TSCHE: ముగిసిన ఎంసెట్–23 ప్రవేశాలు.. ఈ తేదీ లోగా ఫీజు చెల్లించాలి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్–2023 ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ముగిసింది.
బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ప్రస్తుత విద్యాసంవత్సరంలో వివిధ కాలేజీల్లో 16,296 ఇంజనీరింగ్ సీట్లు మిగిలాయి. ఇవి ఖాళీగా ఉన్నట్టే లెక్క. అడపాదడపా స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా కాలేజీలే సీట్లు నింపుకునే అవకాశముంది. ఇలా నిండేవి స్పల్పంగానే ఉంటాయి.
- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్(సీఎస్ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) కోర్సుల్లో 5,723 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ల్లో 4,959, సివిల్, మెకానికల్ బ్రాంచ్ల్లో 5,156, ఇతర బ్రాంచ్ల్లో మరో 458 సీట్లకు అడ్మిషన్లు జరగలేదు.
- రాష్ట్రంలో 178 కాలేజీల్లో మొత్తం 85,671 బీటెక్ సీట్లుండగా, వీటిలో 69,375 సీట్లు (80.97శాతం) భర్తీ అయ్యాయి.
- యాజమాన్యాల వారీగా మిగిలిన సీట్లను పరిశీలిస్తే.. ప్రైవేట్ కాలేజీల్లో 14,511 సీట్లు, 289 ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289, యూనివర్సిటీ కాలేజీల్లో 1,496 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Also Read: College Predictor - 2023 TS EAMCET | AP EAPCET - TS POLYCET | AP POLYCET
29లోగా ఫీజు చెల్లించాలి
ఎంసెట్–23 స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను అధికారులు ఆగస్టు 23న కేటాయించారు. ఈ సీట్లు పొందిన వారు ఆగస్టు 29లోపు ఫీజు చెల్లించి, ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు టీసీతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు కాలేజీలో సమర్పించాల్సి ఉంటుందన్నారు.
Published date : 25 Aug 2023 12:41PM