T-Hub రెండో దశను ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్
![Hyderabad: Telangana CM KCR Inaugurates T-Hub 2.0](/sites/default/files/images/2022/06/29/t-hub-ktr-1656504389.jpg)
‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ–హబ్ రెండో దశను సీఎం కేసీఆర్ జూన్ 28న ప్రారంభించారు. రూ.400 కోట్ల వ్యయంతో హైదరాబాద్లోని మాదాపూర్–రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్గా ఈ టీ–హబ్ 2.0ను నిర్మించారు. ఇన్నోవేషన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి 2015లో టీ–హబ్ను ఏర్పాటు చేసింది. దీనిని విస్తరిస్తూ అత్యంత పెద్దదైన టీ–హబ్ రెండో దశను ప్రారంభించింది.
Also read: GK Sports Quiz: 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి?
దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు ఇచ్చేలా..
ఈ సందర్భంగా ముఖ్యంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.... టీ–హబ్ తొలిదశ ద్వారా 2 వేలకుపైగా స్టార్టప్లకు ఊతమివ్వడంతోపాటు 1.19 బిలియన్ డాలర్ల నిధులు సమకూరాయని తెలిపారు. వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లతో స్టార్టప్లను అనుసంధానం చేయడంలో టీ–హబ్ ఎనలేని పాత్ర పోషించిందని... ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టీ–హబ్ రెండో దశ తొలిదశ కంటే ఐదు రెట్లు పెద్దదని వివరించారు. టీ–హబ్తో ప్రపంచంలో పది అగ్రశ్రేణి స్టార్టప్ వాతావరణం కలిగిన ప్రాంతాల జాబితాలో తెలంగాణ కూడా ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.