Skip to main content

కొత్త టెక్నాలజీతో సరికొత్త అవకాశాలు!

‘సంస్థల వ్యాపార వ్యూహాల్లో భాగంగా నిరంతరం మార్పులు జరుగుతుండటం సర్వసాధారణం. దీనివల్ల కొన్ని విభాగాల ప్రాధాన్యత తగ్గడం వాస్తవమే. అంతమాత్రాన ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందడం సరికాదు. కొత్త టెక్నాలజీతోపాటు సరికొత్త అవకాశాలు అందివస్తాయనే ఆశావహ దృక్పథంతో ముందడు వేయాలి’ అంటున్నారు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో డిజిటల్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ షిలిగె. బీటెక్ అర్హతతో కెరీర్ ప్రారంభించి.. సాఫ్ట్‌వేర్ రంగంలో సాంకేతిక విభాగాల్లో పలు సంస్థల్లో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం గడించిన ప్రదీప్ షిలిగెతో ఈ వారం గెస్ట్ కాలమ్...
టెక్నాలజీ యుగంలో సంస్థల కార్యకలాపాల్లో మార్పులు అనేవి సర్వసాధారణ, నిరంతర ప్రక్రియ. ఇది కేవలం ఐటీ రంగానికే పరిమితం కాదు. మిగతా అన్ని రంగాల్లోనూ సంస్థల కార్యకలాపాల్లో మార్పులు జరుగుతుంటాయి. ఇక్కడ విద్యార్థులను, ఉద్యోగార్థులను ఆందోళన కలిగిస్తున్న అంశం కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ. అయితే కొత్త టెక్నాలజీలు రావడం అనేది కూడా సంస్థల వ్యాపార వ్యూహంలో భాగమే. నేటి తరం యువత (మిలీనియల్స్) మార్పులను చూసిన ఆందోళన చెందడం కాకుండా... మార్పులను ఆహ్వానించే పరిణితి సాధించాలి.

ఐటీ విస్తృతి ఊహించామా?
సాఫ్ట్‌వేర్ రంగంలో మన దేశంలో ఈ స్థాయిలో, ఇంత పెద్ద ఎత్తున కార్యకలాపాలు జరుగుతాయని ఎవరైనా ఊహించారా! ప్రపంచీకరణ కారణంగా ఐటీ విస్తృతి పెరిగింది. ఇంకో విషయం ఏమంటే... ఐటీ రంగ కంపెనీల్లో మార్పులు అనేవి అత్యంత సహజ పరిణామం. బహుళ జాతి సంస్థలు ఏర్పాటైన తొలినాళ్లను పరిశీలిస్తే.. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 2007లో ప్రతి పది కంపెనీల్లో ఒకటి మాత్రమే ఐటీ సంస్థ ఉండేది. ఆ తర్వాత అయిదేళ్లకు అంటే... 2017 నాటికి 10:3 నిష్పత్తిలో ప్రతి పది సంస్థల్లో ఏడు ఐటీ కంపెనీలే! దీన్నిబట్టి ఒకవైపు సాఫ్ట్‌వేర్ రంగం విస్తరిస్తోంది.. అదే సమయంలో ఈ ఐటీ కంపెనీల సేవలు ఇతర సంస్థలకు అవసరమవుతున్నాయనే విషయం స్పష్టమవుతోంది.

కొత్త అవకాశాలు..
కొత్త టెక్నాలజీల ఆవిష్కరణ కారణంగా ఉద్యోగాలు పోతాయనే భయం నెలకొన్నమాట వాస్తవం. ముఖ్యంగా గత రెండేళ్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ కారణంగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు తగ్గుతాయనే వార్తలు ఈ ఆందోళనను మరింత పెంచుతున్నాయి. అయితే కొత్త టెక్నాలజీలు, కొత్త అవకాశాలు కల్పిస్తాయి. ఉద్యోగాలు పోతాయని చెబుతున్న నివేదికలే.. కొత్త కొలువులు లభిస్తాయని పేర్కొంటున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకునేందుకు, నైపుణ్యాలు మెరుగుపరచుకునేందుకు కృషి చేయాలి.

మేనేజ్‌మెంట్ విద్యార్థులు :
సంస్థల్లో ఇప్పుడు టెక్నికల్, మేనేజ్‌మెంట్ విభాగాలు ఒకదానికొకటి అనుసంధానమవుతూ.. విధులు నిర్వర్తించాల్సిన అవసరముంది. కాబట్టి మేనేజ్‌మెంట్ విద్యార్థులు తమ డొమైన్ నాలెడ్జ్‌కే పరిమితం కాకుండా.. సంస్థల్లో అనుసరిస్తున్న ఇతర సాంకేతిక విధానాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. ఆయా టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు సొంతం చేసుకునేలా శిక్షణ పొందాలి.

‘ఐటీ’ మాత్రమే కాదు :
ప్రస్తుతం యువతలో ఉద్యోగం అంటే ఐటీ జాబ్ అనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ వంటి ఇంజనీరింగ్ కోర్సుల విద్యార్థుల్లో ఇలాంటి దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది సరికాదు. ఇప్పుడు ఐటీతోపాటు అనేక రంగాలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఇతర రంగాల్లోని అవకాశాలపైనా అవగాహన పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలి.

‘పింక్ స్లిప్స్’, ‘లే-ఆఫ్’ :
ఇటీవల కాలంలో సంస్థల్లో లే-ఆఫ్‌లు, పింక్ స్లిప్‌లు గురించి ఎక్కువగా వార్తలు వెలువడుతున్నాయి. యువత వీటి గురించి ఎక్కువగా ఆలోచించి ఆందోళన చెందడం అనవసరం. మీలో నైపుణ్యాలుంటే.. ఉద్యోగావకాశాలు కల్పించడానికి సంస్థలు సిద్ధంగా ఉంటాయని గుర్తించాలి. అదే విధంగా ఒకసారి సంస్థలో అడుగుపెట్టాక.. సంస్థకు తాము ఏ విధంగా ఉపయోగపడతామనే విషయంపై పరిశీలన చేసుకుంటే సుస్థిర భవిష్యత్తు ఖాయమవుతుంది.

నైపుణ్యాలు ఇవే..
విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్, లేటెస్ట్ టెక్నాలజీస్‌పై పట్టు, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ పొందేలా అకడమిక్ స్థాయిలోనే కృషిచేయాలి. తద్వారా జాబ్ మార్కెల్లో ముందంజలో నిలిచేందుకు ఆస్కారం లభిస్తుంది!!
Published date : 30 Aug 2018 01:17PM

Photo Stories