Andhra Pradesh: సివిల్, మెకానికల్ బ్రాంచీలలో విద్యార్థులు కరువు ఎందుకంటే..?
సాక్షి ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2023కు సంబంధించి ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ బుధవారం పూర్తయింది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు నామమాత్రంగానే భర్తీ అయ్యాయి. అన్ని కళాశాలల్లోనూ సివిల్ కేవలం 66, మెకానికల్ 45 .ఈఈఈ 217 , ఈసీఈ 710 సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ సీట్లు ఎంపిక చేసుకున్న విద్యార్థులే కరువయ్యారు. తొలి దశ కౌన్సిలింగ్లో మెచ్చిన కళాశాలలో సీటు దక్కిన విద్యార్థులు అదే కళాశాలలో కొనసాగుతారు. నచ్చిన కళాశాలలో సీటు దక్కని వారు రెండో దఫా కౌన్సెలింగ్కు ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తొలి దశ కౌన్సెలింగ్లో అనంతపురం జిల్లాలో జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ అనుబంధ బ్రాంచ్ల్లో పూర్తి స్థాయి సీట్లు భర్తీ అయ్యాయి. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు 7, అటానమస్ కళాశాలలు రెండు ఉండగా... ఎస్ఆర్ఐటీ (అటానమస్ )కళాశాలలో 576 సీట్లకు అనుమతి కాగా, 521 సీట్లు భర్తీ కావడం విశేషం. ఎస్ఆర్ఐటీలో 287 కంప్యూటర్ సైన్సెస్ సీట్లు ఉండగా, అన్నీ భర్తీ అయ్యాయి.