Skip to main content

భారత ఆర్థిక వ్యవస్థపై బ్రెగ్జిట్ ప్రభావం

డా॥తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్.
బ్రిటన్‌లో 2016, జూన్ 23న నిర్వహించిన రిఫరెండమ్‌లో మొత్తం ఓటర్లలో 51.9 శాతం మంది ప్రజలు యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడానికి (బ్రెగ్జిట్) మద్దతు తెలపగా, 48.1 శాతం మంది ఈయూలో బ్రిటన్ కొనసాగాలని అభిలషించారు. తద్వారా ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ ప్రభావం భారత్‌పై ఏ మేరకు ఉందో చూద్దాం...

బ్రిటన్, ఈయూ ఆర్థిక సంబంధాలు
యూరోపియన్ యూనియన్ ఆర్థిక విస్తీర్ణం (ఎకనమిక్ ఏరియా)లో బ్రిటన్ వాటా 14.8 శాతం కాగా, జనాభాలో బ్రిటన్ వాటా 12.5 శాతం. యూరోపియన్ యూనియన్ అంతర్గత వాణిజ్యాన్ని మినహాయిస్తే మొత్తం ఈయూ ఎగుమతుల్లో బ్రిటన్ వాటా 19.4 శాతం. సంప్రదాయంగా ఈయూతో బ్రిటన్ పటిష్ట వాణిజ్య సంబంధాలను కలిగి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక పరిణామాలు సంభవించినా 2014లో బ్రిటన్ వస్తు, సేవల ఎగుమతుల్లో ఈయూ వాటా 44.6 శాతంగా, బ్రిటన్ దిగుమతుల్లో ఈయూ వాటా 53.2 శాతంగా నిలిచాయి. 1999 నుంచి 2014 మధ్య కాలంలో బ్రిటన్ సగటు సాంవత్సరిక ఎగుమతుల వృద్ధి 3.6 శాతంగా, ఈయూ బయటి దేశాలతో ఎగుమతుల వృద్ధి 6.5 శాతంగా నమోదైంది. ఈయూ బయటి దేశాలతో వాణిజ్య సంబంధాలను బ్రిటన్ మెరుగుపర్చుకొన్న క్రమంలో బ్రిటన్ ఎగుమతుల్లో ఈయూ వాటా 1999లో 54.8 శాతం నుంచి 2014లో 44.6 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి సంబంధించి ఈయూ నుంచి బ్రిటన్ వస్తు, సేవల దిగుమతుల్లో సగటు సాంవత్సరిక వృద్ధి 4.7 శాతంగా, ఈయూ బయటి దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తు, సేవల్లో వృద్ధి 5.5 శాతంగా నమోదైంది. ఈయూ నుంచి దిగుమతి చేసుకున్న వస్తు, సేవల విలువల్లో వృద్ధి, బ్రిటన్ ఈయూకు చేసిన ఎగుమతుల విలువలో వృద్ధి కంటే అధికంగా ఉన్నందువల్ల బ్రిటన్ వాణిజ్య లోటు పెరిగింది. ఈయూకు సంబంధించి బ్రిటన్ వాణిజ్య లోటు 1999లో 11.2 బిలియన్ పౌండ్లు కాగా, 2014లో 61.6 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ఈయూతో బ్రిటన్ వాణిజ్య సేవల కంటే వస్తు వాణిజ్య వాటానే ఎక్కువ. 2014లో బ్రిటన్ ఈయూకు చేసిన మొత్తం ఎగుమతుల్లో వస్తు వాణిజ్యం వాటా 2/3వ వంతుగా నిలిచింది. 1999 నుంచి 2014 మధ్య కాలంలో ఈయూ నుంచి బ్రిటన్‌కు దిగుమతైన వస్తువుల సగటు సాంవత్సరిక వృద్ధి 4.9 శాతం. సేవల వాణిజ్యంలో బ్రిటన్ స్థితి ఆశాజనకంగా ఉంది. 2005 తర్వాతి కాలంలో బ్రిటన్ సేవల వాణిజ్యంలో మిగులు ఏర్పడి 2014లో ఈ మిగులు 15.4 బిలియన్ పౌండ్లకు పెరిగింది. ఈయూ బయటి దేశాలకు సంబంధించి బ్రిటన్ వస్తు, సేవల దిగుమతుల విలువ కంటే బ్రిటన్ నుంచే ఆయా దేశాలకు అయిన ఎగుమతుల విలువ అధికంగా ఉండటానికి సేవల ఎగుమతులు కారణమయ్యాయి. బ్రిటన్‌కు సంబంధించి ఈయూ ప్రధాన పెట్టుబడిదారుగా నిలవగా, బ్రిటన్ పెట్టుబడులు కూడా ఎక్కువగా ఈయూలో జరిగాయి.

బ్రెగ్జిట్ - పరిణామాలు
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడం వల్ల బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుందని బ్రెగ్జిట్ మద్దతుదారులు అభిప్రాయపడ్డారు. మరోవైపు బ్రిటన్ వృద్ధి రేటు క్షీణించడమే కాకుండా 36 బిలియన్ పౌండ్ల పన్ను రాబడిని కోల్పోతుందని బ్రెగ్జిట్‌ను వ్యతిరేకించేవారు పేర్కొన్నారు. బ్రెగ్జిట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల వృద్ధిలో క్షీణత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్య కరెన్సీలతో పోల్చినప్పుడు పౌండ్ విలువలో క్షీణత ఏర్పడుతుంది. ఈయూతో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి చర్చల విషయంలో అమెరికా, భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థల నుంచి బ్రిటన్ పోటీని ఎదుర్కొంటుంది. బ్రిటన్ ప్రస్తుతం తన చట్టాల్లో మార్పులు తీసుకురావడంతోపాటు ఆర్థిక నిర్ణయాల విషయంలో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉన్నందువల్ల వలసలు తగ్గుతాయి. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ప్రధాని కామెరాన్ తగ్గించిన నిరుద్యోగ భృతి, పిల్లల పెంపక భృతిని తర్వాత వచ్చే నూతన ప్రభుత్వం పెంచాల్సిన స్థితి ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వంపై ఆర్థికభారం పెరుగుతుంది. పని సంబంధిత వీసా నియంత్రణల కారణంగా బ్రిటిష్ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించే విద్యార్థుల సంఖ్య 2012-13లో 22,385 నుంచి 2014-15లో 18,320కి తగ్గింది. బ్రిటిన్ జాతీయ గణాంకాల ప్రకారం 9,42,000 మంది ఈస్ట్రన్ యూరోపియన్లు, రొమేనియన్లు, బల్గేరియన్లు బ్రిటన్‌లో పనిచేస్తున్నారు. వీరితోపాటు 7,91,000 మంది వెస్ట్రన్ యూరోపియన్లు, 2.93 మిలియన్ల శ్రామికులు, ఈయూ బయటి దేశాల నుంచి వచ్చిన వారు బ్రిటన్‌లో ఉపాధి పొందుతున్నారు. బ్రిటన్‌లో విదేశీ శ్రామికులకు చైనా, ఇండియా ముఖ్య ఆధారాలుగా నిలిచాయి. నూతన ప్రభుత్వం ఆర్థిక నిర్ణయాల్లో భాగంగా విద్యతోపాటు, నేషనల్ హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవలను ఉచితంగా అందించే విషయంలో వలస వచ్చిన ప్రజలకు సంబంధించి నిబంధనలు విధించొచ్చు.

బ్రిటన్ తర్వాతి కార్యాచరణ
ఈయూ, ఈయూలోని ఏ ప్రత్యేక దేశంతోనూ భవిష్యత్ సంబంధాల గురించి పటిష్ట ప్రణాళికను బ్రిటన్ రూపొందించుకోలేదు. యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశానికి సంబంధించి ఎదురయ్యే వాణిజ్య అడ్డంకుల తొలగింపు, వస్తు, మూలధనం తదితరాలపై ఈయూతో నూతన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో బ్రిటన్‌కు రెండో అతిపెద్ద ఆధారంగా భారతదేశం నిలిచింది. భారతీయ కంపెనీలు తమ కర్మాగారాలను బ్రిటన్‌లో ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను యూరప్ స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థలో భాగంగా ఇతర యూరప్ దేశాల్లో విక్రయించేవి. భారత్ నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు పన్ను, ఇతర విత్త ప్రోత్సాహకాలు, తక్కువ నియంత్రణలను భారతీయ కంపెనీలకు బ్రిటన్ అందించాలి. ప్రపంచంలో అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికాతో ఈయూ చర్చిస్తోంది. ఈ ప్రయత్నంలో బ్రిటన్ కూడా భాగస్వామి కావడం ద్వారా తన వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలి. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే 2030 నాటికి బ్రిటన్ జీడీపీలో 2.2 శాతం నష్టం సంభవిస్తుందని ‘ఓపెన్ యూరప్’ అధ్యయనం స్పష్టం చేసింది. కానీ యూరప్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని బ్రిటన్ కుదుర్చుకుంటే జీడీపీలో 1.6 శాతం పెరుగుదల ఉంటుందని ఈ అధ్యయనం పేర్కొంది.

భారత ఆర్థిక వ్యవస్థపై బ్రెగ్జిట్ ప్రభావం
యూరప్‌లో ప్రవేశానికి బ్రిటన్‌ను ‘గేట్ వే’గా భారత్ పరిగణిస్తుంది. అనేక భారతీయ కంపెనీలు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదయ్యాయి. చాలా కంపెనీల హెడ్‌క్వార్టర్లు లండన్‌లో ఉన్నాయి. భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం బ్రిటన్‌లో 800 భారతీయ కంపెనీలున్నాయి. ఇండియా ట్రాకర్ - 2016 అభిప్రాయం ప్రకారం భారతీయ కంపెనీలు 1,10,000 మందికి ఉపాధి కల్పించాయి. చాలా భారతీయ కంపెనీల్లో వృద్ధి రేటు పది శాతానికి పైగా ఉంది. బ్రిటన్‌లో అత్యంత వేగంగా వృద్ధి నమోదు చేసుకున్న రంగాలైన టెక్నాలజీ, టెలికామ్, ఫార్మాస్యూటికల్స్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో నిమగ్నమైన భారతీయ కంపెనీల టర్నోవర్ 2015లో 22 బిలియన్ పౌండ్లు. భారతీయ కంపెనీల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో వృద్ధి వరుసగా 8.86, 7.28 శాతం. టర్నోవర్ విషయంలో టాటా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. నూతన ప్రభుత్వం అవలంబించే విధానాలు భారతీయ కంపెనీలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలున్నాయి. ఈయూతో వాణిజ్యానికి గేట్‌వేగా ఇకపై బ్రిటన్‌ను పరిగణించలేం.
  • 2007 నుంచి భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఈయూతో చర్చలు జరుపుతోంది. బ్రెగ్జిట్ ప్రభావం దీనిపై ప్రత్యక్షంగా ఉండొచ్చు.
  • బ్రెగ్జిట్ కారణంగా యూరప్, బ్రిటన్‌లో నూతన హెడ్ క్వార్టర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు ఆయా కంపెనీల ఓవర్‌హెడ్ కాస్ట్ పెరుగుతుంది.
  • బ్రెగ్జిట్ కారణంగా ఈయూలోని ఇతర దేశాలతో భారత్ తన సంబంధాలను మెరుగుపర్చుకోవాలి. ఇప్పటికే నెదర్లాండ్‌‌స, ఫ్రాన్‌‌స, జర్మనీలతో వాణిజ్య చర్చలను భారత్ నెరపుతోంది.
    ప్రస్తుతం భారత్‌కు సంబంధించి నెదర్లాండ్‌‌స అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారుగా నిలిచింది. బ్రెగ్జిట్ కారణంగా అతిపెద్ద ఈయూ మార్కెట్‌లో ప్రవేశం కోసం ఇతర ఈయూ దేశాలతో వాణిజ్య భాగస్వామ్యాన్ని భారత్ ఏర్పర్చుకోవాలి.
  • బ్రిటన్, ఈయూ పౌరులకు సబ్సిడీతో బ్రిటిష్ యూనిర్సిటీలు విద్యావకాశాలు కల్పించేవి. బ్రెగ్జిట్ కారణంగా ఈయూ పౌరులకు స్కాలర్‌షిప్‌లను యూనివర్సిటీలు నిలిపివేసే అవకాశం ఉంది.
  • భారత్‌ను తన వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామిగా మార్చుకునేందుకు ఈయూ ప్రయత్నించొచ్చు. రాజకీయ కారణాల నేపథ్యంలో యూఎస్, చైనాను కౌంటర్ బ్యాలెన్‌‌స చేసే క్రమంలో ఈయూ భారత్‌పై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉంది.
Published date : 01 Jul 2016 04:55PM

Photo Stories