Jagananna Thodu Scheme: చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’.. ఒక్కొక్కరికి రూ.10 వేలు..
![Low-interest support for small business owners by CM YS Jagan CM Jagan Releases Jagananna Thodu Scheme Funds Jagananna Todu scheme benefits small traders](/sites/default/files/images/2024/01/12/jaganna-thodu-1705032228.jpg)
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు, అంతకుపైన రూ.417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు సీఎం జగన్ ప్రభుత్వం అందించింది. మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో వడ్డీ రీయింబర్స్మెంట్ కింద 5.81 లక్షల మంది లబ్ధిదారులకు రూ.13.64 కోట్లు చెల్లించనున్నారు. ఈ రెండూ కలిపి మొత్తం రూ.431.58 కోట్లను సీఎం వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఇదీ ‘జగనన్న తోడు’ పథకం..
సీఎం వైఎస్ జగన్ నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు వారి కాళ్ల మీద వారు నిలదొక్కుకొనేలా జగనన్న తోడు పథకం కింద ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల రుణం సున్నా వడ్డీకే అందిస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించినవారికి ఏడాదికి మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకు వడ్డీలేని రుణం అందిస్తున్నారు.
ఇలా ఇప్పటికి ఏడు విడతలు రుణాలు, వడ్డీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. 8వ విడతగా గురువారం అందిస్తున్న రూ.417.94 కోట్ల రుణంతో కలిపి ఇప్పటివరకు చిరువ్యాపారాలు చేసుకునే 16,73,576 మంది లబ్ధిదారులకు అందించిన వడ్డీ లేని రుణాలు రూ. 3,373.73 కోట్లు. అదే విధంగా ఈ విడతలో అందించే వడ్డీతో కలిపి ఇప్పటివరకు 15.87 లక్షల లబ్ధిదారులకు తిరిగి చెల్లించిన వడ్డీ రూ.88.33 కోట్లు. సకాలంలో రుణాలు చెల్లించిన చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ఆరు నెలలకోసారి సీఎం జగన్ ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది.
Jagananna Vidya Deevena: జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్..
వీరందరికీ ‘జగనన్న తోడు’..
10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్నవారు, తోపుడు బండ్లపై వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు, రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించేవారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునేవారు, గంపలు, బుట్టలతో వస్తువులు అమ్మేవారు, చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులకు ఈ పథకం అందిస్తున్నారు.
దేశానికే ఆదర్శంగా ఏపీ..
చిరు వ్యాపారులను ఆదుకోవడంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ‘జగనన్న తోడు‘ ద్వారా పూర్తి వడ్డీ రాయితీ (7.32% నుండి 15.85% వరకు) కల్పిస్తోంది జగనన్న ప్రభుత్వం. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ ద్వారా 58,65,827 మంది చిరు వ్యాపారులకు రుణాలు అందిస్తే, ఏపీలో సీఎం వైఎస్ జగన్ ఏకంగా 16,73,576 మందికి ‘జగనన్న తోడు‘ ద్వారా వడ్డీ లేని రుణాలు అందించారు.
దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద ఇప్పటివరకు చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాలు రూ.10,220.47 కోట్లు. రాష్ట్రంలో ‘జగనన్న తోడు‘ ద్వారా అందించిన రుణాలే అక్షరాలా రూ.3,373.73 కోట్లు. దేశవ్యాప్తంగా ‘పీఎం స్వనిధి‘ కింద చిరు వ్యాపారులకు రీయింబర్స్ చేసిన వడ్డీ రూ. 138.49 కోట్లు కాగా, ‘జగనన్న తోడు‘ ద్వారా మన రాష్ట్రంలో రీయింబర్స్ చేసిన వడ్డీ రూ.88.33కోట్లు.