; అలాగే 150 మార్కులకు జరిగే పేపర్‌2లో సెక్షన్‌1లో సోషల్‌ హిస్టరీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్, సెక్షన్‌ 2 భారత రాజ్యాంగ సమీక్ష; పేపర్‌ 3లో ప్లానింగ్‌ ఇన్‌ ఇండియా, ఇండియన్‌ ఎకానమీ, సమకాలీన సమస్యలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రాధాన్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి 150 మార్కులకు ఉంటాయి.

కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌

గ్రూప్‌–2 అభ్యర్థులకు చివరగా కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. మొత్తం అర్హత పొందిన అభ్యర్థుల నుంచి 1:2 నిష్పత్తిలో జాబితా రూపొందించి.. వారికి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. 

చ‌ద‌వండి: APPSC Group 1 Preparation Tips: గ్రూప్‌-1.. గురి పెట్టండిలా!

విజయం సాధించాలంటే
సిలబస్‌పై పట్టు

గ్రూప్‌–2 పరీక్షలో గెలుపు కోసం సిలబస్‌ అంశాలపై పట్టు సాధించడం చాలా ముఖ్యం. అందుకే అభ్యర్థులు తొలుత సిలబస్‌ ఆసాంతం అవగాహన చేసుకోవాలి. ఆయా అంశాలకు ఉన్న వెయిటేజీకి అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను సాగించాలి. ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అంశాలను గుర్తించాలి. వాటి కోసం సమయం కేటాయించాలి.

గ్రూప్‌–1తో సమన్వయం

ఇటీవల ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షకు పోటీ పడే వారిలో అధిక శాతం మంది గ్రూప్‌–2కు కూడా దరఖాస్తు చేసుకుంటారు. ఇలాంటి అభ్యర్థులు గ్రూప్‌–1తో సమన్వయం చేసుకుంటూ సిద్ధమైతే.. గ్రూప్‌–2లోనూ విజయావకాశాలను మెరుగుపరచుకోవచ్చు.గ్రూప్‌–1, గ్రూప్‌–2 సిలబస్‌లో దాదాపు 80 శాతం అంశాలు ఒకే మాదిరిగా ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు గ్రూప్‌–1 ఓరియెంటేషన్‌తో.. డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో ముందుకు సాగితే.. గ్రూప్‌–2 సిలబస్‌పైనా పట్టు సాధించే అవకాశం ఉంది.

చ‌ద‌వండి: Latest Current Affairs

కాన్సెప్ట్స్‌ + కరెంట్‌ ఈవెంట్స్‌

సిలబస్‌ అంశాలను చదివేటప్పుడు వాటిని సమకాలీన అంశాలతోనూ సమన్వయం చేసుకుంటూ ప్రిపేరవ్వాలి. తద్వారా కోర్‌ సబ్జెక్ట్‌ల్లో పట్టు సాధించడంతోపాటు సమకాలీన పరిణామాలపైనా అవగాహన వస్తుంది. ముఖ్యంగా గ్రూప్‌–1 అభ్యర్థులకు ఇది కలిసొచ్చే అంశం.

విశ్లేషణాత్మకంగా

  • ఆయా అంశాలను చదివేటప్పుడు విశ్లేషణాత్మక దృక్పథాన్ని అనుసరించాలి. సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహన, విశ్లేషణ, స్వీయ అభిప్రాయ దృక్పథం పెంచుకోవాలి. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సినాప్సిస్, నేపథ్యం, ప్రభావం, ఫలితం, పర్యవసానాలు.. ఇలా అన్ని కోణాల్లో అవగాహన పెంచుకోవాలి. 
  • రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. ముఖ్యంగా నవరత్నాలు, ఇతర అన్ని సంక్షేమ, అభివృద్ది పథకాలు, లక్షిత వర్గాలు, బడ్జెట్‌ కేటాయింపులు, ఇప్పటివరకు లబ్ధి పొందిన వారి సంఖ్య తదితర వివరాలను అవపోసన పట్టాలి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న ఆర్థిక విధానాలు, వాటిద్వారా కలిగిన అభివృద్ధిపై దృష్టి సారించాలి. 
  • జాతీయ స్థాయిలో తాజా రాజ్యాంగ సవరణలు, నూతన జాతీయ విద్యా విధానం, ఇటీవల కాలంలో కీలకమైన తీర్పుల గురించి అవగాహన అవసరం.

చదవండి: ఏపీపీఎస్సీ ☛ స్టడీ మెటీరియల్ ☛ బిట్ బ్యాంక్ ☛ గైడెన్స్ ☛ ప్రీవియస్ పేపర్స్ ☛ సక్సెస్ స్టోరీస్ ☛ సిలబస్ ☛ ఆన్‌లైన్ టెస్ట్స్ ☛ ఆన్‌లైన్ క్లాస్ ☛ ఎఫ్‌ఏక్యూస్‌

సబ్జెక్ట్‌లు.. కీలక అంశాలు

  • హిస్టరీలో రాష్ట్ర చరిత్ర,సంసృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ..ముఖ్యమైన అంశాలపై పట్టు పెంచుకోవాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్‌ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. ఇదే తీరులో భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలనూ అధ్యయనం చేయాలి. 
  • భౌగోళిక శాస్త్రానికి సంబంధించి.. రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి. గతేడాది కాలంలో చేపట్టిన వ్యవసాయ, నీటి పారుదల ప్రాజెక్ట్‌లు.. వాటి ద్వారా లబ్ధి చేకూరే ప్రాంతాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.
  • పాలిటీ విభాగంలో రాణించేందుకు రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాలు(రాజ్యాంగ సవరణలు వాటి ప్రభావం) వరకూ తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్‌ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన పెంచుకోవాలి. వాస్తవానికి దీనికి సంబంధించి ప్రత్యేక పుస్తకాలు లేనప్పటికీ.. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పుస్తకాలు కొంత మేలు చేస్తాయి. న్యాయపరమైన అంశాలపైనా పట్టు సాధించాలి. ప్రాథమిక హక్కులు, విధులు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు.. వీటికి సంబంధించి న్యాయ వ్యవస్థకున్న అధికారాల గురించి తెలుసుకోవాలి. అదే విధంగా, సివిల్, క్రిమినల్‌ లా, కార్మిక చట్టాలు, సైబర్‌ చట్టాలు, ట్యాక్స్‌ లాస్‌లను చదవాలి. 
  • ఎకానమీ ప్రిపరేషన్‌ ప్రారంభ దశలో మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్‌ సర్వేలను అధ్యయనం చేయాలి. 
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్‌ స్పేస్‌ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పెంచుకోవాలి.

పునర్విభజన చట్టంపైనా

గ్రూప్‌–2 అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. జనరల్‌ స్టడీస్, ఎకానమీ, హిస్టరీ పేపర్లు అన్నింటిలోనూ.. ఈ చట్టం నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి అభ్యర్థులు పునర్విభజన చట్టాన్ని ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. విభజన తర్వాత ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలు.. వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలుసుకోవాలి.

ఏపీపీఎస్సీ గ్రూప్‌–2.. ముఖ్య సమాచారం

  • బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో గ్రూప్‌–2కు దరఖాస్తు.
  • మరికొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్‌ విడుదలకు అవకాశం.
  • ఇప్పటి వరకు ఆమోదం లభించిన గ్రూప్‌–2 పోస్ట్‌ల సంఖ్య 182. 
  • స్క్రీనింగ్‌ టెస్ట్, మెయిన్‌ ఎగ్జామ్‌ పేరుతో రెండు దశల రాత పరీక్ష.
  • నోటిఫికేషన్‌ వెలువడిన మూడు నెలలలోపు తొలి దశ రాత పరీక్ష.

చ‌ద‌వండి: Indian Polity Preamble Notes: వివాదాలు - సుప్రీంకోర్టు తీర్పులు.. ప్రముఖుల అభిప్రాయాలు 

Published date : 25 Oct 2022 06:18PM

Photo Stories