Skip to main content

తత్వం బోధపడింది... గేట్ ర్యాంకు సొంతమైంది

ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నన్ని రోజులు జాలీడేస్.. పట్టా పుచ్చుకొని బయటికొస్తే అసలు సంగతి బోధపడింది. నేర్చుకోవాల్సిన సబ్జెక్టు ఎంతో ఉందని తెలుసుకున్నా. హైదరాబాద్‌లో ఉంటే చదువు పట్టాలెక్కదని ఢిల్లీ బాట పట్టా.. ఆపై కష్టపడి చదివి, గేట్-2018లో 47వ ర్యాంకు సాధించానంటున్న వంశీ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ ఆయన మాటల్లోనే..
మాది సిద్దిపేట. నాన్న బాలకృష్ణారెడ్డి స్థానికంగా హోమ్ అప్లియెన్సెస్ షాప్ నిర్వహిస్తారు. అమ్మ సంధ్య గృహిణి. చెల్లెలు శ్వేతా ఇటీవల ఏఈగా ఎంపికైంది. నేను చదువుల్లో సగటు విద్యార్థిని. పదో తరగతిలో 553 మార్కులు, ఇంటర్‌లో 908 మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్ ఎన్‌ఐటీ వరంగల్‌లో పూర్తిచేశాను. గేట్‌లో ఆలిండియా 47వ ర్యాంకుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరే అవకాశముంది. అయితే నేను ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ) సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఇటీవలే ఈఎస్‌ఈ మెయిన్స్ పరీక్షలు రాసి... ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నా.

నోవార్టిస్‌లో ఉద్యోగం.. ఆరు నెలలే !
ఇంజనీరింగ్ ప్లేస్‌మెంట్స్‌లో నోవార్టిస్‌లో ఉద్యోగం వరించింది. హైదరాబాద్ హైటెక్‌సిటీలో డేటా అనలిస్ట్‌గా ఉద్యోగం. రూ.7 లక్షల ప్యాకేజీ. అయితే నేను ఇంజనీరింగ్‌లో సబ్జెక్ట్ ఏమీ నేర్చుకోలేదనే విషయం ఇంజనీరింగ్ పూర్తయ్యాక కాని నాకు అర్థం కాలేదు. ఉద్యోగంలో చేరకుండా.. ఈఎస్‌ఈకు కోచింగ్ తీసుకొని సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలని భావించా. కానీ కొన్నాళ్ల పాటు ఉద్యోగం చేశాక లక్ష్యంపై ఒక స్పష్టత వస్తుందన్న అమ్మానాన్న సలహాతో ఉద్యోగంలో చేరా. అయిష్టంగానే చేరడంతో ఆర్నెల్లకే ఉద్యోగం వదిలి.. ఢిల్లీ వెళ్లి కోచింగ్‌లో చేరిపోయా. 2017 ఫిబ్రవరిలో మొదలైన కోచింగ్‌తో సబ్జెక్ట్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఏడాది పాటు చదువే లోకంగా నిర్విరామంగా పుస్తకాలతో కుస్తీ పట్టా. ఈఎస్‌ఈకు కోచింగ్ తీసుకుంటే గేట్‌కు కూడా పూర్తి సన్నద్ధత లభిస్తుంది. ఆ విధంగా 2018 గేట్‌లో 47వ ర్యాంకు వచ్చింది.

పీఎస్‌యూల్లో చేరాలని లేదు :
ఇప్పుడు నాకు వచ్చిన గేట్ ర్యాంకుతో ప్రభుత్వ రంగసంస్థల్లో ఉద్యోగం వస్తుంది. కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్ సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. గేట్ ర్యాంకుతో ఐఐటీలో చేరితే చదువుకోవడానికి అనువైన వాతావరణం లభిస్తుందన్న కారణంగానే ఐఐటీ మద్రాసులో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌లో చేరా. ప్రస్తుతం ఇక్కడే ఉండి ఈఎస్‌ఈ పరీక్షకు ప్రిపేరవుతున్నా.

స్థిరంగా ప్రిపరేషన్...
గేట్ అభ్యర్థులు ఐదో సెమిస్టర్ నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. గేట్‌కు పోటీ ఏటా పెరుగుతోంది. కాబట్టి సిలబస్‌లో ఏ ఒక్క అంశాన్ని వదలకూడదు. మ్యాథ్స్ కీలకమైంది. సులువుగా 15 మార్కులు పొందొచ్చు. ప్రిపరేషన్‌లో స్థిరంగా ముందుకు వెళ్లాలి. నా ప్రిపరేషన్‌లో భాగంగా ఆరు గంటల పాటు క్లాసులు, ఆ తర్వాత ఇంటికి వెళ్లి చదివేవాడిని. ఏడాది పొడవునా పూర్తి సమయం ప్రిపరేషన్‌కే కేటాయించాను. కోచింగ్ తీసుకునే విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాసులకు హాజరుకావాలి. నేను ఎప్పటికప్పుడు మాక్‌టెస్టులు రాస్తూ పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకెళ్లా. ప్రిపరేషన్ ప్రారంభం నుంచి ప్రతి అంశాన్నీ అధ్యయనం చేస్తూ షార్ట్‌నోట్స్ రాసుకున్నా. దీంతో పరీక్ష సమయంలో రివిజన్ సులువైంది. పరీక్షకు ముందు షార్ట్ నోట్స్ ఎంతో ఉపయోగపడింది. కచ్చితత్వం, వేగం కోసం రివిజన్ ఒక్కటే ముందున్న మార్గం. నేను ఎక్కువ సమయం రివిజన్‌కు కేటాయించాను. దాంతోపాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐఈఎస్+ గేట్ :
ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌కు, గేట్‌కు ఏకకాలంలో సన్నద్ధమయ్యా. అర్హత, ఆసక్తి ఉంటే విద్యార్థులు రెండు పరీక్షలకు ఒకేసారి ప్రిపేర్‌అవ్వచ్చు. ముందు ఈఎస్‌ఈ పరీక్ష ఉంటుంది. దీనికోసం అదనంగా జీఎస్ చదవాలి. మిగతా సిలబస్ అంతా ఒకేలా ఉంటుంది. ఈఎస్‌ఈ, గేట్ సిలబస్ మధ్య పెద్దగా వ్యత్యాసం ఉండదు. కాబట్టి ప్రిపరేషన్ పరంగా ఎలాంటి ఆటంకం ఉండదు. నేను ఈఎస్‌ఈ మెయిన్స్ దశ దాటాను. నాకు సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూ ఉంది.
Published date : 13 Aug 2018 06:40PM

Photo Stories