Skip to main content

ఒకే పన్ను మంత్రం...జీఎస్‌టీ

పరోక్ష పన్నుల సంస్కరణల్లో కీలక అధ్యాయానికి కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది.
వస్తు, సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్-జీఎస్‌టీ)ను దేశ ఆర్థిక వ్యవస్థకు పరిచయం చేస్తూ అమల్లోకి తీసుకు వచ్చేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రి వర్గం 2014, డిసెంబరు 17న ఆమోదించింది. అన్నీ సవ్యంగా సాగితే 2016, ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఒకే పన్ను... జీఎస్‌టీ:
దేశ వ్యాప్తంగా వస్తు, సేవలకు ఒకే పన్నును విధించడంతో పాటు పన్నుపై పన్ను వేసే పద్ధతిని నిర్మూలించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వస్తు, సేవల పన్ను బిల్లును డిసెంబరు 19న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కొత్త పన్ను విధానాన్ని ఏప్రిల్ 1, 2016 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్), వినోద, విలాస, ప్రవేశ పన్ను, ఆక్ట్రాయ్ స్థానంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఒక్కటే ఉంటుంది. ఈ పన్ను విషయమై 122వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి లోక్‌సభ, రాజ్యసభలో 2/3 వవంతు మెజారిటీ అవసరం. దీంతోపాటు సగానికిపైగా రాష్ట్ర శాసనసభలు ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది.

వస్తు సేవల పన్ను బిల్లు -స్వరూపం:
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు వివరాలను పరికిస్తే..
  • జీఎస్‌టీ పరిధి నుంచి మద్యాన్ని పూర్తిగా తప్పించారు. పెట్రోల్, డీజిల్ లాంటి పెట్రోలియం ఉత్పత్తులు వ్యవస్థలో భాగంగా ఉంటాయి.
  • జీఎస్‌టీ మండలి నిర్ణయించే తేదీ నుంచి ఆయా ఉత్పత్తులు దీని పరిధిలోకి వస్తాయి.
  • జీఎస్‌టీ మండలిలో మూడింట రెండొంతుల మంది సభ్యులు రాష్ట్రాల నుంచే ఉంటారు. మండలిలో తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చాలంటే 75 శాతం సభ్యులు ఆమోదించాలి..
  • జీఎస్‌టీ అమలు ప్రారంభమైన మొదటి, రెండు సంవ త్సరాల కాలంలో తాము అధికంగా నష్టపోవాల్సి వస్తుందని రాష్ట్రాలు భావించినప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు సరుకుల ఉత్పత్తి స్థానంలో జీఎస్‌టీకి అదనంగా ఒక శాతం పన్ను విధించే అవకాశం ఉంటుంది.
  • జీఎస్‌టీ అమలయ్యే క్రమంలో రాష్ట్రాలు రాబడి కోల్పోయే సూచనలు ఉంటే.. నష్ట పరిహారంగా మొదటి మూడేళ్ల కాలంలో వందశాతం, నాలుగో ఏట 75 శాతం, ఐదో ఏట 50 శాతం చెల్లించనుంది.
  • పెట్రోలియం ఉత్పత్తులు బిల్లులో భాగంగా ఉన్నప్పటికీ వాటిపై ఎలాంటి పన్నును విధించరు. దీంతో రాష్ట్రాలు వాటిపై విలువ ఆధారిత పన్నును కొనసాగించుకోవచ్చు. ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది.
  • ఒకే పన్ను రేటులో సరుకులు, సేవలపై కేంద్ర ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల వ్యాట్, వినోద, విలాస, ప్రవేశ, కొనుగోలు పన్నులతో పాటు ఆక్ట్రాయ్ తొలగిపోతాయి. దీంతో సరకుల బదిలీ సులభతరమవుతుంది. పన్నుపై పన్ను విధించే పద్ధతి దూరమవుతుంది.
వివాదం కొలిక్కి:
వస్తు, సేవల పన్నును 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. కానీ అది రద్దయ్యింది. దీంతో ఎన్‌డీఏ ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశ పెట్టాల్సి వచ్చింది. అయితే పెట్రోలియం ఉత్పత్తి పన్ను పద్ధతి వంటి పలు వివాదాస్పద అంశాలపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. చొరవ చూపిన కేంద్రం రాష్ట్రాలతో చర్చించింది. పెట్రోలియంను మినహాయించాలని నిర్ణయించింది. అలాగే కొత్త పన్ను విధానంలో ప్రవేశ పన్నును చేర్చడంతో రాష్ట్రాలు అంగీకరించాయి. దీంతో రాష్ట్రాలు, కేంద్రం మధ్య దీర్ఘకాలికంగా ఉన్న కీలక అంశాలు పరిష్కార మయ్యాయి. వస్తు సేవలపై పన్నును సమగ్రంగా అమలు చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ రాబడి పెరుగుతుంది. వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు, సాధారణ వినియోగదారులు కూడా జీఎస్‌టీ వల్ల లబ్ధి పొందగలరు.

జీఎస్‌టీ ఆవశ్యకత:
విలువ ఆధారిత పన్ను నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో అనేక లోపాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించే cen VAT (కేంద్ర విలువ ఆధారిత పన్ను) పరిధిలో కొన్ని కేంద్ర పన్నులైన అదనపు కస్టమ్స్ సుంకం, సర్‌ఛార్జిలను చేర్చలేదు. ప్రస్తుత కేంద్ర విలువ ఆధారిత పన్ను పథకంలో తయారీ స్థాయికి కింద ఉన్న వాణిజ్య పంపిణీలో Value Added Chain ను సక్రమంగా అమలు చేయడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ రాబడిలో గణనీయమైన తగ్గుదల సంభవించింది.

ఇక రాష్ట్ర స్థాయిలో చూస్తే... విలువ ఆధారిత పన్ను నిర్మాణతలో వస్తువులపై విధించే పరోక్ష పన్నులైన విలాస, వినోద పన్నుల్ని ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర స్థాయి వ్యాట్ పథకంలో భాగంగా వస్తు విలువపై రాష్ట్ర వ్యాట్‌తో పాటు సెన్ వ్యాట్ (cen VAT) ను కూడా వసూలు చేస్తున్నారు. పన్నుపై పన్ను విధించే పద్ధతికి స్వస్తి చెప్పే క్రమంలో వస్తు సేవల పన్ను ఆవశ్యకత ఏర్పడింది. రాష్ట్ర స్థాయిలో జీఎస్‌టీని ప్రవేశపెట్టినట్లయితే అన్ని సేవలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రాలకు అధికారం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ తప్పనిసరి.

జీఎస్‌టీ నమూనా:
  • వస్తు సేవల పన్ను రెండు విధాలు. కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ జీఎస్‌టీ ఒకటి కాగా, రెండోది రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాలు విధించే స్టేట్ జీఎస్‌టీ. రెవెన్యూ, Acceptability అనే అంశాల ఆధారంగా సెంట్రల్, స్టేట్ జీఎస్‌టీ పన్ను రేట్లను నిర్ణయిస్తారు.
  • వస్తు, సేవలకు సంబంధించిన అన్ని లావాదేవీలకు కేంద్ర జీఎస్‌టీ, రాష్ట్ర జీఎస్‌టీ వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని వస్తు సేవల పన్నులో భాగంగా వస్తువులకు సంబంధించి ఏూ వర్గీకరణ ఉపయోగిస్తారు. భారత సేవా రంగ లక్షణాలను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ పద్ధతులకు అనుగుణంగా సేవల వర్గీకరణ ఉంటుంది.
  • రెండు జీఎస్‌టీ వసూళ్లకు సంబంధించి అవలంబించే పద్ధతి ఒకేలా ఉంటుంది. వస్తు సేవల పన్నును ఆయా అకౌంట్లలో జమ చేస్తారు.
  • కేంద్ర, రాష్ట్ర జీఎస్‌టీలను వేర్వేరుగా పరిగణిస్తున్నం దువల్ల కేంద్ర జీఎస్‌టీ ఆధారంగా చెల్లించే పన్ను మొత్తంలో ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతిస్తారు. ఇదే నియమావళి రాష్ట్ర జీఎస్‌టీకి వర్తిస్తుంది.
  • కేంద్ర, రాష్ట్ర జీఎస్‌టీల మధ్య ఇన్‌పుట్ టాక్స్‌ను క్రాస్ యుటిలైజేషన్‌కు అనుమతి లేదు.
  • పన్ను చెల్లింపుదారునకు పాన్ ఆధారిత Tax Payer Identification Numberను కేటాయించారు. ఇందులో 13 నంబర్లు ఉంటాయి. రాష్ట్రాలను గుర్తించడానికి రెండు అదనపు నంబర్లు, కేంద్ర, రాష్ట్ర జీఎస్‌టీని గుర్తించడానికి మరో అదనపు నంబరు ఉంటాయి.
సాధికారత కమిటీ సూచనలు
  • దేశ ఆర్థిక, స్థితి గతులను దృష్టిలో ఉంచుకొని కొన్ని కేటగిరీలకు సంబంధించి వస్తు, సేవలపై విధించే పన్ను ప్రామాణిక రేటు కంటే తక్కువగా ఉండాలని సాధికారత కమిటీ తెలిపింది.
  • ప్రామాణిక, దిగువ స్థాయి రేటు అనే రెండు విధాలైన పన్ను రేట్లను కమిటీ సిఫార్సు చేసింది.
  • బంగారు, వెండి, వజ్రాభరణాలు, విలువైన రాళ్లు, లోహాలపై తక్కువ పన్ను ఉండాలి.
  • పన్ను పద్ధతి ఆధారంగా పన్ను రేటును నిర్ణయించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పారదర్శకత పద్ధతి అవలంబించడం ద్వారా ప్రత్యేకమైన పన్ను రేట్లను నిర్ణయించాలి.
  • ఎగుమతులతో పాటు ప్రత్యేక ఆర్థిక మండలికి సంబంధించి ప్రాసెసింగ్ జోన్‌లలోని ఎగుమతులపై కూడా జీరో ట్యాక్స్ విధానం అనుసరించాలి. ప్రత్యేక ఆర్థిక మండలి నుంచి స్వదేశీ టారిఫ్ ఏరియాలో అమ్మకాలకు ఈ ప్రయోజనం కల్పించవద్దు.
  • అన్ని రాష్ట్రాలు, పరిశ్రమలకు సంబంధించి ప్రోత్సాహకాలను జనవరి 1, 2000 నుంచి విరమించుకు న్నాయి. జీఎస్‌టీ ప్రవేశపెట్టిన తర్వాత పన్ను వసూలు, ప్రోత్సాహక పథకాల్ని తిరిగి చెల్లింపు పథకాలుగా మార్చాలి. ఈ ప్రోత్సాహకాల భారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి.
  • లక్ష్య సాధన క్రమంలో పన్ను మినహాయింపు కంటే ప్రత్యేక రాయితీలు సమర్థవంతమైనవని కమిటీ పేర్కొంది. పన్ను మినహాయింపులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఉమ్మడి జాబితా (కామన్ లిస్ట్) ఉండాలని కమిటీ సూచించింది.
  • పన్ను మినహాయింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పరిస్థితులకు అనుగుణంగా పరిమితమైన సరళత్వం ఉండాలని కమిటీ తెలిపింది.
అమలు సాధ్యమేనా?
పెట్రోలియం ఉత్పత్తులు, ప్రవేశపన్ను జీఎస్‌టీ వ్యవస్థలో భాగంగా ఉండటాన్ని రాష్ట్రాలు ఆక్షేపిస్తున్నాయి. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు, స్టాంప్ డ్యూటీలను జీఎస్‌టీ నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధి కారత కమిటీ అభిప్రాయాలను ఆర్థిక మంత్రి కొత్త ముసాయిదా బిల్లు పరిగణనలోకి తీసుకోకపోవడం కొత్త వివాదాలకు తావిచ్చే ఆస్కారం ఉంది. కొన్ని రాష్ట్రాలు రాబోయే రెవెన్యూ నష్టం పట్ల వ్యక్తపరుస్తున్న ఆందోళన నేపథ్యంలో ఏప్రిల్ 1, 2016 నుంచి తలపెట్టిన జీఎస్‌టీ అమలు ఎంతవరకు సాకారమవుతుందనేది సందేహం.

జీఎస్‌టీపై ఎవరేమన్నారంటే
జీఎస్‌టీ అమలుతో ప్రత్యక్ష వ్యయాలు, మూలధన ఉత్పాదితాల వ్యయాలు తగ్గుతాయి. స్థూల దేశీయోత్పత్తిలో 2 నుంచి 2.5 శాతం అదనపు వృద్ధి కనిపిస్తుంది. ఎగుమతుల్లో వార్షిక పెరుగుదల 10 నుంచి 14 శాతంగా ఉండగలదు.
నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్


పన్ను భారాన్ని తయారీ, సేవల మధ్య సమంగా పునః పంపిణీ చేయడం ద్వారా పన్ను వ్యవస్థలో పరిణామాత్మక మార్పునకు వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) దోహదపడుతుంది.
విజయ్ కేల్కర్, 13 ఆర్థిక సంఘం అధ్యక్షుడు


దేశానికి స్వాతంత్య్రం లభించిన తర్వాత తొలిసారి అమల్లోకి వస్తున్న అతి పెద్ద పరోక్ష పన్ను జీఎస్‌టీ. ఈ పన్ను దేశవ్యాప్తంగా ఒకటే మార్కెట్‌ను ప్రోత్సహిస్తుంది. రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉంటూ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టపరుస్తుంది.
అరుణ్‌జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి


విత్త సంస్కరణల్లో భాగంగా జీఎస్‌టీ పరిచయం కీలకాంశం. భారత్‌ను ఎకనమిక్ సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతుంది.
సచిన్ మీనన్, కేపీఎంజీ సీఈఓ


పన్ను మీద పన్ను విధానం ఉండదు కాబట్టి ధరల్లో నిలకడ సాధ్యమవుతుంది. దేశ జీడీపీ వృద్ధిలో పెరుగుదల ఏర్పడుతుంది.
శక్తి కాంతదాస్, రెవెన్యూ కార్యదర్శి


పెట్రో ఉత్పత్తులు, ప్రవేశపన్ను జీఎస్‌టీలో భాగంగా ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది పెట్టుబడి దారుల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అధిక పెట్టుబడుల ఆకర్షణకు తోడ్పడుతుంది.
ప్రశాంత్ దేశ్‌పాండ్, డెలాయిట్


వస్తుసేవల పన్ను అమల్లోకి వస్తే రాష్ట్రాలు రాబడిని కోల్పోతాయి. దీనికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలి.
మమతాబెనర్జీ, ముఖ్యమంత్రి, పశ్చిమబెంగాల్
Published date : 25 Dec 2014 03:35PM

Photo Stories