Skip to main content

ఇక ఉద్యోగాల భర్తీలో కొత్త జోనల్‌ వ్యవస్థ అమలు.. వీటిప్రకారం గానే..

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీలో పరిగణనలోకి తీసుకోవాల్సిన కొత్త జోన్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో 33 జిల్లాలతో కొత్త జోన్లను అమల్లోకి తెస్తూ బుధవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ గెజిట్‌ ఉత్తర్వులు 128 జారీ చేశారు. వీటిని తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) సవరణ ఉత్తర్వులు– 2021గా అమలు అవుతాయని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీలో కొత్త జోనల్‌ వ్యవస్థ అమల్లోకి రానుంది.

2018లోనే మార్పు చేసినా..
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 జిల్లాలను ప్రభుత్వం 31 జిల్లాలుగా మార్పు చేసింది. రెండు జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని 7 జోన్లుగా, రెండు మల్టీ జోన్లుగా 2018లోనే మార్చింది. వాటికి అప్పట్లోనే రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాటిని అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం అదే ఏడాది ఆగస్టు 30న జీవో 124 జారీ చేసింది. అందులో కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు, పోస్టుల భర్తీలో అనుసరించే విధానాలన్నింటినీ వెల్లడించింది. వాటి ప్రకారం జిల్లా స్థాయి నుంచి మల్టీ జోన్‌ వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. 5 శాతం పోస్టులను మాత్రమే ఓపెన్‌ కోటా కింద పేర్కొంది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లాలో స్థానికులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర స్థాయి కేడర్‌ పోస్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ఇకపై ఉండదు. వాటిని మల్టీ జోన్‌ పరిధిలోనే భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ములుగు, నారాయణపేట జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసింది. దీంతో 33 జిల్లాలు అయ్యాయి. వాటితో పాటు గద్వాల జోన్‌లో ఉన్న వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌ పరిధిలోకి తీసుకొచ్చింది. వాటికి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో ప్రభుత్వం మళ్లీ రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆప్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఉత్తర్వులు–2018కు కేంద్రం సవరణ చేసి, ఈ ఏడాది ఏప్రిల్‌19న తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) సవరణ ఉత్తర్వులు–2021ను జారీ చేసింది. మల్టీ జోన్‌–1 కింద కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు వస్తాయి. మల్టీజోన్‌– 2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజా ఆదేశాల ప్రకారం ఇకపై వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల్లో ఈ జోన్లే ప్రామాణికం కానున్నాయి. పోలీసు శాఖకు మాత్రం ప్రత్యేకంగా జోన్లను ఏర్పాటు చేసింది. పోలీసు కమిషనరేట్ల పరిధి ఒకటికి మించి జిల్లాల్లో విస్తరించి ఉన్న కారణంగా మార్పులు చేసింది.

కానిస్టేబుల్‌ జిల్లాకు, ఎస్సై జోన్‌కు, ఇన్‌స్పెక్టర్‌ మల్టీజోన్‌కు..
పోలీసు నియామకాల్లో కొత్త జోన్లు, మల్టీ జోన్లే ప్రామాణికం కానున్నాయి. ఇకపై చేపట్టనున్న నియామకాల ప్రకారం.. కానిస్టేబుళ్లు ఎంపికైన జిల్లాల వారీగా, ఎస్సైలు ఎంపికైన జోన్లలో పనిచేయాల్సి ఉంటుంది. ఇక ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు ఆఫీసర్లు మల్టీజోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది. అంటే ఇన్‌స్పెక్టర్లు మల్టీజోన్లలో ఎక్కడ పోస్టింగ్‌ ఇస్తే అక్కడ పని చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వ శాఖలకు ఇలా..

మల్టీజోన్‌

జోన్‌

జిల్లాలు

మల్టీజోన్‌–1

జోన్‌–1 (కాళేశ్వరం)

ఆసిఫాబాద్‌ కుమ్రం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌–భూపాలపల్లి, ములుగు.

జోన్‌–2 (బాసర)

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల

జోన్‌–3 (రాజన్న–సిరిసిల్ల)

కరీంనగర్, సిరిసిల్ల– రాజన్న, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి

జోన్‌–4 (భద్రాద్రి)

కొత్తగూడెం– భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్‌

మల్టీజోన్‌–2

జోన్‌–5 (యాదాద్రి)

సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి–యాదాద్రి, జనగాం

జోన్‌–6 (చార్మినార్‌)

మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌

జోన్‌–7 (జోగుళాంబ)

మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగుళాంబ–గద్వాల్, వనపర్తి, నాగర్‌కర్నూల్‌


పోలీసు శాఖలకు ఇలా..

మల్టీజోన్‌

జోన్‌

పోలీసు జిల్లాలు/ కమిషనరేట్లు

మల్టీజోన్‌–1

జోన్‌–1 (కాళేశ్వరం)

జయశంకర్‌–భూపాలపల్లి, అసిఫాబాద్‌– కొమరంభీమ్, రామగుండం పోలీస్‌ కమిషనరేట్, ములుగు

జోన్‌–2 (బాసర)

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, జగిత్యాల

జోన్‌–3 (రాజన్న)

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్, సిద్ధిపేట పోలీస్‌ కమిషనరేట్‌, సిరిసిల్ల–రాజన్న, కామారెడ్డి, మెదక్

జోన్‌–4 (భద్రాద్రి)

కొత్తగూడెం– భద్రాద్రి, ఖమ్మం పోలీస్‌ కమిషనరేట్, మహబూబాబాద్, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌

మల్టీజోన్‌–2

జోన్‌–5 (యాదాద్రి)

సూర్యాపేట, నల్లగొండ, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌

జోన్‌–6 (చార్మినార్‌)

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్, వికారాబాద్, సంగారెడ్డి

జోన్‌–7 (జోగుళాంబ)

మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్‌ జోగుళాంబ, నాగర్‌ కర్నూల్‌


రాష్ట్రంలో 33 జిల్లాలతో 2 మల్టీ జోన్ల, 7 జోన్ల వ్యవస్థ అమల్లోకి రానుంది.
  • మల్టీ జోన్‌–1 కింద కాళేశ్వరం, బాసర, సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు వస్తాయి.
  • మల్టీజోన్‌– 2 కింద యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లు రానున్నాయి.
  • జిల్లా స్థాయి నుంచి మల్టీ జోన్‌ వరకు 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి.
  • ప్రభుత్వ శాఖలకు, పోలీసు శాఖకు వేర్వేరుగా జోన్ల ఏర్పాటు ఉంది.
  • భవిష్యత్తులో చేపట్టే నియామకాల్లో కానిస్టేబుళ్లు జిల్లాల వారీగా, ఎస్సైలు జోన్ల వారీగా పనిచేయాల్సి ఉంటుంది.
  • ఇన్‌స్పెక్టర్‌ ర్యాంకు ఆఫీసర్లు మల్టీ జోన్లకు పరిమితం కావాల్సి ఉంటుంది.

నూతన జాతీయ విద్యా విధానం అమలుకు సహకరించాలి

రేపట్నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు
Published date : 01 Jul 2021 05:02PM

Photo Stories