Skip to main content

Covid Cases: చైనాలో మళ్లీ కరోనా కల్లోలం.. ఆస్పత్రుల్లో శవాల గుట్టలు

చైనాలో కోవిడ్‌–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు అమాంతం పెరిగిపోయాయి.

ఆస్పత్రులు కిటకిటలాడిపోతున్నాయి. మందులు దొరకడం లేదు. కరోనా రోగులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని చికిత్స కోసం ఆస్పత్రుల దగ్గర కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో నిల్చొంటున్నారు. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. ఆస్పత్రుల కారిడార్లలో, మార్చురీలలో శవాలు వరసగా పెట్టి ఉన్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. శ్మశాన వాటికల్లో రోజూ వందలాది మృతదేహాలు వస్తున్నాయి. రోజుకి దాదాపుగా 40 వేల మందికి కరోనా సోకుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇంతటి ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం కేసుల సంఖ్యని తక్కువ చేసి చూపిస్తోంది. జనం పిట్టల్లా రాలిపోతున్నా డిసెంబ‌ర్ 20న‌ కేవలం ఐదుగురే ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌లో త్వరితంగా వ్యాప్తి చెందే బిఏ.5.2, బిఎఫ్‌.7 సబ్‌ వేరియంట్లు విస్తరిస్తున్నాయి.  

Covid Death: వచ్చే ఏడాది కోవిడ్‌తో 10 లక్షల మంది మృతి?
రాబోయేవి గడ్డు రోజులు  

చైనాలో ఇక మీద గడ్డు రోజులు ఎదుర్కోబోతోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో చైనా జనాభాలో 60 శాతానికి పైగా కరోనా బారిన పడతారని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంతర్జాతీయ వ్యాధి నిపుణుడు ఎరిక్‌ ఫీగల్‌ డింగ్‌ అంచనా వేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని వచ్చే ఏడాది చైనాలో రోజుకి లక్ష కేసులు నమోదవుతాయని, 20 లక్షల మంది మరణిస్తారని పలు నివేదికలు హెచ్చరించాయి. వృద్ధుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడంలో చూపించిన నిర్లక్ష్యానికి చైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని నిపుణులు అంటున్నాయి.

కరోనాలో అత్యంత కీలకమైన ఆర్‌ వాల్యూ (ఒక వ్యక్తి నుంచి వైరస్‌ ఎంతమందికి సంక్రమిస్తుందో చెప్పే విధానం) 16గా ఉండడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. అంటే ఒక వ్యక్తి ద్వారా వైరస్‌ 16 మందికి సోకుతుందన్న మాట. 2019లో వూహాన్‌లో కరోనా బట్టబయలయ్యాక ఇంతటి ఘోరమైన పరిస్థితులు నెలకొనడం ఇదే తొలిసారి. జిన్‌పింగ్‌  ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో కరోనాతో ఈ మూడేళ్లలో 3.80 లక్షల కేసులు నమోదైతే, 5,242 మంది ప్రాణాలు కోల్పోయారు. వరల్డ్‌ డేటా మాత్రం ఇప్పటివరకు 20 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, గత 24 గంటల్లో 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని చెబుతోంది.  

China Protest: చైనాలో ఉక్కుపాదం.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు

ఎందుకీ పరిస్థితి?  
☛ చైనా ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానంతో కఠినమైన నిబంధనలు విధించి లక్షణాలు లేని వారిని క్వారంటైన్‌ చేయడం, మూకుమ్మడి పరీక్షలు, రోగులతో కాంటాక్టయిన వారిని నాలుగ్గోడల మధ్య ఉంచడం వంటివి చేయడంతో ఇన్నాళ్లూ కేసులు వెలుగులోకి రాలేదు. నెలల తరబడి లాక్‌డౌన్‌లు, గదుల్లో తాళాలు వేసే కఠినమైన క్వారంటైన్‌ నిబంధనలపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జీరో కోవిడ్‌ విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 7న వెనక్కి తీసుకుంది. 
☛ ఇన్నాళ్లూ కరోనా వైరస్‌ ఎక్కువ మందికి సోకకపోవడంతో వైరస్‌ను ఎదుర్కొనే సహజసిద్ధమైన ఇమ్యూనిటీ చైనాలో చాలామందికి రాలేదు. ఆంక్షలు పూర్తిగా ఎత్తేయడంతో ఒక్కసారిగా కేసులు భారీగా పెరిగిపోయాయి. 
☛ చైనా తాను సొంతంగా తయారు చేసిన సినోవాక్, సోనిఫార్మ్‌ వ్యాక్సిన్లనే వాడింది. 350 కోట్ల డోసుల్ని పంపిణీ చేసింది. వీటి సామర్థ్యంపై సవాలక్ష సందేహాలున్నాయి. పైగా 80 ఏళ్ల పైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకోలేదు. ఇప్పుడు వాళ్లే వైరస్‌ క్యారియర్లుగా మారారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 
☛ కరోనా వైరస్‌ మానవ నిర్మితమేనని పలు నివేదికలు నిర్ధారించడంతో దీని వ్యాప్తి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు చైనాలో మరో వేవ్‌ మొదలైందని, దీని వల్ల పలు కొత్త వేరియెంట్‌లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని సింగపూర్‌ యూనివర్సిటీలో వైస్‌ డీన్‌ అలెక్స్‌ కుక్‌ అంచనా వేస్తున్నారు. చైనాలో పరిస్థితి ఇతర దేశాలకు ప్రమాదకరమేనని ఆయన హెచ్చరించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Published date : 21 Dec 2022 12:54PM

Photo Stories