Skip to main content

నిత్య విద్యార్థికే... ఉజ్వల భవిత !

నేటి టెక్నాలజీ యుగంలో నిత్య విద్యార్థిగా ఉంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది’ అంటున్నారు సింగపూర్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (ఎన్‌టీయూ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నిపుణులు ప్రొఫెసర్ బి.వి.ఆర్.చౌదరి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పూర్తిచేసి, ఆ తర్వాత ఐఐటీ- కాన్పూర్‌లో పీహెచ్‌డీ, మంగళూరు వర్సిటీ నుంచి లిటరేచర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సెల్వేనియా, జ్యూరిచ్ యూనివర్సిటీ వంటి పలు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో అపార అనుభవంతో ప్రస్తుతం ఎన్‌టీయూ-సింగపూర్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రొఫెసర్ బి.వి.ఆర్.చౌదరితో ఈ వారం గెస్ట్‌కాలం...
ప్రస్తుత పరిస్థితుల్లో మన విద్యావ్యవస్థను అంతర్జాతీయంగా అనుసంధానించడం చాలా అవసరం. అందుకోసం మన విశ్వవిద్యాలయాలు, ఇన్‌స్టిట్యూట్‌లు.. విదేశాల్లోని యూనివర్సిటీలతో ఒప్పందాలు చేసుకుని ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ అందించే దిశగా కృషి చేయాలి. ఇప్పటికే ఐఐటీలు తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ దిశగా ప్రయత్నిస్తుండటం హర్షణీయం. దీన్ని అన్ని యూనివర్సిటీలు అందిపుచ్చుకోవాలి. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఫలితంగా విద్యార్థులకు అంతర్జాతీయ విద్యా విధానంపై అవగాహన పెరగడమే కాకుండా.. వాస్తవ పరిస్థితుల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.

అకడమిక్ కొలాబరేషన్స్ :
దేశంలోని విద్యాసంస్థలు.. విదేశీ యూనివర్సిటీలతో అకడమిక్ కొలాబరేషన్స్ చేసుకోవాలి. ముఖ్యంగా పరిశోధనల స్థాయిలో కొలాబరేషన్స్ ఉంటే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. జాయింట్ పీహెచ్‌డీ, డాక్టోరల్ వంటి ప్రోగ్రామ్‌లలో అకడమిక్ కొలాబరేషన్‌కు విదేశీ వర్సిటీలను సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల ఆయా అంశాలపై పరిశోధనల పరంగా విదేశీ నిపుణుల బృందంతో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. దీంతో అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్స్ వల్ల విభిన్న సంస్కృతులు, నేపథ్యాలకు చెందిన వారితో మమేకమయ్యే లక్షణం అలవడుతుంది. ఇది భవిష్యత్‌లో దేశ విదేశాల్లో బహుళజాతి కంపెనీల్లో కెరీర్ పరంగా ఎదిగేందుకు దోహదపడుతుంది.

బ్యాచిలర్ స్థాయి నుంచే..
ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ వంటి విభాగాల విద్యార్థులు డిగ్రీ స్థాయి నుంచే రీసెర్చ్ దృక్పథంతో ముందుకుసాగాలి. అందుకోసం విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం సరైన పరిష్కార మార్గంగా చెప్పొచ్చు. ప్రస్తుతం మనదేశంలో పీహెచ్‌డీ స్థాయిలోనే కొంతమేర ఆర్థిక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. వీటిని బ్యాచిలర్ స్థాయి నుంచి అందిస్తూ ప్రతిభావంతులను పరిశోధనలవైపు ఆకర్షించాలి. బ్యాచిలర్ స్థా యి నుంచే పీహెచ్‌డీ దిశగా ప్రోత్సహించడం వల్ల విద్యార్థుల్లో సహనం, ఓర్పు వంటి లక్షణాలు కూడా అలవడతాయి. ఫలితంగా భవిష్యత్తులో మరింత మంది శాస్త్రవేత్తలు తయారవుతారు. అదే విధంగా పీజీ స్థాయిలో డ్యూయల్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు రీసెర్చ్‌ను తమ కెరీర్‌గా ఎంచుకునేలా చేయొచ్చు. దీన్ని గుర్తించే ఎన్‌టీయూలో గ్లోబల్ కనెక్ట్ పేరుతో విదేశాల్లోని ఇన్‌స్టిట్యూట్‌లతో డాక్టోరల్ స్థాయిలో జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ప్రవేశపెట్టాం. ఆ క్రమంలో భారత్‌లోని పలు ఐఐటీలను సంప్రదించాం. తాజాగా ఐఐటీ చెన్నైతో ఒప్పందం జరిగింది.

జాబ్ రెడీ స్కిల్స్ పొందాలంటే..
విద్యార్థులు ఉద్యోగ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటే.. స్వయంకృషి ఉండాలి. మరోవైపు కరిక్యులంలో ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయాలి. ప్రధానంగా ప్రాక్టికాలిటీ, ఫీల్డ్‌వర్‌‌కకు పెద్దపీట వేసేలా కరిక్యులంలో మార్పులు తేవాలి. ఫీల్డ్ వర్క్‌కు క్రెడిట్స్ విధానం అమలుచేస్తే క్షేత్రస్థాయి నైపుణ్యాలు పెంచుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో పెరుగుతుంది.

ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ :
ప్రస్తుత కార్పొరేట్ యుగంలో ఒక విభాగంలో నైపుణ్యం పొందిన అభ్యర్థులు.. విధి నిర్వహణ పరంగా ఆ విభాగానికే పరిమితం అయ్యే పరిస్థితులు లేవు. ఇతర విభాగాలతోనూ కలిసి పనిచే యాల్సిన ఆవశ్యకత పెరుగు తోంది. దీనికి పరిష్కారం ఇంటర్ డిసిప్లినరీ, మల్టీ డిసిప్లి నరీ అప్రోచ్ ఉండేలా కోర్సుల స్వరూపాన్ని రూపొందించాలి. ఫలితంగా వారికి కోర్ నైపుణ్యాల తోపాటు సామాజిక దృక్పథం కూడా అలవడుతుంది. ఇదే విధానాన్ని మన దేశంలోనూ విస్తృత స్థాయిలో అమలు చేయడం ఎంతో అవసరం.

ర్యాంకింగ్స్‌లోనూ మెరుగుదలకు..
విదేశీ వర్సిటీలతో ఒప్పందాలవల్ల విద్యార్థులతోపాటు ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఇన్‌స్టిట్యూట్స్‌కు ‘ర్యాంకింగ్’తో గుర్తింపు పొందే అవకాశం లభిస్తుంది. కొలాబరేషన్స్‌తో రీసెర్చ్ కార్యకలాపాలు పెరగడమే కాకుండా.. అంతర్జాతీయ విద్యార్థులను సైతం ఆకర్షించే అవకాశం ఉంటుంది.

నిరంతరం నేర్చుకోవాలి...
విద్యార్థులైనా, ఉద్యోగులైనా నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే భవిష్యత్తుకు మనుగడ. తమకు సంబంధించిన రంగంలో వస్తున్న మార్పులు, కొత్త టెక్నాలజీ గురించి నిత్యం అధ్యయనం చేస్తూ ముందుకుసాగాలి. యువతలో ఇలాంటి దృక్పథం లోపించడం వల్లే పలు రంగాల్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేమి కనిపిస్తోంది. నిత్య విద్యార్థిగా ఉంటేనే భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని గమనించాలి!!
Published date : 10 Oct 2018 12:00PM

Photo Stories