Skip to main content

President Of India: మీ ఒక్కరి విజయంతో ఆగిపోవద్దు

సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినులు తమ సొంత విజయాలతో సంతృప్తి చెంది ఆగిపోవద్దని.. సమాజంలోని సామాజిక, ఆర్థిక, డిజిటల్‌ అంతరాలను తొలగించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు.
Address By The President Of India Smt Droupadi Murmu At The G Narayanamma Institute
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఉద్యోగాలు చేయడం కోసం కాకుండా, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్‌ (స్టెమ్‌) రంగాల విద్య, పరిశోధనల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. డిసెంబర్‌ 29న హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. పరిశోధనలు, సృజనాత్మకత వంటి అంశాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగవుతుందని ద్రౌపదీ ముర్ము చెప్పారు. ఇటీవలి కాలంలో టెక్నాలజీ వాడకం బాగా పెరిగిందని, అది నిరర్థకం కాకుండా, ఉత్పాదకత పెంచేలా ఉండాలన్నారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ ఇటీవల తనను కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. దేశంలో డిజిటల్‌ అంతరాలను తొలగించేందుకు, డిజిటల్‌ అక్షరాస్యతను పెంచేందుకు తగిన చర్య లు తీసుకోవాల్సిందిగా ఆయనను కోరినట్టు రాష్ట్రపతి వివరించారు.

చదవండి: President Droupadi murmu: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : ద్రౌపదిముర్ము

విద్యలో మార్పుతో మెరుగైన ప్రపంచం 

భారతదేశాన్ని ప్రపంచంలోనే బలీయమైన మేధోశక్తిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అందరికీ అందుబాటులో ఉండటం, సమానత్వం, నాణ్యత, బాధ్యత అన్న నాలుగు స్తంభాల ఆధారంగా ఈ కొత్త విద్యావిధానం రూపు దిద్దుకుందని తెలిపారు. సంపూర్ణ, బహుముఖ, పట్టువిడుపులున్న విద్యావ్యవస్థ విద్యార్థుల్లోని నైపుణ్యాలను మరింత సమర్థంగా వెలికితీయగలవని, నేర్చుకునే శక్తిని పెంచగలవని చెప్పారు. నూతన జాతీయ విద్యా విధానం ఈ అంశాలతో పాటు పరిశోధనలను ప్రోత్సహించడాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందిందన్నారు. ఆధునిక యుగంలో ఇంజనీర్‌ వృత్తి చాలా కీలకమని.. వారికి ప్రపంచాన్ని మార్చేసే శక్తి ఉంటుందని వివరించారు. విద్యార్థినులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన సమాజం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల అవసరాలను తీర్చే, పర్యావరణ అనుకూల టెక్నాలజీలను రూపొందించాలని కోరారు.

చదవండి: President Droupadi Murmu: కాలానుగుణంగా రాజ్యాంగంలో మార్పుచేర్పులు అవసరం

హక్కులను అడిగి సాధించుకోవాలి: గవర్నర్‌ తమిళిసై 

ఒక మహిళ రాష్ట్రపతిగా, త్రివిధ దళాధిపతిగా ఉన్న భారతదేశంలో మహిళలు ఎన్నడూ బలహీనులుగా తమని తాము అనుకోరాదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. మహిళలు తమ హక్కుల కోసం ఎదురు చూడటం కాకుండా వాటిని అడిగి మరీ సాధించుకోవాలని సూచించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం విద్యార్థులకు ఆదర్శప్రాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంతి సత్యవతి రాథోడ్, నారాయణమ్మ కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.

చదవండి: Droupadi Murmu: చిన్నప్పటి బడికి రాష్ట్రపతి

Published date : 30 Dec 2022 01:41PM

Photo Stories