Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 16, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 16th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 16th 2023 Current Affairs

Marburg Virus: మార్‌బర్గ్‌.. మరో ప్రాణాంతక వైరస్‌
మానవాళిపైకి మరో ప్రాణాంతక వైరస్ వచ్చిపడింది. మార్‌బర్గ్‌ వైరస్‌ డిసీస్‌ (ఎంవీడీ)గా పిలిచే దీని తాలూకు తొలి కేసు గత వారంలో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని ఈక్వటోరియల్‌ గినియాలో నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే నిర్ధారించింది కూడా. విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఆయాసం, రక్తపు వాంతులు, విరేచనాలు, కండరాల నొప్పుల వంటివి దీని లక్షణాలు. ఈ వ్యాధి తొలిసారిగా 1967లో నమోదైంది. ఎబోలాను పోలి ఉండే ఈ ప్రాణాంతక వైరస్‌కు ఇప్పటిదాకా చికిత్సేమీ లేదు! గినియాలోని కీటెం ప్రావిన్స్‌లో దీని బారిన పడి అప్పుడే 9 మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో ఫిబ్ర‌వ‌రి 14న ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘వారందరిలోనూ గుర్తు తెలియని హెమరేజ్‌ జ్వరం ఆనవాళ్లు బయటపడ్డాయి. ముందు జాగ్రత్తగా మార్‌బర్గ్‌ సోకినట్టు అనుమానమున్న 200పై చిలుకు మందిని క్వారెంటైన్‌ చేశారు’’ అని వెల్లడించింది. దాంతో పొరుగునున్న కామెరూన్‌ సరిహద్దుల వద్ద ఆంక్షలను మరింత పెంచింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)
ఏమిటీ వ్యాధి? 
ఎంవీడీ రక్తస్రావంతో కూడిన తీవ్ర జ్వరానికి దారి తీస్తుంది. దీనిబారిన పడ్డవారిలో ఏకంగా 88 శాతం మంది మృత్యువాత పడుతున్నారు! 1967లో జర్మనీ, సెర్బియాల్లో ఎంవీడీ ప్రబలింది. ఉగాండా నుంచి దిగుమతి చేసుకున్న ఆఫ్రికన్‌ గ్రీన్‌ మంకీస్‌ ద్వారా ఇది సోకినట్టు అప్పట్లో తేల్చారు. గబ్బిలాల వంటివాటికి ఆవాసమైన గుహలు, గనుల్లో చాలాకాలం పాటు గడిపితే ఈ వైరస్‌ సోకుతుంది. పైగా ఇది అంటువ్యాధి కూడా. ఒకరి నుంచి మరొకరికి సులువుగా, అతి వేగంగా సోకుతుంది. తలనొప్పి, జ్వరం, ఆయాసంతో మొదలై మూడో నాటికల్లా పొత్తి కడుపు నొప్పి, విరేచనాల దాకా వెళ్తుంది. వారం రోజులకు రక్తపు వాంతులు మొదలవుతాయి. కళ్లన్నీ లోపలికి పోయి, మనిషి పీక్కుపోయి అచ్చు దెయ్యాన్ని తలపిస్తాడు. కేంద్ర నాడీవ్యవస్థ పనితీరు కూడా బాగా మందగిస్తుంది. 
చికిత్స లేదు 
దీనికి ఇప్పటిదాకా మందు గానీ, వ్యాక్సీన్‌ గానీ అందుబాటులో లేవు. పలు వ్యాక్సీన్లు ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. ఇదమిత్థంగా చికిత్స కూడా లేదనే చెప్పాలి. అసలు తొలి దశలో ఎంవీడీని గుర్తించడం కూడా చాలా కష్టం.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)

Green Comet: నిష్క్ర‌మించిన ఆకుపచ్చ తోకచుక్క.. మ‌ళ్లీ 50 సంవ‌త్స‌రాల త‌ర్వాత‌..
జనవరి మధ్య నుంచి ఫిబ్రవరి తొలి వారం దాకా దాదాపు నెల రోజుల పాటు ఆకాశంలో కనువిందు చేసిన ఆకుపచ్చని తోకచుక్క ఇక సెలవంటూ వెళ్లిపోతోంది. సి2022ఈ3గా పిలుస్తున్న ఈ తోకచుక్క మన నుంచి అత్యంత దూరంగా సౌరమండలపు వెలుపలి తీరాల కేసి పయనమవుతోంది. ఇది మళ్లీ భూమికి సమీపంగా వచ్చి మనకు కనిపించేది మరో 50 వేల సంవత్సరాల తర్వాతే! సరిగ్గా చెప్పాలంటే, 52023వ సంవత్సరంలో అన్నమాట!! అయితే సూర్యుడు, ఇతర గ్రహాల ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల దాని కక్ష్యలో బాగా మార్పుచేర్పులు జరిగే క్రమంలో అది అంతకంటే చాలా ముందే మరోసారి భూమికి సమీపానికి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేమంటున్నారు సైంటిస్టులు. అదే సమయంలో కక్ష్యలో వ్యతిరేక మార్పు లు జరిగితే 50 వేల ఏళ్ల కంటే ఎక్కువ సమయమూ పట్టవచ్చని కూడా వారు చెబుతున్నారు. భూమికి అతి సమీపానికి వచ్చినప్పుడు భూ ఉపరితలం నుంచి ఈ తోకచుక్క 4.2 కోట్ల కిలోమీటర్ల దూరంలో కనువిందు చేసింది. అది చివరిసారి మనకు కనిపించినప్పటికి భూమిపై ఆధునిక మానవుని ఆవిర్భావమే జరగలేదు! అప్పటికింకా నియాండర్తల్‌ మానవుల హవాయే నడుస్తోంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (సైన్స్ & టెక్నాలజీ) క్విజ్ (22-28 జనవరి 2023)

ITBP Battalions: కీలక నిర్ణయం.. చైనా బార్డర్​లో ఏడు బెటాలియన్లు
భారత్‌–చైనా వాస్తవాధీన రేఖ వెంట సైన్యం మొహరింపును మరింతగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. కొత్త బెటాలియన్లు, సిబ్బందికి సంబంధించిన నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ ఆమోదముద్ర వేసింది. భారత్‌–చైనా వాస్తవాధీన రేఖ వెంట సరిహద్దు భద్రత చూసే ఇండో–టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)లోకి మరో 9,400 మందిని నియమించనున్నారు. వీరు బోర్డర్‌ బేస్‌ వద్ద విధులు నిర్వహించనున్నారు. మరో ఏడు బెటాలియన్ల మంజూరుకూ ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతాంశాలపై కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. కొత్త సిబ్బందిని 47 నూతన బోర్డర్‌ పోస్ట్‌లు, డజను ‘స్టేజింగ్‌ క్యాంప్‌’లు/ ట్రూప్‌ బేస్‌లలో నియోగించనున్నారు. ఇవి చాలావరకు అరుణాల్‌ ప్రదేశ్‌లో ఏర్పాటవుతాయి. కొత్త బెటాలియన్లు, సెక్టార్‌ ప్రధానకార్యాలయాన్ని 2025–26కల్లా ఏర్పాటుచేస్తారు. సిబ్బంది స్థావరాలు, ఆఫీస్, నివాస గృహాల కోసం రూ.1,808 కోట్లు, ఏటా నిర్వహణకు రూ.964 కోట్లు ఖర్చుకానుంది. 2020 ఏడాది నుంచి లద్దాఖ్‌లో ఇరు దేశాల సైనిక మొహరింపు పెరిగిన విషయం విదితమే. ప్రస్తుతం భారత్‌–చైనా వాస్తవాధీన రేఖ వెంట 176 బోర్డర్‌ పోస్ట్‌లు ఉన్నాయి.

Lithium: బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైన తెల్ల బంగారం

Aero India 2023: దేశీయ ఆయుధాలకే ప్రాధాన్యం.. రాజ్‌నాథ్‌
దేశీయంగా ఉత్పత్తి చేసిన ఆయుధాలు, పరికరాలకే రక్షణ రంగంలో ప్రాధాన్యమిస్తున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉద్ఘాటించారు. 2023–24లో రక్షణ శాఖ పెట్టుబడి వ్యయంలో 75 శాతం నిధులను వాటి కొనుగోలుకే వెచ్చించనున్నట్లు తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 15న‌ బెంగళూరులో ఏరో ఇండియా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమ వర్గాలు ఒక్క అడుగు ముందుకేస్తే ప్రభుత్వం 10 అడుగులు వేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.

Indian Railways: 84 వేల వ్యాగన్లకు ఆర్డర్ 
సరకు రవాణా రంగంలో రైల్వేల వాటా పెంచేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శనా జర్దోశ్‌ అన్నారు. ప్రస్తుత 27 శాతం నుంచి 2030కల్లా 45 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అందుకే ఒకేసారి ఏకంగా 84,000 వ్యాగన్ల కోసం ఆర్డర్‌ ఇచ్చామని ఫిబ్ర‌వ‌రి 15న‌ అసోచామ్‌ కార్యక్రమంలో చెప్పారు. ‘‘ఈ ఏడాది 150 కోట్ల టన్నుల లోడింగ్‌ సామర్థ్యాన్ని సంతరించుకోవడమే రైల్వే శాఖ లక్ష్యం. డెడికేటెడ్‌ ఫ్రీట్‌ కారిడార్‌లు 61 శాతం పూర్తయ్యాయి. సంపూర్ణంగా అందుబాటులోకి వస్తే సరకు రవాణా రైళ్ల వేగమూ పెరుగుతుంది. వచ్చే ఆర్థికసంవత్సరంలో రైల్వే విద్యుదీకరణ 100 శాతం పూర్తి అవుతుందని భావిస్తున్నా’ అని అన్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (22-28 జనవరి 2023)

Antonio Guterres: పెరిగే సముద్ర మట్టాలతో కొన్ని దేశాలు జలసమాధి!
భూతాప పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు కట్టడి చేయకపోతే సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరిగి పలు దేశాలను ముంచేస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ‘పెరుగుతున్న సముద్ర మట్టాలు’ అంశంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘‘సముద్ర మట్టాలు పెరిగితే భారత్, బంగ్లాదేశ్, చైనా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలకు చాలా ప్రమాదం. కైరో, లాగోస్, మపుటో, బ్యాంకాక్, ఢాకా, జకార్తా, ముంబై, షాంఘై, కోపెన్‌హాగెన్, లండన్, లాస్‌ ఏంజెలెస్, న్యూయార్క్, బ్యూనస్‌ ఏరిస్, శాంటియాగో వంటి నగరాలకు ముప్పు. భూతాపం 2 డిగ్రీలు పెరిగితే సముద్రమట్టాలు ఆరు మీటర్లు, 5 డిగ్రీలు పెరిగితే ఏకంగా 22 మీటర్లు పైకెగసి ఆయా దేశాలను జలసమాధి చేస్తాయి’’ అని హెచ్చరించారు.

AI: ChatGPTకి పోటీగా.. Google Bard!!

Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భూకంపం.. 80కి పైగా ప్రకంపనలు 
సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో ఫిబ్ర‌వ‌రి 16న (గురువారం) భారీ భూకంపం  సంభ‌వించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేనప్పటికీ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలిసింది. మస్బేట్‌ ప్రావిన్స్‌లోని మియాగా తీర‌ గ్రామానికి 11 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్ తెలిపింది. 80కి పైగా ప్రకంపనలు నమోదైనట్లు ఫిలిప్పీన్స్ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది.
ఈ ప్రావిన్స్ మూడు ద్వీపాలలో దాదాపు పది లక్షల మంది జనాభాను కలిగి ఉంది.  రాజధాని మాస్బేట్ సిటీలోని కొన్ని భవనాలు ప్రావిన్షియల్ హాస్పిటల్‌తో సహా వాటి గోడలలో పగుళ్లు ఉన్నాయని మాస్బేట్ ప్రావిన్షియల్ డిజాస్టర్ ఆఫీసర్ అడోనిస్ దిలావో చెప్పారు. నగరంలోని స్పోర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక లోపల సీలింగ్‌లోని ఒక భాగం కూల‌గా, విద్యుత్ పోస్ట్‌లు, పార్క్ చేసిన కార్లు కూడా కదిలాయన్నారు. 

Turkey Syria Earthquake: తుర్కియే, సిరియా భూకంపంతో 70 లక్షల పిల్లల బాల్యం శిథిలం

WPL 2023: ఆర్‌సీబీ మెంటార్‌గా సానియా మీర్జా 
హైదరాబాదీ టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా రాకెట్‌ వీడాక క్రికెట్‌ ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టనుంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్ టోర్నీలో తలపడే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మెంటార్‌గా ఆమెను నియమించారు. ఈ సందర్భంగా  ‘ఆర్‌సీబీ మహిళల జట్టులో భాగమవడం సంతోషంగా ఉంది. రిటైర్మెంట్‌ అనంతరం మరో పాత్ర పోషించేందుకు ఈ జట్టు, బ్రాండ్‌ నా దృక్పథానికి సరిగ్గా సరిపోతుంది. డబ్ల్యూపీఎల్‌తో అమ్మాయిల క్రికెట్‌ మరో దశకు చేరుతుంది’ అని ఆరు గ్రాండ్‌స్లామ్‌ (డబుల్స్‌) టైటిల్స్‌ విజేత సానియా తెలిపింది.
ఆమె వచ్చే వారం దుబాయ్‌ ఈవెంట్‌తో టెన్నిస్‌కు వీడ్కోలు పలకనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ మహిళల జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉన్న ఆ్రస్టేలియాకు చెందిన బెన్‌ సాయెర్‌కు ఆర్‌సీబీ హెడ్‌ కోచ్‌ బాధ్యతలు అప్పగించారు. సహాయ కోచ్‌గా మలోలన్‌  రంగరాజన్, ఫీల్డింగ్‌ కోచ్‌గా వనిత, బ్యాటింగ్‌ కోచ్‌గా ఆర్‌ఎక్స్‌ మురళీలను నియమించారు. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)

Mahindra EV Plant: తెలంగాణలో రూ.1000 కోట్లతో మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్లాంట్  
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'మహీంద్రా అండ్ మహీంద్రా' భారతదేశంలో తన ఉనికిని నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే తెలంగాణాలో రూ.1000 కోట్లతో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకి సిద్ధమైంది. ఇప్పటికే కంపెనీ జహీరాబాద్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తోంది. కాగా ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో 1,000 మందికి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ తరువాత జరిగిన చర్చల్లో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి చూస్తే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణా అడ్డాగా మారే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ సందర్భంగా మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ 'రాజేశ్‌ జేజురికర్‌' మాట్లాడుతూ, తెలంగాణాలో ఏర్పాటు కానున్న ఈవీ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ కూడా ఉత్పత్తవుతాయి. తాజా పెట్టుబడులు ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ తయారీకి పెద్ద పీట వేయనున్నారు, ఇందులో ఎలక్ట్రిక్ కార్లు కూడా తయారవుతాయి.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకున్న డిమాండ్ రోజురోజుకి విపరీతంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా వాహన తయారీ సంస్థలు దీనివైపు అడుగులువేస్తున్నాయి. మహీంద్రా కంపెనీ ఏర్పాటు చేయనున్న కొత్త ఈవీ ప్లాంట్ మరో 3-5 సంవత్సరాలలో పూర్తయ్యే అవకాశం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.2,83,452 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి

Internet Explorer: ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’ సేవలు నిలిపివేత.. 28 ఏళ్ల చరిత్రకు మైక్రోసాఫ్ట్ ముగింపు! 
ఒకప్పుడు అంతర్జాలంలో ఓ వెలుగు వెలిగిన సర్చ్ ఇంజిన్ ‘ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌’ శకం ముగిసింది. 1995లో ప్రారంభమై 28 ఏండ్లుగా సేవలందిస్తున్న ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కే మైక్రోసాఫ్ట్ ఎట్టకేలకు ఫుల్​స్టాప్ పెట్టింది. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ డివైజ్‌లపై ఫైనల్‌ అప్‌డేటెట్‌ వెర్షన్‌ను ‘ఐఈ11’ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ఫిబ్ర‌వ‌రి 14న ప్రకటించింది. ఈ బ్రౌజర్‌ ఇకపై ‘నో మోర్‌’ ‘రిటైర్డ్‌’ అని పేర్కొన్నది. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌కు టెక్నికల్‌ సపోర్టును ఆపేస్తున్నట్టు వెల్లడించింది. పాత బ్రౌజర్‌ ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌ అప్‌డేట్‌ ఇస్తామని తెలిపింది. ‘మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ అప్‌డేట్‌ను కమర్షియల్‌, కన్జూమర్‌ డివైజ్‌లన్నింటికీ ఒకేసారి ఇస్తాం’ అని పేర్కొన్నది. ‘ఐఈ’ పూర్తిగా నిలిపివేసే ప్రక్రియను మైక్రోసాఫ్ట్‌ గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రకటించింది.

WPL 2023 Auction: డబ్ల్యూపీఎల్‌ వేలంలో భారత వైస్‌ కెప్టెన్‌కు అత్యధిక మొత్తం

  

Published date : 16 Feb 2023 06:26PM

Photo Stories