Skip to main content

స్వయంకృషితో భవిత ‘బంగారం’

‘జీవితంలో పైకి రావడానికి, తద్వారా బంగారు భవిష్యత్‌ను సొంతం చేసుకోవడానికి ప్రతి వ్యక్తికీ ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలి. ఒకటి.. సాధించాలనే సంకల్పం. రెండు.. స్వయంకృషి. మూడు.. ఆత్మవిశ్వాసం. ఇవి ఉంటే ఎన్ని సంక్లిష్ట సవాళ్లు ఎదురైనా లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చు. విజయ శిఖరాలను అధిరోహించొచ్చు’.. అంటున్నారు లలితా జ్యూయలరీ మార్ట్ అధినేత డాక్టర్ ఎం.కిరణ్‌కుమార్. బడి చదువులు కూడా పూర్తిచేసుకోకున్నా బిజినెస్ వ్యూహాలను రచించడంలో ఆయన వ్యాపార దిగ్గజాలకు దీటుగా రాణిస్తున్నారు. తన సంస్థను మూడు దశాబ్దాల కాలంలో 12 శాఖలుగా విస్తరింపజేసి టర్నోవర్‌ను రూ.6000 కోట్లకు చేర్చిన ఘనత ఆయనది. ఔట్ స్టాండింగ్ యంగ్ ఇండియన్ అవార్డ్‌తో పాటు తమిళనాడులోని యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్న కిరణ్‌కుమార్‌తో గెస్ట్ కాలమ్...
ఆలోచన నుంచే అద్భుత విజయాలు
ఈ రోజుల్లో ఏ రంగంలోనైనా సక్సెస్ అనేది సవాల్ లాంటిది. సరైన ఆలోచన ఉంటే ఎన్ని విజయాలనైనా సొంతం చేసుకోవచ్చు. ఆలోచనలు స్వతహాగా రావాలి కానీ తరగతి గదుల్లో చెప్పే పాఠాల నుంచి మాత్రమే వస్తాయనుకోకూడదు. అందుకు నేనే ఉదాహరణ. పరిస్థితుల ప్రభావంతో రాజస్థాన్ నుంచి నెల్లూరుకు వచ్చిన మా కుటుంబానికి అప్పట్లో రోజులు గడవడమే కష్టంగా ఉండేది. దీంతో 12 ఏళ్ల వయసులో స్వర్ణకారుల వద్ద పనిలో చేరాను. ఆ సమయంలో ‘బంగారం ఎక్కడి నుంచి వస్తోంది? ఆభరణాలుగా ఎలా రూపొందుతోంది? వాటిని ఎవరు కొంటున్నారు?’ అనే ప్రశ్నలు తొలిచేసేవి. వాటికి సమాధానాలు దొరికిన తర్వాత ఈ పనులేదో నేనే సొంతగా చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచనే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. అమ్మ చేతి గాజులు కరిగించి ఆభరణాలు చేశాను. అదే నా విజయాలకు పునాది అని చెప్పొచ్చు.

రాత్రనకా.. పగలనకా..
లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయం దిశగా సాగేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వాటిని అధిగమించాలంటే సహనం, మనపై మనకు నమ్మకం ఉండాలి. అమ్మ గాజుల్ని కరిగించి తయారుచేసిన ఆభరణాలను విక్రయించడానికి చెన్నై వెళ్లాను. కానీ అక్కడ ఎవర్ని కలవాలో? వారిని ఎలా ఒప్పించాలో తెలియదు. అలా కొద్ది దూరం వెళ్లాక ‘లలితా జ్యూయలర్స్’ కనిపించింది. ఆ సంస్థ యజమానిని కలిసి నా దగ్గరున్న ఆభరణాలను విక్రయించాలనుకున్నా. కానీ ఆయన్ను కలవడం కష్టమైనా, చివరకు ఏదో విధంగా కలిసి, నాపై నమ్మకం కుదిరి ఆర్డర్లు ఇచ్చేలా చేసుకున్నాను. దీంతో పగలూ, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డాను. కొన్నాళ్లకు దక్షిణాదిలో ప్రముఖ జ్యుయలరీ వ్యాపారులకు ఆభరణాలను ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాను.

నమ్మకమే నడిపించింది
నాకు తొలి అవకాశం ఇచ్చిన లలితా జ్యూయలర్స్ 1999లో ఆర్థిక ఒడిదొడుకులకు లోనైంది. దీంతో సంస్థ మూతపడకుండా చూడాలనే ఆలోచన ఒక వైపు, ఆ దిశగా నేనే ఎందుకు ముందడుగు వేయకూడదు? అనే ఆలోచన మరోవైపు. ఈ నేపథ్యంలో లలితా జ్యూయలర్స్‌ను టేకోవర్ చేశాను. నా నిర్ణయంతో అంతా ఆశ్చర్యపోయారు. సంస్థను ఎలా కొనసాగిస్తానో అనే సందేహాలు వెలిబుచ్చారు. కానీ దృఢ సంకల్పంతో ముందుకు సాగి సత్ఫలితాలు సాధించాను. దశల వారీగా సంస్థను విస్తరిస్తూ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలో 12 శాఖలను ఏర్పాటుచేయగలిగాను. చదవడం, రాయడం రెండూ రాని నేను అనుభవాల నుంచే స్ఫూర్తి పొందాను. జ్ఞాపక శక్తే నా బలం. ఎన్ని విషయాలనైనా ఇట్టే గుర్తు పెట్టుకుంటాను.

స్వయంకృషే సరైన మార్గం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనకెవరైనా తోడ్పడాలనో, చేయూతనివ్వాలనో ఎదురుచూడటం, ఆశించడం సరికాదు. స్వయంకృషిని నమ్ముకోవాలి. నిరంతరం కష్టపడాలి. ఈ రోజుల్లో ప్రతి రంగంలో కొత్త మార్పులు వస్తున్నాయి. అలాగే వ్యాపారంలోనూ కష్టనష్టాలు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించడానికి రెట్టించిన ఉత్సాహంతో గతం కన్నా పది రెట్లు ఎక్కువ పని చేయడానికి సిద్ధపడాలి. బిజినెస్ కాస్త తగ్గినట్లనిపిస్తే నేను ఈ సూత్రాన్నే పాటిస్తా.

లక్ష్యంపై స్పష్టత ఉండాలి
ప్రతి ఒక్కరికీ తమ లక్ష్యంపై స్పష్టత ఉండాలి. కొన్నేళ్ల తర్వాత మనం ఏ స్థాయిలో ఉండాలి? దానికోసం ఏం చేయాలి? అనే అంచనాలు వేసుకోవాలి. ప్రస్తుతం రూ.6000 కోట్ల టర్నోవర్‌తో ఉన్న లలితా జ్యూయలర్స్‌ను సమీప భవిష్యత్తులో రూ.లక్ష కోట్ల టర్నోవర్‌కు చేర్చాలనేది మా లక్ష్యం.

నెవర్ థింక్ నెగెటివ్
ఏ వ్యాపారంలోనైనా తొలినాళ్లలో ఇబ్బందులొస్తాయి. అంత మాత్రాన ‘ఇక నేను చేయలేను’ అని చేతులెత్తేయకూడదు. ప్రతికూల ఆలోచనలతో ఫలితం ఉండదు. ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా, బిజినెస్‌మ్యాన్‌గా రాణించాలనుకునే యువత గుర్తించాల్సిన, పాటించాల్సిన ప్రధానాంశమిది.

గివింగ్ బ్యాక్ టు సొసైటీ
సమాజం నుంచి లబ్ధిపొందుతున్నవారు తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. ఈ సిద్ధాంతాన్ని ఇప్పటికే ఆచరణలో పెట్టాను. దాదాపు రూ.12 కోట్ల వ్యయంతో మా స్వస్థలం (రాజస్థాన్)లో పాఠశాల నిర్మిస్తున్నా. ఆసుపత్రి నిర్మాణం కొనసాగుతోంది. 2018 తర్వాత నా సంపాదనలో సగాన్ని స్వచ్ఛంద సేవలకు వినియోగించాలని నిర్ణయించుకున్నాను.
Published date : 08 Aug 2016 01:09PM

Photo Stories