Skip to main content

Daily Current Affairs in Telugu: జ‌న‌వ‌రి 3rd, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu January 3rd 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

Gurunaidu: వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన గురు 
జాతీయ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శనపతి గురునాయుడు స్వర్ణ పతకాన్ని సాధించాడు. డిసెంబ‌ర్ 30న‌ జరిగిన యూత్ పురుషుల 55 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన 16 ఏళ్ల గురు నాయుడు మొత్తం 233 కేజీలు (స్నాచ్లో 104+క్లీన్ అండ్ జెర్క్లో 129) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ప్రపంచ యూత్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో గురునాయుడు 55 కేజీల విభాగంలో మొత్తం 230 కేజీలు బరువెత్తి బంగారు పతకం సాధించాడు. తాజాగా జాతీయ టోర్నీలో అతను అదనంగా మరో మూడు కేజీలు ఎక్కువ బరువెత్తడం విశేషం.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)

   
World Blitz Championship: ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హంపికి రజతం 
భారత మహిళా చెస్ స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. నిర్ణీత 17 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 13 పాయింట్లతో బిబిసారా అసుబయేవా (కజకిస్తాన్) విజేతగా నిలువగా.. 12 పాయింట్లతో పొలీనా షువలోవా (రష్యా) కాంస్య పతకాన్ని సాధించింది. బిబిసారాకు 40 వేల డాలర్లు (రూ.33 లక్షల 11 వేలు), హంపికి 30 వేల డాలర్లు (రూ.24 లక్షల 83 వేలు), పొలీనాకు 20 వేల డాలర్లు (రూ.16 లక్షల 55 వేలు) ప్రైజ్మనీగా లభించాయి. 10.5 పాయింట్లతో హారిక 13వ ర్యాంక్లో నిలిచింది. 21 రౌండ్లపాటు జరిగిన ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే; 16 పాయింట్లు) టైటిల్ సాధించగా.. ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ పెంటేల హరికృష్ణ 13 పాయింట్లతో 17వ ర్యాంక్లో, తెలంగాణ గ్రాండ్మాస్టర్ ఇరిగేశి అర్జున్ 12 పాయింట్లతో 42వ ర్యాంక్లో నిలిచారు.   

FIFA World Cup: వరల్డ్‌ కప్‌లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా మెస్సి రికార్డు

The Challenge: అంతరిక్షంలో సినిమా షూటింగ్‌ 
హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ క్రూయిజ్‌ తన తదుపరి సినిమాలో ఒక సీక్వెన్స్‌ను నాసా సహకారంతో అంతరిక్షంలో షూట్‌ చేయబోతున్నారన్న వార్త ఇటీవల అందరినీ ఆకర్షించింది. కానీ ఆయన కంటే ముందే రష్యా ఈ ఘనత సాధించేసింది. రష్యా దర్శకుడు క్లిమ్‌ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్‌’లో ఒక సీక్వెన్స్‌ను 2021 అక్టోబర్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్‌తో కలిసి ఇందుకోసం 12 రోజుల పాటు ఐఎస్‌ఎస్‌లో గడిపారు. తద్వారా అంతరిక్షంలో షూటింగ్‌ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్‌ రికార్డు సృష్టించింది. తాజాగా విడుదలైన దీని ట్రైలర్‌ దుమ్ము రేపుతోంది. ఓ కాస్మొనాట్‌ ప్రాణాలు కాపాడేందుకు ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన డాక్టర్‌గా యూలియా ఇందులో నటిస్తోంది. షూట్‌ కోసం సినిమా బృందం ఐఎస్‌ఎస్‌లో లాండైన తీరును కూడా సినిమాలో చూపించనున్నారు. మున్ముందు చంద్రునితో పాటు అంగారకునిపైనా షూటింగ్‌ చేస్తానని క్లిమ్‌ చెబుతున్నారు!  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)


Alcohol Tax: మద్యంపై పన్ను రద్దు 
పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా దుబాయ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయాలపై ఇప్పటిదాకా విధిస్తున్న 30 శాతం పన్నును పూర్తిగా రద్దు చేసింది. ఇది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చింది. అంతేకాకుండా వ్యక్తిగత ఆల్కహాల్‌ లైసెన్స్‌లకు ఇకపై ఎలాంటి చార్జీ వసూలు చేయబోరు. దుబాయ్‌లో ఎవరైనా ఇళ్లలో మద్యం సేవించాలంటే వ్యక్తిగత ఆల్కహాల్‌ లైసెన్స్‌ ఉండాల్సిందే. దుబాయ్‌ ప్రభుత్వం ఇటీవలి కాలంలో మద్యం విషయంలో కొన్ని చట్టాలను సడలిస్తోంది. అయితే, పన్ను రద్దు అనేది తాత్కాలికమా? లేక శాశ్వతమా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. 

Ministry of Road Transport: 4.12 లక్షల ప్రమాదాలు.. 1.53 లక్షల మంది బలి

Demonetisation: పెద్ద నోట్ల రద్దు సరైనదే.. సుప్రీంకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే.. 

రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం ఆరేళ్ల కింద తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ‘‘ఈ నిర్ణయం తీసుకునే ముందు కేంద్రానికి, ఆర్‌బీఐకి మధ్య ఆర్నెల్ల పాటు సంప్రదింపులు జరిగాయి. కనుక పిటిషనర్లు ఆరోపించినట్టుగా నోట్ల రద్దు నిర్ణయ ప్రక్రియలో న్యాయ, రాజ్యాంగపరమైన లోపాలేవీ చోటుచేసుకోలేదు’’ అని స్పష్టం చేసింది. నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను కొట్టేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు జ‌న‌వ‌రి 2న మెజారిటీ తీర్పు వెలువరించింది. ‘‘దొంగ నోట్లకు, నల్లధనానికి, ఉగ్రవాదానికి నిధులకు అడ్డుకట్ట వేసే ఉదాత్త లక్ష్యాలతో తీసుకున్న ఆర్థిక విధానపరమైన నిర్ణయమిది. వెనక్కు మరల్చడం వీలు కాని ఇలాంటి నిర్ణయాలను కేవలం వాటిని తీసుకునేందుకు అనుసరించిన ప్రక్రియ ఆధారంగా అసమంజసమని తేల్చి కొట్టేయలేం’’ అని ధర్మాసనానికి సారథ్యం వహించిన జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌తో పాటు బి.ఆర్‌.గవాయ్, ఎ.ఎస్‌.గోపన్న, వి.రామసుబ్రమణియన్‌ పేర్కొన్నారు.  మ‌రిన్ని వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Elon Musk: పేరుకే ప్ర‌పంచ కుబేరుడు.. ఆఫీసు అద్దె కూడా క‌ట్ట‌లేడు

Demonetisation: నోట్ల ర‌ద్దు త‌రువాత‌ రెట్టిపైన నగదు!

పెద్ద నోట్ల రద్దు. ఆరేళ్ల క్రితం మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం. అప్పటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటి రూ.1,000, రూ.500 నోట్లదే. కేంద్రం నిర్ణయంతో అవి ఒక్క దెబ్బతో రద్దయ్యాయి. కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇప్పటికీ నగదుదే పెద్ద వాటా! పైగా నోట్ల రద్దు నాటితో పోలిస్తే జనం దగ్గరున్న నగదు ఏకంగా రెట్టింపైందని తాజా గణాంకాలు చెబుతుండటం ఆసక్తికరం. నోట్ల రద్దుకు కాస్త ముందు, అంటే 2016 నవంబర్‌ 4న చలామణిలో ఉన్న కరెన్సీ విలువ కేవలం 17.74 లక్షల కోట్ల రూపాయలు. రద్దు నిర్ణయం తర్వాత అది ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పడిపోయింది. కానీ తాజాగా 2022 డిసెంబర్‌ 23 నాటికి ఏకంగా 32.42 లక్షల కోట్ల రూపాయల విలువైన కరెన్సీ చలామణిలో ఉందని రిజర్వు బ్యాంకు గణాంకాలే చెబుతున్నాయి. 
రద్దయిన నోట్లు మార్చుకోవడానికి అప్పట్లో 52 రోజుల గడువు ఇవ్వడం తెలిసిందే. ఆ గడువు లోపల రూ.15.3 లక్షల కోట్ల విలువైన పెద్ద నోట్లు, అంటే 99.3 శాతం వెనక్కొచ్చాయని ఆర్‌బీఐ పేర్కొంది. అలాంటప్పుడు నోట్ల రద్దుతో సాధించింది ఏమిటన్న ప్రశ్నలు అప్పట్లోనే తలెత్తాయి. రద్దు అనంతరం కొత్తగా రూ.2,000 నోటు ప్రవేశపెట్టడం తెలిసిందే. రూ.500 నోట్లను సరికొత్త రూపంలో తిరిగి జారీ చేసినా రూ.1,000 నోట్లను మాత్రం పునరుద్ధరించలేదు. ఒకవైపు డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ కొన్నేళ్లుగా ప్రపంచంలోనే అగ్ర స్థానంతో దూసుకుపోతున్నా మరోవైపు నగదు చలామణి కూడా అంతకంతకూ పెరుగుతుండటం ఆసక్తికరమే. అయితే నగదు చలామణి క్రమంగా తగ్గుతోందని ఎస్‌బీఐ తాజా సర్వే ఒకటి తేల్చింది. ‘‘మొత్తం చెల్లింపుల్లో నగదు వాటా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 88 శాతం కాగా 2021–22 నాటికి అది 20 శాతానికి తగ్గింది. 2026–27 కల్లా కేవలం 11 శాతానికి పరిమితమవుతుంది. అదే సమయంలో 2015–16లో కేవలం 11.26 శాతంగా నమోదైన డిజిటల్‌ చెల్లింపులు 2021–22 నాటికి ఏకంగా 80 శాతానికి ఎగబాకాయి. 2026–27 కల్లా 88 శాతానికి చేరతాయి’’ అని అది పేర్కొంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (10-16 డిసెంబర్ 2022)


Syria: సిరియాపై ఇజ్రాయెల్‌ దాడులు
ఇజ్రాయెల్‌ ప్రభుత్వం మరోమారు సిరియాపై దాడులకు తెగబడింది. సిరియా రాజధాని నగరం డమాస్కస్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు సిరియా సైనికులు, ఇద్దరు విమానాశ్రయ సిబ్బంది మరణించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఒకవైపు రన్‌వే దెబ్బతింది. రెండు టర్మినళ్లలో నిర్వహణ వ్యవస్థ ధ్వంసమైంది. జ‌న‌వ‌రి 1 అర్ధరాత్రి దాటాక ఈ దాడి ఘటన జరిగింది. గత ఏడు నెలల్లో డమాస్కస్‌ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్‌ క్షిపణులు ప్రయోగించడం ఇది రెండోసారి. బషర్‌ అల్‌ అసద్‌కు మద్దతు పలుకుతున్న స్థానిక ఉగ్రవాదులకు ఇరాన్, లెబనాన్‌ హిజ్‌బుల్లాల నుంచి ఆయుధాల సరఫరాను అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌తోపాటు డమాస్కస్‌ దక్షిణాన ఉన్న సిరియా ఆయుధాగారంపైనా ఇజ్రాయెల్‌ క్షిపణులను ఎక్కుపెట్టింది.    
వెస్ట్‌బ్యాంక్‌లో కాల్పులు
ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ సైన్యంతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు పాలస్తీనియన్లు చనిపోయారు. జెనిన్‌లోని కాఫిర్‌దాన్‌లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్‌ ఆర్మీని పాలస్తీనియన్లు అడ్డుకున్నారు. దీంతో ఆర్మీ వారిపైకి కాల్పులకు దిగింది. కాల్పుల్లో సమెర్‌ హౌషియెహ్‌(21), ఫవాద్‌ అబెద్‌(25) అనే వారు మృతి చెందారు. 

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. పుతిన్

Russia-Ukraine War: ఒక్క క్షిపణితో 400 మంది హతం! 
దురాక్రమణకు దిగిన రష్యా సేనలను క్షిపణి దాడుల్లో అంతమొందించే పరంపర కొనసాగుతోందని ఉక్రెయిన్‌ ప్రకటించింది. డోనెట్స్‌క్‌ ప్రాంతంలో తమ సేనలు జరిపిన భారీ క్షిపణి దాడిలో ఏకంగా 400 మంది రష్యా సైనికులు చనిపోయారని ఉక్రెయిన్‌ పేర్కొంది. ఈ దాడిలో మరో 300 మంది గాయపడ్డారని తెలిపింది. అయితే 63 మంది సైనికులే మరణించారని రష్యా స్పష్టంచేసింది. మకీవ్కా సిటీలో జ‌న‌వ‌రి 1 అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 
ఒక పెద్ద భవంతిలో సేదతీరుతున్న రష్యా సైనికులే లక్ష్యంగా ఉక్రెయిన్‌ క్షిపణి దాడి జరిగింది. అమెరికా సరఫరా చేసిన హిమార్స్‌ రాకెట్లను ఆరింటిని  ఉక్రెయిన్‌ సేనలు ప్రయోగించగా రెండింటిని నేలకూల్చామని మిగతావి భవనాన్ని నేలమట్టంచేశాయని రష్యా జ‌న‌వ‌రి 2న తెలిపింది. భవనంలోని సైనికులు ఇంకా యుద్ధంలో నేరుగా పాల్గొనలేదని, ఇటీవల రష్యా నుంచి డోనెట్స్‌క్‌కు చేరుకున్నారని, అదే భవనంలో యుద్ధంతాలూకు పేలుడుపదార్థాలు ఉండటంతో విధ్వంసం తీవ్రత పెరిగిందని స్థానిక మీడియా తెలిపింది. కీలకమైన మౌలిక వ్యవస్థలపై 40 డ్రోన్లు దాడికి యత్నించగా అన్నింటినీ కూల్చేశామని కీవ్‌ మేయర్‌ విటలీ క్లిష్‌చెకో చెప్పారు. 

Telangana Culture & Literature: ‘పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది’ అన్న‌వారెవ‌రు?
Tallest Man: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తి.. గిన్నిస్‌ రికార్డుకెక్కే చాన్స్‌
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన వ్యక్తిగా టర్కీకి చెందిన 40 ఏళ్ల సుల్తాన్‌ సేన్‌ గతంలోనే గిన్నిస్‌ ప్రపంచ రికార్డులకెక్కాడు. అయితే, ఇతడిని దాటేసేందుకు ఘనాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి నెలనెలా తెగ పెరిగిపోతున్నాడు. ఇతని పేరు సులేమనా అబ్దుల్‌ సమీద్‌. అందరిలా సాధారణ ఎత్తు ఉన్న సమీద్‌ 22 ఏళ్ల వయసులో వేగంగా పెరగడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్లి ఎత్తు కొలవమంటే వారి దగ్గర సరిపడా టేప్‌ లేదు. ఒక ఎత్తయిన కర్ర తీసుకుని ఎత్తు తేల్చారు. అప్పుడు అతని ఎత్తు 7 అడుగుల 4 అంగుళాలు. గిన్నిస్‌లో స్థానం సంపాదించిన సుల్తాన్‌(ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు)ను త్వరలోనే దాటేస్తావని అందరూ తెగ పొగిడేశారు. సమీద్‌ ఇంకా ఎత్తు పెరుగుతుండటం గమనార్హం. కాగా ‘మార్ఫాన్‌ సిండ్రోమ్‌గా పిలిచే ఈ జన్యుసంబంధ వ్యాధి కారణంగా తీవ్ర గుండె సమస్యలు తలెత్తుతాయి. మెదడుకు శస్త్రచికిత్స చేసి ఇతని పెరుగుదలను ఆపాల్సి ఉంది’ అని వైద్యులు తెలిపారు. 

 

Published date : 03 Jan 2023 06:24PM

Photo Stories