Skip to main content

Release of rank list: ర్యాంకుల జాబితా విడుదల కౌన్సిలింగ్‌ తేదీలు ఇవే..

Rank list and counseling dates,State Government Course Admissions, Rank List Announcement in Health Department
Rank list and counseling dates

సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిద్ధ, ఆయుర్వేదం, యునానీ తదితర కోర్సుల సీట్ల భర్తీకి ఆరోగ్య శాఖ చర్యలు ప్రారంభించింది. ఈమేరకు అభ్యర్థుల ర్యాంకుల జాబితాను మంగళవారం ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్‌ విడుదల చేశారు. దీంతో ఈనెల 26వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. వివరాలు..

రాష్ట్రంలో 2 ప్రభుత్వ, 11 స్వయం ప్రతిపత్తి హోదా కలిగిన సిద్ధ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 786 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆయుర్వేద విభాగంలో 361 సీట్లు, యునానీ కళాశాలలో 46 సీట్లు, ప్రభుత్వ హోమియోపతి, 11 ప్రైవేటు కళాశాలలో 822 సీట్లు సహా మొత్తం 2,015 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 49 సీట్లు కేంద్ర కోటా పరిధిలోకి వస్తాయి. మిగిలిన సీట్ల కోసం 2,695 మంది దరఖాస్తు చేసుకోగా, 2,530 వినతులను పరిగణనలోకి తీసుకున్నారు.

అలాగే, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 7.5 శాతం కోటా సీట్లకు 596 మంది దరఖాస్తు చేసుకోగా 556 దరఖాస్తులను పరిగణనలోకి తీసుకున్నారు. యాజమాన్య కోటా పరిధిలోని 1,040 సీట్లకు 968 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సీట్లు నీట్‌ మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. జనరల్‌ విద్యార్థులకు 137 మార్కులు, ఇతర విద్యార్థులకు 107 మార్కులను అర్హతగా నిర్ణయించారు.

కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాటు పూర్తి : మంత్రి

ఉదయం గిండిలోని కలైంజ్ఞర్‌ కరుణానిధి శత జయంతి స్మారక ఆస్పత్రి ఆవరణలో ఈ కోర్సుల కౌన్సెలింగ్‌కు అర్హత సాధించిన వారి వివరాలను, ర్యాంకర్ల జాబితాను ఆరోగ్యమంత్రి ఎం. సుబ్రమణియన్‌ విడుదల చేయగా, ఆరోగ్య కార్యదర్శి గగన్‌ దీప్‌సింగ్‌ బేడీ అందుకున్నారు. ప్రభుత్వ కోటా సీట్లలో సేలంకు చెందిన వైశాలి తొలి ర్యాంకు, యాజమాన్య కోటా సీట్లలో చైన్నెకు చెందిన విద్యార్ధి హకరిహరన్‌ తొలి స్థానం దక్కించుకున్నారు.

ప్రభుత్వం విద్యార్థులకు 7.5 శాతం పరిధిలో 92 సీట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో ధర్మపురికి చెందిన తిరుమలై మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈనెల 26వ తేదీ నుంచి 29 వతేదీ వరకు కౌన్సెలింగ్‌ జరగనుంది. 31వ తేదీన కేంద్ర కోటా సీట్ల భర్తీ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

రాష్ట్రంలోని మదురైలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటుకు పరిశీలిస్తున్నామన్నారు. ఎయిమ్స్‌ తరహాలో సిద్ధ వైద్య ఎయిమ్స్‌ను తిర్చుచ్చిలో ఏర్పాటు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, స్థలాలు సైతం రెడీగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ఓ సిద్ధవైద్య వర్సిటీ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం చైన్నె శివారురోని మాధవరంలో 25 ఎకరాలు ఎంపిక చేసినట్లు తెలిపారు.

Published date : 20 Oct 2023 08:21AM

Photo Stories