డిగ్రీ 2, 4 సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
![degree-semester-exams-begin](/sites/default/files/images/2023/08/01/degree-1690887343.jpg)
ఈ నెల 17వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ పరిధిలో 64 కేంద్రాల్లో జరుగుతున్న పరీక్షలను విద్యాశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు.
పోర్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం
● ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం మూలపేట గ్రామానికి వచ్చి నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. జీడిమొక్కలు, పీడీఎఫ్ పరిహారం చెల్లించాలని నిర్వాసితులు కోరారు. అలాగే ఆర్అండ్ఆర్కాలనీలో బోర్లు వేసినా నీరు పడటంలేదని, రోడ్లు బాగు చేయాలని ఎమ్మెల్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈయనతో సబ్కలెక్టర్ రాహుల్కుమార్ రెడ్డి, డీఎస్పీ భరత్చంద్రరెడ్డి ఉన్నారు.
‘డిలీషన్కు డాక్యుమెంట్లు తప్పనిసరి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రతి డిలీషన్కి సంబంధిత డాక్యుమెంట్స్ తప్పకుండా అప్లోడ్ చేయాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ అన్నారు. ఆయన సోమవారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 21న కుటుంబాల సర్వే ప్రారంభమైందని, ఇప్పటివరకు చేపట్టిన సర్వేపై సమీక్షించారు. ఓటరు జాబితాలో తొలగించడం, జత చేయడం జరుగుతుందని అందుకు సంబంధించి ప్రతి ఒక్క దరఖాస్తుకి సంబంధించి డాక్యుమెంట్లు అన్నీ అప్లోడ్ చేయాలన్నారు. సంతకాలు లేకుండా ఫారాలు అప్లోడ్ చేయకూడదన్నారు. ఆగస్టు 21 నాటికి వందశాతం సర్వే పూర్తి కావాలన్నారు. ఈ సర్వేకు వలంటీర్లు వెళ్లకూడదని అన్నారు.
ముగిసిన సేవాదళ్ శిక్షణ శిబిరాలు
శ్రీకాకుళం కల్చరల్: సత్యసాయి బాబా కొలువైన ప్రశాంత నిలయంలో సేవలకు వెళ్లే సేవాదళ్కు విధివిధానాలు తెలియజేసేందుకు నిర్వహించిన శిక్షణ శిబిరాలు ఆరు జోన్లలో ముగిశాయని జిల్లా సేవాదళ్ సమన్వయకర్త సూర రామచంద్రరావు తలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సోంపేట, పలాస, హిరమండలం, శ్రీకాకుళం, నరసన్నపేట జోనల్లో శిక్షణలు ముగిసినట్టు పేర్కొన్నారు. పాతపట్నం, టెక్కలి జోన్లలో ఆగస్టు ఆరో తేదీ ప్రారంభమవుతాయని వెల్లడించారు. పుట్టపర్తికి దేశ విదేశాలనుంచి వచ్చే సందర్శకులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సేవలు అందించేందుకు సేవాదళ్ ఏర్పడిందన్నారు. జిల్లానుంచి అధికమంది భక్తులకు శిక్షణ ఇచ్చి సేవాదళ్గా రూపొందించామన్నారు. వీరిని ప్రశాంతి నిలయం సేవలకు ఏటా ఆరు పర్యాయాలు పంపిస్తామన్నారు.
శ్రీకాకుళం వాసి దారుణ హత్య
● కత్తితో గొంతు కోసి చంపేసిన వైనం
● సహచర కార్మికులపైనే అనుమానాలు
రాంబిల్లి (అనకాపల్లి జిల్లా): కొత్తపేటలో దారుణహత్య చోటుచేసుకుంది. శ్రీకాకుళానికి చెందిన లోపింటి మాధవరావు (23)ను పీక కోసి హత్య చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు. నేవల్ బేస్లో నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టీ సంస్థలో కాంట్రాక్టర్ నారాయణ వద్ద మాధవరావు గత కొన్నాళ్లుగా పనిచేస్తున్నాడు. అక్కడే పరిచయమైన మరో ఐదుగురు కార్మికులతో కలిసి కొత్తపేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. మాధవరావు మరణానికి దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియరాలేదు. కాంట్రాక్టర్ నారాయణ ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం డీఎస్పీ సత్యనారాయణ పర్యవేక్షణలో సీఐ గపూర్, ఎస్ఐ దీనబంధు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించగా, ఒక కార్మికుడి వైపు వెళ్లినట్లు తెలిసింది. దీంతో అదే రూంలో ఉంటున్న ఐదుగురు కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేస్తున్నట్టు ఎస్ఐ దీనబంధు తెలిపారు.
ఉలిక్కిపడ్డ కొత్తపేట
రక్తపు మడుగులో మాధవరావు మృతదేహం పడి వుండటం, హత్య జరిగిన ప్రదేశంలో పొడవైన కత్తి దొరకడంతో కొత్తపేటలో భయానక వాతావరణం చోటు చేసుకుంది. మండల వ్యాప్తంగా ఈ వార్త దావానలంలా వ్యాపించింది. వారం రోజుల క్రితం కొత్తపేటలో ఒక కార్మికుడిని మరో కార్మికుడు చాకుతో కడుపులో పేగు బయటకు వచ్చేలా పొడిచిన విషయం తెలిసిందే.