Skip to main content

ఆర్థిక వృద్ధి.. అసమానతలు.. మానవాభివృద్ధి

భారత్ లాంటి ఫెడరల్ ఆర్థిక వ్యవస్థలో సామాజిక అభివృద్ధి లక్ష్యాల సాధనరాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధత, కార్యక్రమాల అమలుపై ఆధారపడి ఉంటుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, వైఎస్‌ఆర్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతోపాటు నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతో.. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, నైపుణ్యత మెరుగుపడి.. సుస్థిర ఆర్థిక వృద్ధి సాధనకు మార్గం సుగమం అవుతుంది. మానవాభివృద్ధి ద్వారా సుస్థిర అభివృద్ధి సాధనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు.. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పొచ్చు.

ఆర్థిక వృద్ధి లేదా మానవాభివృద్ధిలో ఒక అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అసంతులిత వృద్ధికి దారితీయడం ద్వారా దీర్ఘకాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మానవాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వ విధానాల సక్రమ అమలుకు వనరుల లభ్యత అవరోధంగా నిలిచింది. భారత్‌లో అనేక రాష్ట్రాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కారణంగా.. మానవాభివృద్ధి కార్యకలాపాలపై అధిక పెట్టుబడుల కోసం వనరుల సమీకరణ క్లిష్టంగా మారింది. ఆదాయ పంపిణీ, ప్రజల సామర్థ్యం పెంపునకు సంబంధించి సమన్వయ విధాన చర్యలు చేపట్టే విషయంలో.. ప్రభుత్వాల పాత్ర ఎంతో కీలకం. ఆర్థిక వృద్ధి, తలసరి ఆదాయాల పెంపు లక్ష్యం.. మనవాభివృద్ధిని సాధించడమేనని నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. అధిక స్వేచ్ఛ, సామర్థ్యాలు ఎంతమేర ఆర్థిక పురోగతిని మెరుగుపరచగలవనే దాన్ని బట్టి ఆర్థిక వృద్ధిపై మానవాభివృద్ధి ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వృద్ధి, సుస్థిర మానవాభివృద్ధి సాధనలో గవర్నెన్స్ నాణ్యత ప్రధానమైనది. దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధి సుస్థిరతకు మెరుగైన మానవ మూల ధనం అవసరం.

భారత ఆర్థిక వ్యవస్థ-అధిక జీడీపీ వృద్ధి ప్రభావం
స్థిరవృద్ధి నుంచి పటిష్టమైన వృద్ధి సాధించే దిశగా భారత ఆర్థిక వ్యవస్థ రూపొందింది. 1960 వ దశకంలో సగటు వార్షిక వృద్ధి 4 శాతం కాగా 1970 వ దశకంలో 2.4 శాతానికి తగ్గింది. సగటు సంవత్సరిక వృద్ధి 1980వ దశకంలో 5.6 శాతం కాగా 1990వ దశకంలో 5.8 శాతం, 2000వ దశకంలో 7.2 శాతం. 2010-19 మధ్య కాలంలో 7.3 శాతంగా నమోదైంది. గత రెండు దశాబ్దాల కాలంలో తలసరి ఆదాయం పెరుగుదలతోపాటు తీవ్ర పేదరికం తగ్గింది. ముఖ్యంగా గత పదేళ్ల కాలంలో తలసరి జీడీపీ రెట్టింపు కావడంతోపాటు పేదరికంలో గణనీయమైన తగ్గుదల ఏర్పడింది. విద్యా సౌకర్యాలు మెరుగై జీవన ప్రమాణం పెరిగింది. ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా భారత్ పురోగమిస్తోంది. నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి భారత్ తగిన కార్యాచరణ రూపొందించుకుంది. ప్రపంచ ఆర్థిక, సామాజిక సంక్షోభం వల్ల ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవడంతోపాటు, ప్రతి ఏడాది శ్రామిక మార్కెట్‌లో శాశ్వత ప్రాతిపదికన నాణ్యతతో కూడిన ఉపాధి కల్పించడానికి తగిన విధానాలను భారత్ అవలంభిస్తోంది. స్వల్ప, దీర్ఘ కాలంలో పాఠశాల స్థాయిలో డ్రాపౌట్ రేటు తగ్గించుకోవడంతోపాటు, శ్రామిక నైపుణ్యత పెంపుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

సంస్కరణల యుగంలో పెరుగుతున్న అసమానతలు
  • భారత్‌లో ఆర్థిక సంస్కరణల అమలు కాలంలో వివిధ వర్గాల ప్రజలు, ప్రాంతాల మధ్య వినియోగ వ్యయం, ఆదాయం, సంపద పరంగా వ్యత్యాసాలు పెరిగాయి. దక్షిణాఫ్రికా, కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాల తదుపరి అధిక ఆదాయ అసమానతల జోన్‌లో భారత్ చేరింది. అఖిల భారత రుణ, పెట్టుబడి సర్వేకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. భారత్ గినీ గుణకం 1990వ దశకంలో 0.65 నుంచి 2000వ దశకంలో 0.74కు పెరగడాన్ని బట్టి అధికమవుతున్న ఆదాయ అసమానతలను గమనించొచ్చు.
  • ఫోర్బ్స్ భారతీయ ధనికుల జాబితా పరిశీలించినప్పుడు 1990వ దశకంలో భారతీయ ధనికుల సంపద జాతీయాదాయంలో రెండు శాతం కన్నా తక్కువ కాగా 2000వ దశకంలో గణనీయంగా పెరిగింది. 2015లో భారతీయ ధనికుల సంపద జాతీయాదాయంలో 10 శాతానికి పెరిగింది. ముఖ్యంగా 2008-09 సంక్షోభానికి ముందు కాలంలో అధికంగా 27 శాతంగా నమోదైంది.
  • వివిధ ఇన్‌కమ్ గ్రూపుల ఆదాయ స్థాయి వృద్ధిని పరిశీలించినప్పుడు మొదటి పది శాతం ఆదాయ స్థాయి వృద్ధి 1951-80 మధ్య కాలంలో 28 శాతం కాగా 1980-2014 మధ్య 66 శాతానికి పెరిగింది. ఇదే కాలంలో మధ్యనున్న 40 శాతం ప్రజల ఆదాయ స్థాయి వృద్ధి 49 నుంచి 23 శాతానికి, చివరి 50 శాతం ప్రజల ఆదాయ స్థాయి వృద్ధి 24 నుంచి 11 శాతానికి తగ్గింది.
  • దేశంలో 2012లో మొత్తం బిలియనీర్లు 46 మంది కాగా వీరిలో 20 మంది రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, మీడియా, సిమెంట్, మైనింగ్, అవస్థాపనా రంగాల ద్వారా అధిక సంపద ఆర్జించినవారే. మిగిలిన 26 మందికి ఐటీ/సాఫ్ట్‌వేర్, ఫార్మాసూటికల్స్, బయోటెక్, ఫైనాన్స్, లిక్కర్, ఆటోమొబైల్ రంగాలు ముఖ్య ఆర్థిక కార్యకలాపాలు. మొత్తం బిలియనీర్ల సంపదలో 60 శాతం 20 మంది చేతుల్లో కేంద్రీకృతమై ఉంది.
  • 2012-16 మధ్య కాలంలో దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి అధికంగా మిజోరం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో నమోదైంది. 2016-17లో మధ్యప్రదేశ్ జీఎస్‌డీపీలో అధిక వృద్ధి, అరుణాచల్ ప్రదేశ్ జీఎస్‌డీపీలో అల్ప వృద్ధి నమోదైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో వ్యత్యాసం రాష్ట్రాల మధ్య అభివృద్ధిలో వ్యత్యాసాలకు దారితీస్తోంది. 2018-19 (ఏప్రిల్-డిసెంబర్) ఎఫ్‌డీఐలను అధికంగా ఆకర్షించిన రాష్ట్రాల్లో ఢిల్లీ(యూపీ, హర్యానాలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని) ప్రథమ స్థానంలో ఉండగా.. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్‌లు తదుపరి స్థానాల్లో నిలిచాయి.
ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధి మధ్య సంబంధం
  • భారత్ లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రాంతీయ అసమానతలను సాధారణ ప్రక్రియగా భావించొచ్చు. భారత్‌లో సంస్కరణల కాలంలో ఆర్థిక వృద్ధి వేగవంతమైనప్పటికీ.. సమాజంలోని కొన్ని వ ర్గాల ప్రజలు ఆర్థిక వృద్ధి ఫలాలు అందుకోలేకపోయారు. రాష్ట్రాల మధ్య అభివృద్ధిలోనూ వ్యత్యాసాలు పెరిగాయి. ఆర్థిక వృద్ధి ఫలాలు సమాజంలో వెనుకబడిన వర్గాలకు చేరువ చేయడంలో మానవాభివృద్ధి పాత్ర ప్రధానమైనది. మానవ మూలధనం, ఆర్థిక వృద్ధి మధ్య పటిష్టమైన సహ సంబంధాన్ని గమనించొచ్చు. మానవ మూలధనం అనగా ఆర్థిక వ్యవస్థలోని శ్రామికుల్లో నాలెడ్జ్, నైపుణ్యత, అనుభవం ప్రజల్లో విద్యా ప్రమాణాల పెంపు తదితర అంశాలపై పెట్టుబడుల ద్వారా పని నాణ్యత మెరుగై ఉత్పాదకత పెరుగుతుంది. మానవ మూలధనం ప్రజల్లో నాలెడ్జ్ విస్తరణ, నైపుణ్యత పెంపు ఆర్థిక వృద్ధిపై ధనాత్మక ప్రభావాన్ని కలుగజేస్తుంది.
  • మానవాభివృద్ధిపై ఆర్థికవృద్ధి ధనాత్మక ప్రభావాన్ని తలసరి ఆదాయ స్థాయి పెరుగుదల, పేదరిక నిర్మూలన, విద్య, ఆరోగ్యం సంబంధిత రంగాలపై అధిక ప్రభుత్వ వ్యయం లాంటి అంశాల ద్వారా గమనించొచ్చు. తలసరి ఆదాయ సాధారణ స్థాయిలో పెరుగుదల కారణంగా విద్య, ఆరోగ్య సంరక్షణకు డిమాండ్ పెరుగుతుంది. తద్వారా దేశంలో మానవాభివృద్ధి మెరుగవుతుంది. మరోవైపు ఆర్థిక వృద్ధితో అనుసంధానించిన పేదరిక నిర్మూలన కారణంగా పేద వర్గాల ప్రజలు ఆర్థిక వృద్ధి ఫలాలను పొందడం వలన మానవాభివృద్ధి సూచికలపై మంచి ప్రభావం కనిపిస్తుంది.
  • ఆర్థికవేత్తల అభిప్రాయంలో ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధి మధ్య ధనాత్మక సంబంధం ఉంటుంది. మానవాభివృద్ధిపై ఆర్థిక వృద్ధి ప్రభావం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, ఆదాయం, ఆస్తుల పంపిణీ, సంస్థా పరమైన నాణ్యత, విధానాల ఎంపికను ప్రధాన అంశాలుగా భావించొచ్చు. అల్పస్థాయి పేదరికం, ఆదాయ పంపిణీలో సమానత్వం, విద్య, సామాజిక అభివృద్ధి రంగాలపై అధిక వ్యయం చేసే ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధి మధ్య పటిష్ట సంబంధాన్ని గమనించొచ్చు. కుటుంబ, ప్రభుత్వ వ్యయాల ద్వారా ఆర్థిక వృద్ధి, మానవాభివృద్ధికి దారితీస్తుంది. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, శ్రామిక శక్తి నాణ్యత ప్రమాణాల పెరుగుదల కారణంగా శ్రామిక సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుతుంది.
  • మానవాభివృద్ధిపై ఆర్థిక వృద్ధి ప్రభావం సామాజిక అంశాలు, వృద్ధి, భౌగోళిక నిర్మాణంపై అధారపడి ఉంటుంది. నిర్మాణాత్మక ఆధునీకరణతోపాటు మానవ మూల ధనం మెరుగైన దేశాల పెట్టుబడులకు ప్రధాన కేంద్రాలుగా రూపొందుతాయి. తద్వారా శ్రామికుల ఆదాయల్లో పెరుగుదల ఏర్పడుతుంది.
వివిధ దేశాల అనుభవాలు
  • విద్య, ఆరోగ్య ప్రమాణాల్లో పెరుగుదల శ్రామిక ఉత్పాదకతపై పటిష్ట ప్రభావాన్ని కలుగజేసినట్లు అనేక అనుభవ పూర్వక ఆధారాలు తెలుపుతున్నాయి. ప్రతి అదనపు ఏడాది పాఠశాల విద్యనభ్యసించిన మలేషియా, ఘనా, పెరూలోని రైతుల సంవత్సరిక ఉత్పత్తి వృద్ధిలో 2-5 శాతం పెరుగుదల ఏర్పడింది. ఇండోనేషియాలో ప్రతి వెయ్యి మంది పిల్లలకు అదనపు పాఠశాల నిర్మాణం కారణంగా వేతనాల్లో 1.5-2.7 శాతం పెరుగుదల సంభవించింది.
  • మెరుగైన విద్యా ప్రమాణాల కారణంగా ఉత్పాదకత పెరగడంతోపాటు, నవకల్పనలు, సాంకేతిక ప్రగతి సాధ్యమవుతుంది. ఉన్నత విద్యలో నవ కల్పనల కారణంగా శ్రీలంకలో వస్త్ర, ఇంజనీరింగ్ పరిశ్రమల్లో ప్రగతి సాధ్యమైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
  • లాటిన్ అమెరికాలోని 18 దేశాల్లో 1980వ దశకంలో పాఠశాల విద్య, ఆదాయ అసమానతలు, పేదరికం మధ్య సంబంధాన్ని పరిశీలించినప్పుడు శ్రామికుల వేతనాల్లో 25శాతం వ్యత్యాసాలకు విద్యా ప్రమాణాల్లో ఉన్న వ్యత్యాసం కారణమైంది.
  • సింగపూర్, థాయ్‌లాండ్, తైవాన్‌లో విద్యా ప్రమాణాల మెరుగుదల కారణంగా 1960-94 మధ్య కాలంలో శ్రామిక ఉత్పాదకతలో 5శాతం పెరుగుదల సంభవించింది. ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్‌లో శ్రామికుల తలసరి రాబడి 1980-95 మధ్య కాలంలో రెట్టింపు అయ్యింది.
  • ఆరోగ్యం, పౌష్టికాహార ప్రమాణాల పెరుగుదల కారణంగా ఉత్పాదకత, ఆదాయం, పౌష్టికాహారం అందుబాటు పెరుగుతుంది. సియారాలియాన్‌లో రైతుల, కెన్యాలో రోడ్డు నిర్మాణ శ్రామికుల ఉత్పాదకత పెరుగుదలకు అధిక కేలరీల ఆహారం అందుబాటు కారణమైంది.
ప్రభుత్వ పాత్ర
దేశ ప్రజల్లో విద్యా స్థాయి, నైపుణ్యత పెంపులో ప్రభుత్వ పాత్ర ప్రధానం. విద్య ద్వారా ప్రజల్లో నైపుణ్యత పెంపు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఉపకరిస్తుంది. అధిక విద్యా స్థాయి, నైపుణ్యత పెరుగుదల కారణంగా శ్రామికుల ఆదాయాలు పెరిగి తద్వారా వినియోగ వ్యయం పెరిగి ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. జీడీపీ వృద్ధిని నిర్ణయించే కారకాల్లో ముఖ్యమైనది ఉపాధి. అన్నీ విద్యా స్థాయిల్లో అర్జెంటీనా, బ్రెజిల్, క్యూబా, మారిషస్, చెక్ రిపబ్లిక్, గ్రీస్, హంగరీ, టర్కీ తమ దేశ పౌరులకు ఉచిత విద్యను అందించడం ద్వారా మానవ మూలధనం పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక ఆర్థిక వ్యవస్థలతో పోల్చినప్పుడు భారత్‌లో విద్య, ఆరోగ్య రంగాలపై వ్యయం తక్కువ. 2018-19 బడ్జెట్ అంచనాల ప్రకారం- భారత్‌లో విద్యపై వ్యయం జీడీపీలో 3 శాతం కాగా, ఆరోగ్యంపై వ్యయం 1.5 శాతం మాత్రమే. విద్య, సామర్థ్యం పెంపునకు సంబంధించి ప్రాథమిక, సెకండరీ స్థాయిలో మానవ మూల ధనంపై పెట్టుబడులు ఆర్థికవృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. సాంఘిక రంగాలపై అధిక ప్రభుత్వ వ్యయం కారణంగా శ్రీలంక అధిక మానవాభివృద్ధిని సాధించింది. భారత్‌లో రాష్ట్రాల మధ్య తలసరి ఆదాయం పరంగా వ్యత్యాసాలు పెరుగుతున్న క్రమంలో.. సామాజిక రంగ అభివృద్ధిలో వ్యత్యాసాలు తగ్గడాన్ని గమనించొచ్చు. ఈ స్థితి మానవాభివృద్ధి సాధనకు ప్రభుత్వ సామాజిక రంగ వ్యయ ప్రాధాన్యతను సూచిస్తున్నది!!

డా॥తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్
Published date : 24 Jan 2020 03:30PM

Photo Stories