Skip to main content

UPSC: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. వారి నేపథ్యం ఇలా..

దేశంలో అత్యున్నత స్థాయి క్యాడర్‌ పోస్టులైన ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఆలిండియా సర్వీస్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్‌–2021 తుది ఫలితాలను (ఇంటర్వ్యూ) యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) మే 30న విడుదల చేసింది.
UPSC
సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు.. వారి నేపథ్యం ఇలా..

ఫలితాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 685 మందిని ఆయా క్యాడర్‌ పోస్టులకు ఎంపిక చేసింది. సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 40 మంది ఉన్నత ర్యాంకుల్లో నిలిచారు. ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లెకు చెందిన చల్లపల్లి యశ్వంత్‌కుమార్‌రెడ్డి 15వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటాడు. విజేతలుగా నిలిచిన అభ్యర్థుల నేపథ్యం, వారి మనోగతాలివీ..

సీఎం, గవర్నర్‌ శుభాకాంక్షలు

సివిల్స్‌–2021లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. 15వ ర్యాంకు సాధించిన సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు ఇతర అభ్యర్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు పొందడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని గవర్నర్‌ పేర్కొన్నారు. 15 ర్యాంకు సాధించిన యశ్వంత్‌కుమార్‌రెడ్డితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీరితో పాటు సివిల్స్‌కు ఎంపికైన 685 మందికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

చదవండి: 

Success Story: ఈ లెక్కలే.. న‌న్ను 'ఐఏఎస్‌' అయ్యేలా చేశాయ్‌.. ఎలా అంటే..?

IPS Success Story: ఐపీఎస్ కొట్టానిలా .. ఒక సంచలనం కేసులో స‌క్సెస్ అయ్యానిలా..

Dr.Gajarao Bhupal IPS: డాక్ట‌ర్ వృత్తి నుంచి.. ఐపీఎస్ వైపు వ‌చ్చానిలా..
యశ్వంత్‌కుమార్‌రెడ్డి నేపథ్యమిదీ
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం కలుగొట్లపల్లె గ్రామానికి చెందిన చల్లపల్లె యశ్వంత్‌ కుమార్‌రెడ్డి తల్లిదండ్రులు చల్లపల్లె పుల్లారెడ్డి, లక్ష్మీదేవి. రెండో కుమారుడైన యశ్వంత్‌ వైఎస్సార్‌ జిల్లా రాజుపాలెం మండలం కూలురు కొట్టాల ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదివారు. రాజంపేట నవోదయలో 6 నుంచి 10వ తరగతి వరకు చదివి ప్రతిభ చాటుకున్నాడు. విజయవాడలో ఇంటర్‌ పూర్తిచేసి కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశారు. తరువాత బెంగళూరులోని ఐవోసీఎల్‌ కంపెనీలో చేరారు. అనంతరం గ్రూప్‌–1లో మూడో ర్యాంక్‌ సాధించి సీటీవోగా కర్నూలులో పనిచేస్తూ సివిల్స్‌లో శిక్షణ పొందారు. 2020లో సివిల్స్‌లో 93వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌కు ఎంపికై ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ సివిల్స్‌ రాసి పట్టుదలతో 15వ ర్యాంక్‌ సాధించారు. ఇతని తండ్రి పుల్లారెడ్డి వైఎస్సార్‌ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసి ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా పదవీ విరమణ చేశారు. యశ్వంత్‌ సోదరుడు నాగదస్తగిరిరెడ్డి అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్సిటిలో పీహెచ్‌డీ చేస్తున్నారు.


పూసపాటి వంశీకురాలికి 24వ ర్యాంక్‌
విశాఖ జిల్లా ఎండాడకు చెందిన పూసపాటి సాహిత్య సివిల్స్‌లో 24వ ర్యాంకు సాధించారు. విజయనగరం జిల్లా ద్వారపూడికు చెందిన ప్రముఖ రచయిత స్వర్గీయ పూసపాటి కృష్ణంరాజు మనవరాలు ఈమె. సాహిత్య తల్లిదండ్రులు పూసపాటి జగదీష్‌వర్మ, పద్మజ విశాఖ జిల్లా ఎండాడలో నివాసం ఉంటున్నారు. మొదటి నుంచీ చదువుపై ఆసక్తి పెంచుకున్న సాహిత్య మంచి ర్యాంకు సాధించినట్లు తల్లిదండ్రులు తెలిపారు. బీ.ఫార్మసీలో నేషనల్‌ టాపర్‌గా నిలిచి ఎమ్మెస్సీ చేసిన సాహిత్య ఏడాదిపాటు ఉద్యోగం చేశారు.
‘ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సివిల్స్‌కు సిద్ధమయ్యాను. జాతీయ స్థాయిలో 24వ ర్యాంక్‌ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని సాహిత్య తెలిపారు. 


సత్తా చాటిన నర్సీపట్నం యువకుడు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం యువకుడు మంతిన మౌర్యభరద్వాజ్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో 28వ ర్యాంకు సాధించారు. 2017 నుంచి వరుసగా ఐదుసార్లు ప్రయత్నం చేసి చివరకు లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. భరద్వాజ్‌ తండ్రి సత్యప్రసాద్‌ గొలుగొండ మండలం కొత్తమల్లంపేట హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. తల్లి రాధాకుమారి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన భరద్వాజ్‌ కొద్దికాలం బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. 2020లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలాన్ని శిక్షణకు వెచ్చించి విజయం సాధించారు. ‘పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా నా వంతు కృషి చేస్తాను. విద్య, వైద్య రంగాల్లో ప్రజలకు మరింత సేవ చేయాలన్నదే నా అభిమతం. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజల చెందకు చేర్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని భరద్వాజ చెప్పారు.

కందుకూరు కోడలికి 37వ ర్యాంక్‌
నెల్లూరు జిల్లా కందుకూరు కోడలు వి.సంజన సింహ సివిల్స్‌లో 37వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. హైదరాబాద్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లోనే బీటెక్‌ పూర్తి చేశారు. ఆ తరువాత సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. కందుకూరు పట్టణానికి చెందిన మన్నవ సుబ్బారావు కుమారుడు హర్షని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం వనస్థలిపురంలో లా ఎక్స్‌లెంట్‌ ఐఏఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వహిస్తూ సివిల్స్‌ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాడు. భర్త ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రయత్నించిన సంజనసింహ మూడో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై., ప్రస్తుతం హైదరాబాద్‌లో ఇన్‌కంట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ‘సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో నాలుగో ప్రయత్నంగా పరీక్ష రాసి విజయం సాధించాను. 37వ ర్యాంకు సాధించడం సంతోషాన్నిచ్చింది’ అని సంజన చెప్పారు.


56వ ర్యాంకర్‌ డాక్టర్‌ కిరణ్మయి
కాకినాడ రూరల్‌ మండలం వలసపాకల గ్రామానికి చెందిన డాక్టర్‌ కొప్పిశెట్టి కిరణ్మయి సివిల్స్‌లో ఆలిండియా స్థాయిలో 56వ ర్యాంకు సాధించారు. ఆమె తండ్రి కొప్పిశెట్టి లక్ష్మణరావు హైదరాబాద్‌లో రక్షణశాఖ (డీఆర్‌డీఎల్‌)లో సీనియర్‌ టెక్నికల్‌ అధికారిగా, తల్లి వెంకటలక్ష్మి టీచర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. వీరంతా వలసపాకలలోనే ఉంటున్నారు. కిరణ్మయి సోదరుడు నందకిశోర్, వదిన సృజన బీటెక్‌ పూర్తి చేసి అభ్యసించి వలసపాకల గ్రామంలో వ్యాపారంలో సిర్థపడ్డారు. కిరణ్మయి భర్త ఎం.విజయకుమార్‌ తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్మయి విద్య తెలంగాణలోనే సాగింది. ఎంసెట్‌లో స్టేట్‌ 24వ ర్యాంకు రావడంతో ఉస్మానియా వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ విద్యను అభ్యసించి, అక్కడే ఎంఎస్‌ పూర్తి చేసి అక్కడే వైద్యురాలిగా పనిచేశారు. భర్త ప్రోత్సాహంతో రెండేళ్ల పాటు సివిల్స్‌కు శిక్షణ పొందారు. 2018లో మొదటి ప్రయత్నంలో ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌లో 573 ర్యాంకుతో ఉద్యోగం పొందారు. 2019లో సివిల్స్‌ డానిక్స్‌లో 633 ర్యాంకు సాధించి ఆర్డీవో స్థాయి ఉద్యోగానికి ఢిల్లీలో శిక్షణ పొందుతున్నారు. సివిల్స్‌–2021లో 56ర్యాంకు పొందారు. ఐఏఎస్‌కు ఎంపికవుతానని కిరణ్మయి «ధీమా వ్యక్తం చేశారు.


62వ ర్యాంకర్‌ శ్రీపూజ నేపథ్యం
62వ ర్యాంకు సాధించిన తిరుమాని శ్రీపూజ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామానికి చెందినవారు. ఆమె తండ్రి వెంకటేశ్వర్లు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీపూజను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కోన శశిధర్‌ తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. శ్రీపూజ ఎన్‌ఐటీ సూరత్‌కల్‌లో బీటెక్‌ చేశారు. అనంతరం సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. తాను తొలిసారి సివిల్స్‌కు సిద్ధమైనప్పుడు ఢిల్లీలో శిక్షణ తీసుకున్నానని, తదనంతరం కరోనా కారణంగా ఇంట్లోనే ఉండి ఇపుడు రెండోసారి మెయిన్స్‌ రాసి విజయం సాధించానన్నారు. ‘చిన్నప్పటి నుంచే సివిల్స్‌ లక్ష్యంగా ముందుకు సాగాను. అందుకే లక్షలాది రూపాయల వేతనం కూడిన ఉన్నతోద్యోగాలు వచ్చినా చేరలేదు. ఐఏఎస్‌ కావాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నా. మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. రెండోసారి సివిల్స్‌లో ర్యాంకును సాధించాను’ అని శ్రీపూజిత చెప్పారు.


సత్తా చాటిన రైతు బిడ్డ
2021 సివిల్స్‌లో నంద్యాల జిల్లా కోవెలకుంట్లకు చెందిన రైతు బిడ్డ గడ్డం సుధీర్‌కుమార్‌ సత్తా చాటారు. పెద్ద రామసుబ్బారెడ్డి, రమాదేవి దంపతుల కుమారుడైన సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకు సాధించారు. 1నుంచి 4వ తరగతి వరకు కోవెలకుంట్ల, 5 నుంచి 10వ తరగతి వరకు నంద్యాల, కర్నూలులో చదివారు. ఇంటర్‌ గుడివాడలో చదివి, పశ్చిమబెంగాల్‌ ఖరగ్‌పూర్‌లో ఐఐటీ పూర్తి చేశారు. ఐఏఎస్‌ సాధించాలన్న లక్ష్యంతో 2017 నుంచి ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుంటూ నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌ సాధించారు.


రాజమహేంద్రి యువకుడికి 99 ర్యాంకు
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోడల్‌ కాలనీకి చెందిన తరుణ్‌ పట్నాయక్‌ తొలి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా 99వ ర్యాంకు సాధించారు. తరుణ్‌ తండ్రి రవికుమార్‌ పట్నాయక్‌ ఎల్‌ఐసీ రూరల్‌ బ్రాంచిలో క్లర్క్‌గా పనిచేస్తుండగా, తల్లి శారదా రాజ్యలక్ష్మి వైజాగ్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తరుణ్‌ పట్నాయక్‌ గౌహతి ఐఐటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదివారు. ‘సివిల్స్‌కు స్వంతంగా చదువుకుంటూనే తొలి ప్రయత్నంగా పరీక్ష రాశాను. 99వ ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. ఐఏఎస్‌గా ఎంపికై ప్రజలకు సేవ చేయాలనే తన లక్ష్యం నెరవేరింది’ అని తరుణ్‌ పట్నాయక్‌ తెలిపారు.
ఎమ్మిగనూరు అమ్మాయికి 128వ ర్యాంక్‌
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన అంబికాజైన్‌ తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో 128వ ర్యాంకు సాధించారు. పట్టణానికి చెందిన జైన్‌ ఎలక్ట్రికల్‌ షాపు యజమాని లలిత్‌కుమార్, అనిత దంపతుల కుమార్తె అయిన అంబికాజైన్‌ 10వ తరగతి వరకు ఇక్కడే చదివారు. ఇంటర్మీడియెట్, డిగ్రీలను హైదరాబాద్‌లో పూర్తి చేసి ఢిల్లీలోని సౌత్‌ ఏషియన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ రిలేషన్‌షిప్‌లో ఎంఏ చేశారు. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌ సాధించటం ఎంతో ఆనందంగా ఉందని, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అధ్యాపకుల సహకారంతో ఇది సాధ్యమైందని అంబికాజైన్‌ తెలిపారు.


ఆన్‌లైన్‌ కోచింగ్‌ తీసుకుని 154వ ర్యాంక్‌
నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లె గ్రామానికి చెందిన వంగల సర్వేశ్వరరెడ్డి, మల్లేశ్వరమ్మ దంపతుల కుమార్తె మనీషారెడ్డి సివిల్స్‌లో 154వ ర్యాంకు సాధించింది. మనీషా ఇంటర్, డిగ్రీ హైదరాబాద్‌లో పూర్తి చేసింది. తరువాత ఆన్‌లైన్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటూ మెళకువలు నేర్చుకుంది. సివిల్స్‌లో హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టులుగా ఎంచుకుంది. మనీషారెడ్డి మాట్లాడుతూ.. ‘రైతు కుటుంబం నుంచి వచ్చాను. పేదల కష్టాలు కళ్లారా చూశాను. పేదలకు సేవ చేయడం ద్వారా లభించే ఆనందమే నిజమైన ఆస్తి. ఆడపిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్‌ చదువులే కాదు కష్టపడితే అతి తక్కువ కాలంలో ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా సాధించగలరు’ అని చెప్పారు.


పెదకూరపాడు యువకుడికి 157వ ర్యాంక్‌
పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామానికి చెందిన కన్నెధార మనోజ్‌కుమార్‌ అలిండియా స్థాయిలో 157వ ర్యాంక్‌ సాధించారు. న్యాయవాది కన్నెధార హనమయ్య, రాజరాజేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మనోజ్‌ 1నుంచి తరగతి నుంచి 7వ తరగతి పెదకూరపాడులోని ప్రైవేట్‌ పాఠశాలలో, 8 నుంచి ఇంటర్‌ వరకు గుంటూరులో, ఐఐటీ ఇంజనీరింగ్‌ విద్యను తిరుపతిలో అభ్యసించారు. ఆ తరువాత రూ.30 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం రాగా.. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో 157 ర్యాంకు సాధించారు. ‘దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్‌కు సిద్ధమయ్యా. తల్లిదండ్రుల స్ఫూర్తితో రోజుకు 8 గంటలు చదివేవాడిని’ అని మనోజ్‌కుమార్‌ తెలిపారు.


మూడో అటెంప్ట్‌లో 235వ ర్యాంక్‌
గుంటూరు శ్యామలా నగర్‌కు చెందిన కాకుమాను అశ్విన్‌ మణిదీప్‌ సివిల్స్‌లో 235 ర్యాంకు సాధించారు. మణిదీప్‌ తండ్రి కిషోర్, తల్లి ఉమాదేవి ఉపాధ్యాయులు. ఎల్‌కేజీ నుంచి 10వ తరగతి వరకు ఇంటి పక్కనే ఉన్న వెంకటేశ్వర బాలకుటీర్‌లో చదివాడు. ఇంటర్‌లో జేఈఈ మెయిన్స్‌ స్కోర్‌ ఆధారంగా ఇస్రో ఆధ్వర్యంలో నడిచే ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్సెస్‌ టెక్నాలజీలో బీటెక్‌ ఏరో స్పేస్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మణిదీప్‌ ఆ తరువాత నుంచి సివిల్స్‌కు ప్రిపేరవుతూ వచ్చారు. 2019లో తొలి ప్రయత్నం చేయగా.. ప్రిలిమ్స్‌ కూడా క్లియర్‌ చేయలేకపోయాడు. 2020లో మరోసారి సివిల్స్‌ పరీక్షలకు హాజరై ఇంటరŠూయ్వ వరకు వెళ్లినా తృటిలో ర్యాంకు మిస్‌ అయ్యింది. 2021 అక్టోబర్‌లో పరీక్ష రాయగా 235వ ర్యాంక్‌ లభించింది. మణిదీప్‌ మాట్లాడుతూ.. ‘తొలిసారి దారుణంగా ఓటమి చెందినా నిరాశ చెందకుండా కొంతకాలం చెన్నైలో శిక్షణ పొందాను. కరోనా దగ్గర్నుంచి ఇంటివద్దే సాధన చేస్తున్నాను. ఆన్‌లైన్‌ టెస్ట్‌లు రాసేవాడిని, నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకోవడం, ఆంగ్ల, తెలుగు పత్రికలు చదవడం చేసేవాడిని’ అని చెప్పారు.


తల్లిదండ్రుల స్ఫూరితో సివిల్స్‌కు..
ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడకు చెందిన షేక్‌ అబ్దుల్‌ రవూఫ్‌ సివిల్స్‌లో 309 ర్యాంక్‌ సాధించారు. రవూఫ్‌ తండ్రి మహ్మద్‌ ఇక్బాల్‌ వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్‌గా పని చేస్తుండగా.. తల్లి గౌసియా బేగం కృష్ణా జిల్లా మైనార్జీ సంక్షేమ అధికారిగా, వ్యవసాయ శాఖలో జాయింట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. తల్లిదండ్రులిద్దరూ నిత్యం ప్రజలతో ఉంటూ సేవలందిస్తున్న నేపథ్యంలో.. వారి స్ఫూర్తితో తాను కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో సివిల్స్‌ రాశానని రవూఫ్‌ చెప్పారు. ‘ముంబై ఐఐటీలో బీటెక్‌ పూర్తి చేశాక అమెరికాలో ఎంఎస్‌ చేశాను. అమెరికాలో విద్య పూర్తి చేసినా ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఇండియాకు వచ్చేశా. చెన్నైలో నాబార్డు మేనేజర్‌గా రెండున్నరేళ్లు పని చేశాను. ఏడాదిగా ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్‌లో సివిల్స్‌ శిక్షణ పొందాను. సివిల్స్‌లో 309 ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉంది’ అని రవూఫ్‌ పేర్కొన్నారు.


గంగపుత్రుడికి 350వ ర్యాంక్‌
కాకినాడ పర్లోవపేటకు చెందిన దిబ్బాడ సత్యవెంకట అశోక్‌ సివిల్స్‌ 2021లో 350వ ర్యాంక్‌ సాధించారు. జాలరి కుటుంబానికి చెందిన అశోక్‌ తండ్రి సత్తిరాజు సముద్రంలో చేపల వేట చేస్తుంటారు. 1నుంచి 5వ తరగతి వరకు విశాఖపట్నంలో, 6 నుంచి 10వ తరగతి వరకు కాకినాడలో, ఇంటర్మీడియెట్‌ గుంటూరులో, గౌహతిలో ఐఐటీ బీటెక్‌ పూర్తి చేసిన అశోక్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేశారు. ఐఏఎస్‌ సాధించాలనే లక్ష్యంతో ఢిల్లీలో రెండేళ్లు కోచింగ్‌ తీసుకున్నారు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్‌లో 350వ ర్యాంకు సాధించారు.


రైతు బిడ్డకు 420వ ర్యాంక్‌
తెనాలి రూరల్‌ మండలం చావావారి పాలెంకు చెందిన రైతుబిడ్డ నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు సాధించారు. 1.25 ఎకరాల రైతు నల్లమోతు రాజేంద్రప్రసాద్, కృష్ణకుమారి ఏకైక కుమారుడు బాలకృష్ణ. తాడికొండ గురుకుల పాఠశాలలో 8, 9 తరగతులు, అంగలకుదురు జెడ్పీ హైస్కూల్‌లో టెన్త్‌ పూర్తిచేశాక విజయవాడలో ఇంటర్మీడియెట్‌ చదివాడు. జేఎన్‌టీయూ, పులివెందులలో బీటెక్, 2012–14లో చెన్నైలో రెన్యూవబుల్‌ ఎనర్జీలో ఎంటెక్‌ పూర్తిచేశాడు. అనంతరం ప్రతిష్టాత్మక ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌’ (సీఎస్‌ఐఆర్‌)లో మూడేళ్లు జూనియర్‌ సైంటిస్ట్‌గా పనిచేశారు. చిన్నతనం నుంచీ ఆసక్తి కలిగిన సివిల్స్‌ లక్ష్యాన్ని సాధించుకోవాలన్న భావనతో, అక్కడ్నుంచి బయటకు వచ్చేశారు. సివిల్స్‌కు ప్రిపేరవటం మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నం విఫలం కాగా, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాజ్యోతి పథకానికి ఎంపికై చెన్నైలోని శంకర ఐఏఎస్‌ అకాడమీలో సివిల్స్‌లో ఉచితంగా కోచింగ్‌ తీసుకున్నాడు. ‘ప్రస్తుత ర్యాంక్‌తో ఐఆర్‌ఎస్‌ వస్తుందని భావిస్తున్నా. ఈ విజయం నాకు సంతృప్తిగా లేదు. మరోసారి సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ సాధించాలనేది నా ఆశయం’ అని నల్లమోతు బాలకృష్ణ చెప్పారు.


ఓఎన్‌జీసీ ఉద్యోగికి 602వ ర్యాంకు
కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం వాడపర్రు గ్రామానికి చెందిన పండు విల్సన్‌ సివిల్స్‌లో 602వ ర్యాంకు సాధించారు. ముంబైలోని ఓఎన్‌జీసీ ఎలక్ట్రికల్‌ విభాగంలో ఉద్యోగం చేస్తూ తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. తండ్రి ప్రసాద్‌ వ్యవసాయం చేస్తుంటారు. తల్లి లక్ష్మి గృహిణి. విల్సన్‌ గొల్లవిల్లి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. కాకినాడ జేఎన్‌టీయూలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడై ఓఎన్‌జీసీలో ఉద్యోగం సాధించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులు

పేరు

ర్యాంకు

యశ్వంత్‌కుమార్‌రెడ్డి

15

పూసపాటి సాహిత్య

24

శ్రుతి రాజ్యలక్ష్మి

25

మంతిన మౌర్యభరద్వాజ్‌

28

వి.సంజనసింహ

37

రవికుమార్‌

38

అక్షయ్‌ పిళ్లై

51

కొప్పిశెట్టి కిరణ్మయి

56

తిరుమాని శ్రీపూజ

62

గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి

69

తరుణ్‌ పట్నాయక్‌

99

ఆకునూరి నరేశ్‌

117

అంబికాజైన్‌

128

అరుగుల స్నేహ

136

వంగల మనీషారెడ్డి

154

కన్నెధార మనోజ్‌కుమార్‌

157

బి.చైతన్యరెడ్డి

161

సయ్యద్‌ ముస్తాఫా హష్మి

162

కాకుమాను అశ్విన్‌ మణిదీప్‌

235

ఎస్‌.కమలేశ్వర్‌రావు

297

షేక్‌ అబ్దుల్‌ రవూఫ్‌

309

విద్యామరి శ్రీధర్‌

336

దిబ్బడ అశోక్‌

350

గూగులావత్‌ శరత్‌ నాయక్‌

374

నల్లమోతు బాలకృష్ణ

420

పోలూరి శ్రీలేఖ

427

వైవీఆర్‌ శశిశేఖర్‌

469

ఉప్పులూరి చైతన్య

470

ఎస్‌.సంతోష్‌ కుమార్‌

503

పి.శ్రవణ్‌కుమార్‌

521

మేడిశెట్టి అనన్యప్రియ

544

మన్యాల అనిరుధ్‌

563

బిడ్డి అఖిల్‌

566

రంజిత్‌ కుమార్‌

574

పండు విల్సన్‌

602

డి.కుడియారసు

604

ముత్యపు పవిత్ర

608

ఐఈఎస్‌ఎస్‌డీ మనోజ్‌

615

బాణావత్‌ అరవింద్‌

623

బచ్చు స్మరణ్‌రాజ్‌

676 

Published date : 31 May 2022 01:23PM

Photo Stories