Skip to main content

భారత విదేశీ వాణిజ్య ధోరణులు

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు ముందు విదేశీ వాణిజ్యంలో(ముఖ్యంగా ఎగుమతుల రంగంలో) చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులు చాలా తక్కువ. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తులు, యంత్రాలు, పరికరాల దిగుమతుల్లో సంభవించిన మార్పులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సంస్కరణల అనంతరం విదేశీ వాణిజ్య ధోరణి, ప్రక్రియ, నిర్మాణతలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. 1995-96 తదనంతరం భారత వస్తు ఎగుమతుల్లో ప్రాథమిక ఉత్పత్తుల వాటా తగ్గి వస్త్రాలు, రసాయనాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల వాటా పెరిగింది. శ్రమసాంద్రత ఉత్పత్తులైన ఆహార ఉత్పత్తులు, వజ్రాలు, ఆభరణాలు, వస్త్రాల ఎగుమతులు.. మొత్తం ఎగుమతుల్లో సుమారు 50 శాతంగా నిలిచాయి. పారిశ్రామికీకరణ ముందుదశగా ఈ నిర్మాణతను పేర్కొనవచ్చు.

1991 తర్వాత దేశంలో కీలక వాణిజ్య విధాన సంస్కరణలను అమలుచేశారు. స్వదేశీ మార్కెట్‌లో ప్రైస్ సీలింగ్ విధించడంతో ఫార్మా ఎగుమతులపై ధనాత్మక ప్రభావం ఏర్పడింది. అధిక సాంకేతికతతో కూడిన తయారీ ఎగుమతులు.. రసాయన, ఫార్మా పరిశ్రమల్లో కేంద్రీకృతమయ్యాయి. బలహీన డిమాండ్, చమురు ధరల్లో అనిశ్చితి కారణంగా 2014 డిసెంబర్- 2016, సెప్టెంబర్ కాలంలో ఎగుమతుల్లో వృద్ధి క్షీణించింది. తాజాగా పెద్దనోట్ల రద్దుతో 2016, నవంబర్ తర్వాత స్వదేశీ ఆర్థిక కార్యకాలపాలు తగ్గుముఖం పట్టాయి.

1947కు పూర్వం విదేశీ వాణిజ్యం
స్వదేశీ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో ఎగుమతి, దిగుమతులపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఉత్పత్తి అనేది ఉత్పత్తి కారకాల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. తద్వారా విదేశీ వాణిజ్యంలో ఆర్థిక వ్యవస్థ తులనాత్మక ప్రయోజనం పొందుతుంది. భూమి, శ్రామికుల లభ్యత అధికంగా ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మూలధన కొరతను ఎదుర్కొంటుంది. శ్రమసాంద్రత వస్తువుల ఉత్పత్తిలో భారత్ పనితీరు మెరుగ్గా ఉంది. 19వ శతాబ్దం రెండో అర్ధభాగంలో భారత్‌లో వాణిజ్యం ప్రసిద్ధి చెందింది. 1900-1914 మధ్యకాలంలో భారతవిదేశీ వాణిజ్యం విస్తరించింది. నూనెగింజలు, ప్రత్తి, జౌళి, టీ ఉత్పత్తులు పెరగడంతో దేశ ఎగుమతులు సైతం పెరిగాయి.

భారత విదేశీ వాణిజ్యంపై మొదటి ప్రపంచయుద్ధం తీవ్ర ప్రభావం చూపింది. ముడిసరుకులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం, యుద్ధకాలంలో విధించిన నియంత్రణల తొలగింపుతో మొదటి ప్రపంచయుద్ధానంతరం భారత్ నుంచి ఎగుమతులు పెరిగాయి. మరోవైపు స్వదేశీ ఉత్పత్తుల పెంపునకు అవసరమైన దిగుమతులు కూడా పెరిగాయి. 1930వ దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం భారత విదేశీ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపింది. వస్తు ధరలు తగ్గడం, వినియోగదారుల కొనుగోలుశక్తి తగ్గడం, బ్రిటిష్ ప్రభుత్వం అవలంభించిన విచక్షణతో కూడిన విధానాల కారణంగా ఆర్థికమాంద్య కాలంలో భారత విదేశీ వాణిజ్యం క్షీణించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అధిక ఎగుమతుల మిగులు కారణంగా భారత్ అధిక మొత్తంలో స్టెర్లింగ్ బ్యాలెన్స్‌ను ఆర్జించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి దిగుమతి అవసరాలు భారీగా పెరిగాయి. దేశ విభజనతో ఆహారం, ముడిసరుకుల లోటు ఏర్పడింది. ముడి ప్రత్తి, ముడి జౌళి వంటి ఉత్పత్తుల ఎగుమతుల మిగుల్లో తగ్గుదల సంభవించింది. స్వదేశీ పారిశ్రామిక అవసరాల కారణంగా నూనెగింజలకు డిమాండ్ ఏర్పడింది. మరోవైపు ప్రాథమిక ఉత్పత్తులైన సుగంధ ద్రవ్యాలు, మైకా, వెజిటబుల్ ఆయిల్ ఎగుమతులు పెరిగాయి. దాంతో భారత్ వాణిజ్య లోటును కొంతమేర అధిగమించింది. యుద్ధానికి ముందు కాలంతో పోల్చితే 1946-47లో ఎగుమతుల పరిమాణం 2/3 వంతు మాత్రమే.

స్వాతంత్య్రానికి ముందు ముడిసరుకులు, ప్లాంటేషన్ క్రాప్స్ భారత్ నుంచి ప్రధాన ఎగుమతులు కాగా, తేలికైన వినియోగ వస్తువులు, తయారీ ఉత్పత్తులు ప్రధాన దిగుమతులుగా ఉన్నాయి. ఈ కాలంలో విదేశీ పాలకుల నిర్లక్ష్యం భారత విదేశీ వాణిజ్యంపై స్పష్టంగా కనిపించింది. భారత్ నుంచి ముడిసరుకులు ఎగుమతి చేసి బ్రిటన్ నుంచి తయారీ వస్తువులను దిగుమతి చేసుకొనే విధానాన్ని బ్రిటీష్ పాలకులు అవలంబించారు. ఇందులో భాగంగానే భారత్‌లో అంతిమ వస్తువుల ఉత్పత్తిని ప్రోత్సహించలేదు. ఒకానొక సమయంలో భారత ఎగుమతుల్లో ప్రధానంగా ఉన్న కాటన్ టెక్స్‌టైల్స్ బ్రిటిష్ ప్రభుత్వ విధానాలతో క్షీణించాయి.

స్వాతంత్య్రానంతర విదేశీ వాణిజ్యం
1950-51లో భారత ఎగుమతుల్లో ప్రాథమిక ఉత్పత్తులు కీలకంగా నిలిచాయి. జీడిపప్పు, నల్ల మిరియాలు, టీ, బొగ్గు, మైకా, మాంగనీస్ ఓర్, ముడి ప్రత్తి, వెజిటబుల్ ఆయిల్ వంటి ప్రాథమిక ఉత్పత్తులు ప్రధాన ఎగుమతులుగా ఉన్నాయి. భారత మొత్తం ఎగుమతుల్లో వీటి వాటా 34 శాతం కాగా, మాధ్యమిక ఉత్పత్తుల వాటా 41 శాతం. ఈ ఉత్పత్తులు వ్యవసాయ ఆధారితం కావడంతో వీటి విలువ తక్కువగా ఉండేది. ఫలితంగా 1950వ దశకంలో భారత్ చెల్లింపుల శేషంలో సంక్షోభం ఎదుర్కొంది. రెండో ప్రపంచయుద్ధ కాలంలో ఆర్జించిన స్టెర్లింగ్ మిగులు 1950వ దశకం మధ్యభాగానికి కరిగిపోయింది. పెరుగుతున్న దిగుమతుల డిమాండ్‌కు అనుగుణంగా ఎగుమతుల రాబడిలో పెరుగుదల ఏర్పడలేదు. వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం వంటి అంశాలు ..భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి కారణమయ్యాయి. సూయిజ్ కాలువ మూసివేత అంశం కూడా స్వదేశీ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచింది. ఫలితంగా భారత్ విదేశీ మారకద్రవ్య సంక్షోభం ఎదుర్కొంది. 1950వ దశకం చివరి నాటికి ప్రభుత్వ దిగుమతుల్లో పెరుగుదల అధికంగా ఉంది. ఈ కాలంలో భారత్ ఆహార ఉత్పత్తులను సైతం దిగుమతి చేసుకుంది. 1958-59తో పోల్చితే 1959-60లో చెల్లింపుల శేషం స్థితి కొంతమేర మెరుగైంది. 1950-60లో ఎగుమతుల్లో పెరుగుదల, దిగుమతుల్లో తగ్గుదల ఏర్పడింది. ఎగుమతుల ప్రగతి ఆధారంగా ముడి సరుకులు, పరికరాలు, విడిభాగాల దిగుమతులకు ప్రత్యేక లెసైన్సులు ఇచ్చారు. భారత్ కొన్ని ఉత్పత్తులపై ఎగుమతుల డ్యూటీని తగ్గించడం, ఎగుమతులపై పరిమాణాత్మక ఆంక్షలను తొలగించడం, నూనెలపై ఎగుమతి కోటాలను సరళీకరించడం వంటి చర్యలు తీసుకుంది.

1960-61లో ప్రభుత్వ, ప్రైవేటు దిగుమతుల్లో పెరుగుదల ఏర్పడింది. ఈ కాలంలో ప్రభుత్వం 12 ఎగుమతి ప్రోత్సాహక కౌన్సిళ్లను ఏర్పాటు చేసి ఎగుమతి ప్రోత్సాహక చర్యలు తీసుకుంది. దీంతోపాటు ప్రత్యేక ఎగుమతి పథకాలను ప్రవేశపెట్టింది. ఎగుమతి ఉత్పత్తుల ఆధారంగా పెద్ద సంఖ్యలో దిగుమతి లెసైన్సులు ఇచ్చింది. రుణ సర్వీసు ఒత్తిడి పెరుగుదల, ఐఎంఎఫ్‌కు చెల్లించే రీపేమెంట్‌లో పెరుగుదల, ఆహార ఉత్పత్తుల పెరుగుదల కారణంగా 1964-65లో చెల్లింపుల శేషంలో సంక్షోభం తలెత్తింది. ఆర్థిక సంక్షోభం కారణంగా భారత్ 1966, జూన్‌లో మూల్యహినీకరణను చేపట్టింది. డాలర్‌కు సంబంధించి రూపాయి విలువలో క్షీణత 57.5 శాతం (రూ.4.7 నుంచి రూ.7.5 ప్రతి డాలరుకు). మూల్యహినీకరణ ముందు వినిమయరేటు వద్ద ప్రపంచ ధరలతో పోల్చితే స్వదేశీ ద్రవ్యోల్బణం కారణంగా భారత్‌లో ధరలు అధికంగా ఉన్నాయి. 1966లో భారత్‌కు విదేశీ సహాయం నిలిచిపోవడం కూడా మూల్యహినీకరణ చేపట్టడానికి ఒక కారణమైంది. 1965-66లో యుద్ధం కారణంగా దేశ మొత్తం వ్యయంలో రక్షణ వ్యయం 24 శాతంగా నిలిచింది. 1965-66లో దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ధరల్లో 10 శాతానికి పైగా పెరుగుదల ఏర్పడింది. దిగుమతి, ఎగుమతి విధానం-1985-88 ప్రకటించేంత వరకు భారత్..దేశ పరిస్థితులు, తీవ్రతకు అనుగుణంగా పరిణామాత్మక ఆంక్షల విధానాన్ని అవలంబించింది.

2016-17లో భారత విదేశీ వాణిజ్యం
చైనా, భారతదేశం మధ్య సంస్థాగత చర్చలు, ద్వైపాక్షిక సమావేశాల ద్వారా చైనాలోని వాణిజ్య ప్రదర్శనల్లో భారత ఉత్పత్తులను ప్రదర్శించే దిశగా దేశీయఎగుమతిదారులకు ప్రోత్సాహం లభించింది. 2015-16లో చైనాకు సంబంధించి భారత వాణిజ్య లోటు 52.69 బిలయన్ డాలర్లు కాగా , 2016-17లో 51 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2016-17లో చైనాతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 71.48 బిలయన్ డాలర్లుగా నమోదైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు సంబంధించి మొత్తం ఎగుమతుల విలువ రూ.18,52,339.65 కోట్లు కాగా, మొత్తం దిగుమతుల విలువ రూ. 25,77,417.43 కోట్లు. ఇదే ఆర్థిక సంవత్సరంలో మొత్తం వాణిజ్య లోటు రూ. 7,25,077.78 కోట్లుగా నమోదైంది. తయారీ ఉత్పత్తులు, మార్కెట్ లభ్యత, సేవలు, ఇతర వాణిజ్యేతర అడ్డంకులకు సంబంధించి భారత్ అనేక దేశాలతో సంప్రదింపులు జరిపింది. గత మూడేళ్లలో రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్‌లకు సంబంధించి భారత్‌కు వాణిజ్యలోటులో పెరుగుదల ఏర్పడింది.

2020 నాటికి ప్రపంచ వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించేలా భారత్‌ను తీర్చిదిద్దడానికి 2015-2020 విదేశీ వాణిజ్య విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఎగుమతుల్లో భారత్ వాటాను 2 శాతం నుంచి 3.5 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వస్తు, సేవల ఎగుమతుల విలువ 2013-14లో 465.9 బిలియన్ డాలర్లు కాగా, 2019-20 నాటికి 900 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించింది.
Published date : 21 Nov 2017 12:05PM

Photo Stories