Skip to main content

నూతన వాణిజ్య విధానం 2015-20

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఎగుమతులు డాలర్ రూపంలో రెట్టింపు కావడంతోపాటు ఎగుమతుల విస్తృతీకరణకు జరిగింది. వాణిజ్య సరళీకరణ విధానాల కొనసాగింపు, బహుళ ఒప్పందాలు వంటివి భవిష్యత్తులో భారత ఆర్థిక వృద్ధి రేటును పెంపొందిస్తాయి. వాణిజ్య ఒప్పందాల విషయంలో తగిన శ్రద్ధ వహిస్తే దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక ప్రగతిలో వాణిజ్య విధానం కీలక పాత్ర పోషిస్తుంది. అభిలషణీయ వాణిజ్య విధానాన్ని రూపొందించుకొని వాణిజ్య పరమైన అడ్డంకులను అధిగమిస్తే ఆర్థిక వృద్ధి రేటు వేగవంతమవుతుంది.

భారత విదేశీ వాణిజ్య విధానం - వివిధ దశలు ప్రభుత్వ విదేశీ వాణిజ్య విధానాన్ని నాలుగు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ (1952-53 నుంచి 1956-57), రెండో దశ (1956-57 నుంచి జూన్ 1966), మూడో దశ (రూపాయి మూల్యహీనీకరణ తర్వాత), నాలుగో దశ (1975-76 తర్వాత).

మొదటి దశ వాణిజ్య విధానంలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి సరళీకరణ చర్యలను అమలు చేశారు. తద్వారా దిగుమతుల్లో పెరుగుదల సంభవించింది. అయితే ఎగుమతుల్లో పెరుగుదల దిగుమతుల్లో పెరుగుదలకు అనుపాతంగా లేనందువల్ల వాణిజ్య లోటు పెరిగింది.

రెండో దశలో (1956-66)పణాళిక అవసరానికి అనుగుణంగా వాణిజ్య విధానాన్ని పునర్వ్యవస్థీకరించారు. దిగుమతుల నియంత్రణ, దిగుమతి ప్రత్యామ్నాయ చర్యలను అమలుచేస్తూ.. ఎగుమతుల ప్రోత్సాహక చర్యల్లో భాగంగా ఎగుమతుల విస్తృతీకరణకు ప్రాధాన్యమి చ్చారు. ఈ దశలో వాణిజ్య విధానాన్ని ముదలియార్ కమిటీ సమీక్షించింది.

ప్రభుత్వం 1966, జూన్‌లో దిగుమతుల నియంత్రణ, ఎగుమతుల ప్రోత్సాహానికి మూల్యహీనీకరణ చేపట్టడం వల్ల మూడో దశలో ఎగుమతుల ప్రోత్సాహానికి సంబంధించి మంచి ఫలితాలు వచ్చాయి. ప్రారంభంలో మూల్యహీనీకరణ వల్ల ఆశించిన ఫలితాలు రాకపోయినా, నాలుగో ప్రణాళిక నుంచి ఇది విదేశీ వాణిజ్యంపై ధనాత్మక ప్రభావాన్ని చూపింది. ఈ స్థితి 1975-76 వరకు కొనసాగింది.

నాలుగో దశలో ఎగుమతులను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం దిగుమతుల సరళీకరణ విధానాన్ని అవలంబించింది. జనతా ప్రభుత్వ కాలంలో ద్రవ్యోల్బణ విరుద్ధ దిగుమతుల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం దిగుమతుల సరళీకరణ విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వ దిగుమతి ఎగుమతి విధానం లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి.
  • ఎగుమతుల పెంపునకు ప్రోత్సాహకాలను అందించడం.
  • సంప్రదాయ పరిశ్రమల వృద్ధికి తగిన మద్దతివ్వడం.
  • వనరుల అభిలషణీయ వినియోగం.
  • సాంకేతిక పరిజ్ఞానం పెంపు.
  • ఎగుమతికి సంబంధించిన పరిశ్రమలకు తగిన మద్దతివ్వడం.
  • విదేశీ కరెన్సీని పొదుపు చేసేందుకు అనవసర (Non-essential) దిగుమతులపై నియంత్రణ విధింపు.
  • సంస్కరణలకు ముందు కాలంలో ప్రభుత్వం అవలంబించిన ఎగుమతి ప్రోత్సాహక విధానాలులక్ష్యసాధనలో వైఫల్యం చెందడానికి కింది అంశాలు కారణమయ్యాయి.
  • దీర్ఘకాల ఎగుమతి వ్యూహం పూర్తిగా లోపించడం.
  • ప్రాథమిక ఉత్పత్తుల ఎగుమతులను నిరుత్సాహపరచిన అంతర్గత, బహిర్గత సమస్యలు.
  • సాంకేతిక ప్రగతి తక్కువగా ఉండటం వల్ల ఎదురైన ఉత్పత్తి సమస్యలు.
  • స్వదేశీ విధానాలు లోపభూయిష్టంగా ఉండటంతోపాటు ఎగుమతుల పెంపునకు తగిన కృషి జరగకపోవడం.
  • వినిమయ రేటులో పెరుగుదల వల్ల దిగుమతుల్లో పెరుగుదల, ఎగుమతుల్లో క్షీణత ఏర్పడటం.

సంస్కరణల కాలంలో వాణిజ్య విధానాలు
ఉత్పత్తి, వాణిజ్య సంబంధిత సమస్యలను అధిగమించడం ద్వారా సంస్కరణల కాలంలో భారత ప్రభుత్వం ఎగుమతులను ప్రోత్సహించడానికి కింది విధానాలను అవలంబించింది.
  • 1991, జూలైలో ఎగుమతులను ప్రోత్సహించడానికి విదేశీ కరెన్సీతో పోల్చి రూపాయి విలువను 18% కుదించారు.
  • వాణిజ్యానికి సంబంధించి 1993, మేలో ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రాష్ట్రాలకు ప్రత్యేక నిధుల పంపిణీని ప్రతిపాదించింది.
  • టారిఫ్ నిర్మాణతపై చెల్లయ్య కమిటీ తన తుది నివేదికను 1993, జనవరిలో సమర్పించిన తర్వాత దిగుమతి సుంకాలను తగ్గించారు.
  • ట్రేడ్ అకౌంట్‌లో రూపాయి పూర్తి మార్పిడి - 1993-94
  • కరెంట్ అకౌంట్‌లో రూపాయి మార్పిడి -1994, ఆగస్టు.
  • విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు 2000, ఏప్రిల్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఎగుమతి, దిగుమతి విధానం-2001 ద్వారా వ్యవసాయ ఎగుమతుల జోన్‌లు ఏర్పాటు చేశారు.
నూతన ఎగుమతి వ్యూహాన్ని ప్రభుత్వం 1998, జనవరి 2న ప్రకటించింది. మధ్యకాలిక ఎగుమతి వ్యూహంలో భాగంగా అవస్థాపనాపరమైన సమస్యల తొలగింపు, పరపతి వ్యయం తగ్గింపు, ప్రత్యేక మార్కెట్లు, రంగాల అభివృద్ధికి తగిన చర్యలను చేపట్టడం ద్వారా వార్షిక ఎగుమతుల పెంపు.

మార్కెట్ అందుబాటు ప్రోత్సాహక పథకాన్ని 2001-02లో ప్రారంభించారు. తద్వారా విదేశాల్లో ఉత్పత్తుల మార్కెటింగ్ పెంపునకు చర్యలు చేపట్టారు.

2004-09 వాణిజ్య విధానంలో వ్యవసాయం, హ్యాండీక్రాఫ్ట్, హ్యాండ్లూమ్, వజ్రాలు, ఆభరణాలు, తోలు (లెదర్), ఫుట్‌వేర్ రంగాల అభివృద్ధికి ప్రత్యేక వ్యూహాలను రూపొందించారు. అలాగే స్వేచ్ఛా వాణిజ్యం, వేర్‌హౌస్ జోన్లకు సంబంధించి నూతన పథకం ప్రారంభించారు.

2009-14 వాణిజ్య విధానం ద్వారా కింది చర్యలను తీసుకున్నారు.
ఎ) ఫోకస్ మార్కెట్ పథకం కింద అందించే ప్రోత్సాహకాలను 2.5 శాతం నుంచి 3 శాతానికి పెంచారు.
బి) ఫోకస్ మార్కెట్ పథకం కింద 26 నూతన మార్కెట్లను గుర్తించాలని నూతన వాణిజ్య విధానం నిర్దేశించింది.వీటిలో 16 లాటిన్ అమెరికా, 10 ఆఫ్రికా, కామన్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (CIS)కు సంబంధించిన మార్కెట్లు ఉన్నాయి.
సి) వాణిజ్య విధానం ద్వారా పన్ను ప్రోత్సాహకాలు, తక్కువ వడ్డీ వద్ద బ్యాంకు పరపతి, డ్యూటీ ప్రోత్సాహకాలు, నూతన మార్కెట్లను గుర్తించడం, విదేశీ మార్కెట్లలో భారతవస్తు, సేవల డిమాండ్ పెంపునకు వ్యూహాలు వంటి విధానాలను ప్రకటించారు.

విదేశీ వాణిజ్య విధానం 2015-20
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2015, ఏప్రిల్ 1న ‘విదేశీ వాణిజ్య విధానం 2015-20’ను ప్రకటించింది. ప్రధానమంత్రి విజన్ అయిన ‘మేక్ ఇన్ ఇండియా’ను దృష్టిలో పెట్టుకుని ఎగుమతిదారులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని యూనిట్లు, వస్తు, సేవల ఎగుమతుల పెంపు, ఉపాధికల్పన వంటి అంశాలపై నూతన వాణిజ్య విధానం దృష్టి సారించింది.

తయారీ, సేవారంగానికి తగిన మద్దతునివ్వడంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మెరుగుపరచడంపై వాణిజ్య విధానం 2015-20 దృష్టిసారించింది. 2020 నాటికి ప్రపంచ వాణిజ్యంలో భారత్ ప్రధాన పాత్ర పోషించగలదని ప్రభుత్వం భావిస్తోంది.

2015-20 వాణిజ్య విధాన లక్ష్యాలు
  • 2013-14లో 465.9 బిలియన్ డాలర్లు ఉన్న వస్తు, సేవల ఎగుమతుల విలువను 2019-20 నాటికి 900 బిలియన్ డాలర్లకు పెంచడం.
  • ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను 2 నుంచి 3.5%కి పెంచడం.
  • ఎగుమతులను పెంపొందించడానికి రాష్ర్ట ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు ‘ఎగుమతుల ప్రోత్సాహక మిషన్’ ఏర్పాటు.
  • డిఫెన్స్, వ్యవసాయ, ఎకో ఫ్రెండ్లీ, హైటెక్ వస్తువులకు సంబంధించిన ఎగుమతులకు అదనపు ప్రోత్సాహకాలు.
  • Outward Shipmentను ప్రోత్సహించడానికి Merchandise Export from India Scheme (MEIS), Services Export from India Scheme (SEIS) ను ప్రవేశపెట్టడం.
  • పత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌ల)పై ఉన్న ఎగుమతి నిబంధనల తగ్గింపు, సెజ్‌లను MEIS, SEI పథకాల పరిధిలోకి తేవడం ద్వారా వాటిని పెట్టుబడి కేంద్రాలుగా తీర్చిదిద్దడం.
  • మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని విదేశీ వాణిజ్య విధానం అమలు.
ఈ-కామర్స్ ను ప్రోత్సహించడంలో ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పరిశ్రమలను ఎంపిక చేస్తుంది. ఈ-కామర్స్ ఎగుమతుల్లో హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, బుక్స్, పీరియాడికల్స్, లెదర్ ఫుట్‌వేర్, ఆట వస్తువులు, ఫ్యాషన్ గార్మెంట్స్ భాగంగా ఉంటాయి.

గతంలో ఉన్న వార్షిక వాణిజ్య విధాన సమీక్షకు భిన్నంగా, రెండున్నరేళ్ల తర్వాత సమీక్షించడం.
నూతన విదేశీ వాణిజ్య విధానంతోపాటు FTP Statementను విడుదల చేశారు. ఇందులో విజన్, లక్ష్యాలు, విదేశీ వాణిజ్య విధానంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో ఎదురయ్యే అవరోధాలు, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను వివరించారు. మార్కెట్, ఉత్పత్తి వ్యూహం, వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు, అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, వాణిజ్య ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గురించి విదేశీ వాణిజ్య విధాన ప్రకటనలో పొందుపరిచారు. విదేశీ వాణిజ్య విధానం 2015-20కి అనుకూలంగా పారిశ్రామిక వర్గాలు స్పందించాయి. నూతన విదేశీ వాణిజ్య విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపడటంతోపాటు లావాదేవీల వ్యయాల తగ్గుదల, సెజ్‌లలోని యూనిట్లకు ప్రయోజనాలు చేకూరతాయని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడ్డాయి.

వాణిజ్య విధానం అమలులో ఎదురవుతున్న సమస్యలు
నరేంద్రమోదీ 2014, మేలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తర్వాత భారత్‌ను స్వేచ్ఛా వ్యాపార దేశంగా మార్చాలని భావించారు. స్వేచ్ఛా వ్యాపార అనుకూల విధానాలు ఆర్థిక వృద్ధి రేటును పెంపొందిస్తాయని అభిలషించారు. పరిశ్రమల రంగంలో సరళీకరణ విధానాల ద్వారా విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలని భారత్ కోరుకుంటోంది. మరో వైపు దిగుమతులను తగ్గించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు సంబంధించి రక్షిత విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవైపు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తూనే.. మరోవైపు దిగుమతులపై ఆంక్షల విధానాన్ని అవలంబించడం వంటి పరస్పర విరుద్ధ సందేశాల ఫలితంగా విదేశీ పెట్టుబడిదారుల్లో గందరగోళం ఏర్పడింది.

సంస్కరణలకు సంబంధించి మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా విదేశీ పెట్టుబడిదారులకు భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరగడంతోపాటు వ్యాపారానికి సంబంధించి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులకు కే్రంద బిందువుగా నిలిచింది. ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) నియమావళిని సులభతరం చేయడంతో పాటు సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థకుసంబంధించి ప్రణాళికను ప్రకటించింది. శ్రామిక, భూమి, జీఎస్‌టీకి సంబంధించి సంస్కరణల అమలును ప్రభుత్వం వేగవంతం చేసింది. 2013-14తో పోల్చితే 2014-15లో ఎఫ్‌డీఐల్లో 23 శాతం పెరుగుదల ఏర్పడింది.

స్వదేశీ పరిశ్రమలకు సంబంధించి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా విదేశీ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల విశ్వాసం నెమ్మదిగా తగ్గుతోంది. స్వదేశీ ఉక్కు పరిశ్రమల విషయంలో ఎదురైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం సేఫ్‌గార్‌‌డ డ్యూటీలు, యాంటీ డంపింగ్ చర్యలను గతేడాది సెప్టెంబర్, డిసెంబర్‌లలో తీసుకుంది. ఈ చర్యలు గాట్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతోపాటు స్వేచ్ఛా వ్యాపార వాతావరణ ఏర్పాటుకు అవరోధంగా నిలిచాయి. భారత ప్రభుత్వ విధానంలో అస్థిర ధోరణి కారణంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లక్ష్య సాధనలో వెనుకబడే అవకాశం ఉంది. విదేశీ కంపెనీలు తమ ఉత్పత్తులకు సంబంధించి ముఖ్యమైన వస్తువులు, ఇతర పరికరాలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

మేక్ ఇన్ ఇండియా వ్యూహం, ఎఫ్‌డీఐలకు ఇన్‌ఛార్‌‌జగా వ్యవహరించే పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక డిపార్‌‌టమెంట్ (DIPO) సరళీకరణ విధానాలకు అనుకూలంగా ఉంది. ద్వైపాక్షిక, ప్రాంతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, బహుళ వాణిజ్య ఒప్పందాలకు ఇన్‌చార్‌‌జగా వ్యవహరించే డిపార్‌‌టమెంట్ ఆఫ్ కామర్‌‌స... ఒప్పందాలకు సంబంధించి జాగ్రత్తలు పాటిస్తుంది. ఈ క్రమంలో నూతన వాణిజ్య విధానం గందరగోళంగా ఉందని భావించవచ్చు.
Published date : 29 Sep 2016 02:20PM

Photo Stories