Skip to main content

సైన్స్ కోర్సులపైన దృష్టిసారిస్తే.. ..ఉజ్వల భవిష్యత

‘ప్రస్తుతం విద్యార్థుల ముందు ఎన్నో అవకాశాలు.. వాటిని అందుకునేందుకు మార్గాలు అనేకం. కానీ, విద్యార్థుల దృష్టంతా కేవలం ఇంజనీరింగ్, మెడిసిన్ వైపే ఉంటోంది. అలా కాకుండా సెన్సైస్ వైపు కూడా దృష్టిసారిస్తే.. ఇంజనీరింగ్, మెడిసిన్‌కు దీటుగా ఉజ్వల భవిష్యత్తు సొంతం చేసుకునేందుకు అవకాశముంది’ అంటున్నారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)- బరంపూర్ డెరైక్టర్ ప్రొఫెసర్ కె.వి.ఆర్.చారి. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేసి.. ప్రముఖ పరిశోధన సంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో పలు ఆవిష్కరణల్లో పాల్పంచుకుని.. ప్రస్తుతం ఐఐఎస్‌ఈఆర్- బరంపూర్ వ్యవస్థాపక డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కె.వి.ఆర్.చారితో గెస్ట్ కాలమ్...
సెన్సైస్‌తో ఎన్నో అవకాశాలు..
సైన్స్ కోర్సుల ద్వారా విద్యార్థులకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా పీజీ, పీహెచ్‌డీ స్థాయికి చేరుకుంటే సైన్స్ విద్యార్థులకు అవకాశాలకు ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. వీటిద్వారా పలు రీసెర్చ్ లేబొరేటరీస్‌లో రీసెర్చ్ కార్యకలాపాల్లో పాల్పంచుకునే అవకాశం లభిస్తుంది. సైన్స్ కోర్సుల ఉన్నత విద్య ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా పలు చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించి పీజీ స్థాయిలో స్టైపెండ్, రీసెర్చ్ స్థాయిలో ఫెలోషిప్ మొత్తాలను కూడా పెంచుతోంది.

విభిన్న మార్గాలు..
సైన్స్ కోర్సుల్లో విభిన్న మార్గాలు అందుబాటులో వస్తున్నాయి. కోర్ ఫిజికల్ సైన్స్ మొదలు బయలాజికల్ సెన్సైస్, లైఫ్ సెన్సెస్.. ఇలా ఎన్నో విభాగాలు. ఇటీవల కాలంలో బయో ఇన్ఫర్మాటిక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఐటీ రంగంలో స్థిర పడాలనుకొని.. ఆ అవకాశం చేజారిన వారికి బయో ఇన్ఫర్మాటిక్స్ తమ కలను సాకారం చేసే గమ్యంగా నిలుస్తోంది.

ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ :
ప్రస్తుతం ప్రపంచం అంతటా పర్యావరణ కాలుష్యం ప్రధాన సమస్యగా మారింది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. దాంతో ఆయా బాధ్యతలు నిర్వహించేందుకు అవసరమైన ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జియలాజికల్ సైన్స్ నిపుణుల కొరత నెలకొంది. సైన్స్ ఔత్సాహిక విద్యార్థులు వీటి అభ్యసనం దిశగా అడుగులు వేస్తే ప్రత్యేక గుర్తింపు లభించడం ఖాయం.

స్టెమ్‌లో సైన్స్ కీలకం :
స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్) సంబంధించిన నాలుగు విభాగాల్లో.. సైన్స్‌ది అత్యంత కీలక పాత్ర. ఎందుకంటే... స్టెమ్ విభాగంలోని మిగతా మూడు విభాగాలకు (ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్)కు మూలం సైన్స్ సూత్రాలే. కాబట్టి విద్యార్థులు సైన్స్‌ను కేవలంప్రత్యామ్నాయ గమ్యంగా కాకుండా... తొలి ప్రాధాన్యంగా భావించాలి.

సైన్స్ పరిశోధనలకు ప్రోత్సాహం :
దేశంలో సైన్స్ రంగంలో నిపుణుల కొరతను తగ్గించేందుకు.. సైన్స్ కోర్సుల ఔత్సాహికులను ప్రోత్సహించేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఐఐఎస్‌ఈఆర్‌లను నెలకొల్పింది. వీటి ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. మరోవైపు విద్యార్థుల్లోనూ ఇటీవల కాలంలో ఐఐఎస్‌ఈఆర్‌లపై అవగాహన పెరుగుతోంది. ఐఐఎస్‌ఈఆర్ నిర్వహించే అడ్మిషన్ ప్రక్రియకు పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అందుబాటులో ఉన్న సీట్లకు దాదాపు ఏడెనిమిది రెట్లు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయి.

పాఠశాల స్థాయి నుంచే..
సైన్స్ కోర్సుల వైపు విద్యార్థులు అడుగులు వేసేలా పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సహించాలి. అందుకోసం ఉపాధ్యాయులు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పాఠశాల స్థాయిలో, ఇంటర్మీడియెట్ స్థాయిలో సైన్స్ కోర్సుల పట్ల ఆసక్తి పెంచేందుకు ఇన్‌స్పైర్, కేవీపీవై వంటి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. వీటిలో విద్యార్థులు చురుగ్గా పాల్పంచుకునేలా పాఠశాలలు తగిన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల విద్యార్థులకు సైన్స్ పరిశోధనలతో ప్రయోజనాలపై చిన్నప్పటి నుంచే అవగాహన లభిస్తుంది.

ఐఓఈ గుర్తింపు కోసం కృషి :
ఐఐఎస్‌ఈఆర్‌కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (ఐఓఈ) హోదా కోసం కృషిచేస్తాం. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐఓఈ ఇన్‌స్టిట్యూట్‌ల జాబితాలో ఐఐఎస్‌ఈఆర్‌లు లేకపోవడానికి.. దరఖాస్తుకు సంబంధించి విధించిన పలు నియమ నిబంధనలు కారణమని చెప్పొచ్చు. ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యలో దశాబ్దాలుగా పేరుగాంచిన ఐఐటీ-మద్రాస్, ఖరగ్‌పూర్‌లకు రెండో జాబితాలో ఐఓఈ హోదా లభించింది. ఐఐఎస్‌ఈఆర్‌లు ఏర్పాటై ఇంకా దశాబ్దకాలం కూడా పూర్తికాలేదు.

స్వీయ ఆసక్తితోనే..
నేను చదువుకునే రోజుల్లోనూ ఇంజనీరింగ్ కోర్సు పట్ల ఆసక్తి చూపే వారి సంఖ్య ఎక్కువగానే ఉండేది. నా సహచరుల్లో చాలామంది ఇంజనీరింగ్‌లో చేరారు. కానీ నేను మాత్రం స్వీయ ఆసక్తితోనే బీఎస్సీలో చేరాను. ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా పూర్తి చేశాను. ఫలితంగానే ఇప్పుడు ఉన్నతస్థాయికి చేరుకోగలిగాను.

ఒడిదుడుకులు లేని విభాగం :
సైన్స్.. ఎలాంటి ఒడిదుడుకులు లేని విభాగం. పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలు అనేవి ఈ రంగంలో నిరంతర ప్రక్రియ. కాబట్టి మార్కెట్ పరిస్థితుల ప్రభావం సైన్స్ రంగంపై పడే ఆస్కారం తక్కువ. అంతేకాకుండా.. ఇటీవల కాలంలో డీఎస్‌టీ, ఎంహెచ్‌ఆర్‌డీలు పరిశోధనలకు మరింత ప్రాధాన్యం ఇస్తూ.. ఇన్‌స్టిట్యూట్‌లకు, రీసెర్చ్ స్కాలర్స్‌కు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు సైతం అందిస్తున్నాయి.

దృక్పథం మారాలి :
నేటి తరం విద్యార్థులకు ఇచ్చే సలహా.. కెరీర్ అంటే ఇంజనీరింగ్ ఒక్కటే అనే దృక్పథాన్ని మార్చుకోవాలి. విభిన్న మార్గాలపై దృష్టి పెట్టాలి. ఆసక్తితో కోర్సులో చేరాలి. అందులో అత్యున్నత ప్రతిభ కనబరిచేందుకు కృషి చేయాలి!!
Published date : 24 Sep 2019 01:10PM

Photo Stories