Skip to main content

విద్యారుణం...భవితకు వరం!

ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశం.. ప్రతి ఒక్క విద్యార్థి కల.. ఎన్నో ఎంట్రన్స్‌లు రాసి.. అద్భుత ప్రతిభ చూపినా.. పెరుగుతున్న ఫీజుల భారం భరించలేని పరిస్థితి! దీనివల్ల ప్రతిభ ఉన్నప్పటికీ.. ఉన్నత విద్య కలగానే మిగిలిపోతోంది. ఇప్పుడు ఇలాంటి విద్యార్థులకు వరం.. విద్యా రుణాలు (ఎడ్యుకేషన్ లోన్స్)! దేశ, విదేశీ విద్యకు సైతం బ్యాంకుల్లో విద్యా రుణాలు అందుకునే అవకాశముంది. ఫలితంగా ప్రతిభావంతులు తమ ఉన్నత విద్య స్వప్నం సాకారం చేసుకోవడం సులభంగా మారుతోంది. రానున్న కొత్త విద్యా సంవత్సరంలో.. భారీ ఫీజుల నుంచి ఉపశమనం కల్పిస్తున్న బ్యాంకుల విద్యారుణాల గురించి తెలుసుకుందాం...
  • సుశాంత్.. క్యాట్‌లో అత్యుత్తమ పర్సంటైల్ సాధించాడు. ప్రముఖ ఐఐఎంలో సీటు కూడా ఖరారైంది. కానీ, ఫీజు చూస్తే రూ.20 లక్షలకు పైమాటే. తల్లిదండ్రులుఅంత మొత్తాన్ని భరించలేని పరిస్థితి.
  • రమేశ్.. విదేశీ విద్య ఔత్సాహిక విద్యార్థి. టోఫెల్ నుంచి జీఆర్‌ఈ వరకూ.. అన్ని పరీక్షల్లో ఉత్తమ స్కోర్లే! దాంతో అమెరికాలో మెరుగైన యూనివర్సిటీల్లో సీటు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ, విదేశీ విద్యకు అయ్యే రూ.లక్షల వ్యయాన్ని భరించలేమని నిస్సహాయత వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.
... సుశాంత్, రమేశ్‌లు ఇద్దరే కాదు. తెలుగురాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది విద్యార్థులు.. ఎంతటి ప్రతిభావంతులైనప్పటికీ..ఫీజుల భారం కారణంగా ఉన్నత విద్య కలను సాకారం చేసుకోలేక రాజీపడిపోతున్న వైనం. ఇలాంటి ప్రతిభావంతులంతా తమ ఉన్నత విద్య కలను సాకారం చేసుకునేందుకు బ్యాంకులు విద్యారుణాలు అందిస్తున్నాయి. విద్యార్థులు బ్యాంకు రుణాలు మరింత సులువుగా పొందేందుకు ఎంహెచ్‌ఆర్‌డీ శాఖ... ‘విద్యాలక్ష్మి’ పేరిట ఉమ్మడి పోర్టల్‌ను సైతం రూపొందించింది.

విద్యా రుణాలు పొందాలంటే?
  1. ప్రస్తుతం బ్యాంకులు పలు నిబంధనలకు అనుగుణంగా విద్యా రుణాలు అందిస్తున్నాయి.
  2. ఏఐసీటీఈ, యూజీసీ, ఎంహెచ్‌ఆర్‌డీ గుర్తింపు పొందిన కళాశాలల్లో, కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకోవాలి. ఇలాంటి అభ్యర్థులే బ్యాంకుల విద్యారుణ దరఖాస్తుకు అర్హులు. అదే విధంగా వీరు ఎంట్రన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలవాలి.
  3. మేనేజ్‌మెంట్ కోటాలో సీటు పొందిన విద్యార్థులు.. విద్యా రుణానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. అయితే ఇటీవల ఐబీఏ మార్పులు చేసిన మోడల్ ఎడ్యుకేషన్ లోన్ స్కీమ్ ప్రకారం.. ఒక విద్యార్థి మేనేజ్‌మెంట్ కోటాలో ప్రవేశం పొంది విద్యా రుణానికి దరఖాస్తు చేసుకుంటే.. ఆ దరఖాస్తును పరిశీలించి, రుణాన్ని మంజూరు చేసే విషయంలో బ్యాంకులు తమ విచక్షణ మేరకు వ్యవహరించే అవకాశం ఉంది. గత నాలుగైదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. బ్యాంకులు నూటికి 90 శాతం రుణాలను ఎంట్రన్స్ టెస్ట్‌లలో ప్రతిభ చూపిన వారికే మంజూరు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

స్టడీ అబ్రాడ్‌కు కూడా..
పస్తుతం బ్యాంకులు దేశంలోనే కాకుండా.. విదేశాల్లో చదవాలనుకుంటున్న విద్యార్థులకు సైతం రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ విషయంలోనూ కచ్చితమైన నిబంధనలు అమలవుతున్నాయి. దీని ప్రకారం సదరు విద్యార్థి ప్రవేశం పొందిన విదేశీ ఇన్‌స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ ఆ దేశ ప్రభుత్వ గుర్తింపును తప్పనిసరిగా పొంది ఉండాలి.

రుణ మొత్తం :
  • ప్రస్తుతం బ్యాంకులు.. మూడు టారిఫ్‌ల విధానాన్ని (రూ.4 లక్షలు; రూ.4.5 లక్షలు-రూ.7.5 లక్షలు; రూ.7.5 లక్షలకు పైగా) అనుసరిస్తున్నాయి.
  • విద్యార్థులు ప్రవేశం పొందిన కోర్సు, ఇన్‌స్టిట్యూట్.. దానికి ఉన్న గుర్తింపు ఆధారంగా గరిష్టంగా రూ.20 లక్షల వరకు రుణాన్ని మంజూరు చేస్తున్నాయి.
  • స్వదేశంలో చదివే విద్యార్థులకు గరిష్టంగా మంజూరు చేస్తున్నది రూ.10 లక్షలు.
  • విదేశీ యూనివర్సిటీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షలు.
  • గరిష్టంగా ఎంత రుణం మంజూరు చేయాలో బ్యాంకులు తమ విచక్షణ మేరకు వ్యవహరించే అవకాశముంది. కొన్నిసార్లు ఇంతకంటే ఎక్కువ మొత్తాలను కూడా మంజూరు చేస్తున్నాయి.
  • ఐఐఎంలు, ఐఐటీలు, న్యాక్ ఏ గ్రేడ్, ఎన్‌బీఏ అక్రెడిటేషన్ ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల విషయంలో పైన పేర్కొన్న గరిష్ట మొత్తం నిబంధనలతో సంబంధం లేకుండా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి.

రుణ హామీ విధానాలు :
విద్యా రుణాలు మంజూరు చేసే క్రమంలో.. ఆ తర్వాత తిరిగి చెల్లింపు విషయాన్ని పరిగణనలోకి తీసుకొని బ్యాంకులు హామీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం...
  • రూ.4 లక్షల రుణానికి తల్లిదండ్రుల హామీ సరిపోతుంది.
  • రూ.4 లక్షల నుంచి రూ.7.5 లక్షల మధ్య రుణాలకు తల్లిదండ్రుల హామీతోపాటు థర్డ్ పార్టీ హామీ తప్పనిసరి.
  • రూ.7.5 లక్షలకు పైగా మంజూరు చేసే రుణాలకు కొల్లేటరల్ సెక్యూరిటీ ఉండాలి.

సొంతగా కొంత మొత్తం :
విద్యా రుణాలు మంజూరు చేసే క్రమంలో.. విద్యార్థులు, తల్లిదండ్రులు మార్జిన్ మనీ పేరుతో సొంతంగా కొంత మొత్తాన్ని సమకూర్చుకున్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుంది. రూ.4 లక్షల లోపు రుణానికి ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. రూ.4 లక్షలు దాటిన రుణ దరఖాస్తుల విషయంలో.. స్వదేశంలో చదివే విద్యార్థులు 5 శాతం, విదేశీ విద్య ఔత్సాహికులు 15 శాతం మార్జిన్ మనీని సమకూర్చుకోవాలి.

విద్యార్థినులకు వడ్డీలో తగ్గింపు :
ఉన్నత విద్యలో విద్యార్థినులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు తమ వంతు తోడ్పాటును అందిస్తున్నాయి. విద్యా రుణాన్ని పొందిన విద్యార్థినులకు మొత్తం వడ్డీలో 0.5 శాతం తగ్గిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులైతే ఒక శాతం తగ్గిస్తుండటం విశేషం. విద్యా రుణాలకు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 8 నుంచి 11 శాతం వరకు వార్షిక వడ్డీ రేటు ఉంటోంది. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఇది 10 శాతం నుంచి 14 శాతం మధ్యలో ఉంది.

సిబిల్ స్కోర్ కూడా ప్రధానమే..
విద్యా రుణాల మంజూరు, రీ పేమెంట్ క్రమంలో.. బ్యాంకులు తల్లిదండ్రుల ఆర్థిక సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు సిబిల్ స్కోర్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. సిబిల్ స్కోర్ 750కు పైగా ఉంటే సులభంగా రుణాన్ని మంజూరు చేస్తున్నాయి.

పీ టు పీ లెండింగ్ సంస్థలు :
ఇటీవల కాలంలో విద్యా రుణాల మంజూరుకు పీర్ టు పీర్ లెండింగ్ (పీ టు పీ) సంస్థలు కూడా ముందుకొస్తున్నాయి. ఆర్‌బీఐ గుర్తింపు పొందిన పీ టు పీ లెండింగ్ సంస్థలు విద్యా రుణాలు అందిస్తున్నాయి. వీటి రీ పేమెంట్ నిబంధనలు, వడ్డీ రేట్లు బ్యాంకులతో పోల్చితే కొంత ఎక్కువగా ఉంటున్నాయి.

దరఖాస్తుకు ఉమ్మడి వేదిక.. ‘విద్యాలక్ష్మి’ :
ఒకప్పుడు ఎడ్యుకేషన్ లోన్ కోసం.. ఒక్కో బ్యాంకుకు వెళ్లి.. ప్రతి బ్యాంకులో ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో వ్యయప్రయాసలకు గురయ్యేవారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఎంహెచ్‌ఆర్‌డీ.. విద్యాలక్ష్మి పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ ద్వారా ఒకే అప్లికేషన్‌తో పలు బ్యాంకులకు దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇందుకోసం విద్యార్థులు విద్యాలక్ష్మి పోర్టల్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్‌లో పేర్కొన్న వివరాలు పూర్తి చేయాలి. ఇలా వచ్చిన దరఖాస్తులను విద్యార్థులు పేర్కొన్న బ్యాంకులకు అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత సంబంధిత బ్యాంకు ప్రతినిధులు... విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంప్రదించి రుణ ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తారు. విద్యాలక్ష్మి పోర్టల్ ఏర్పాటు చేసిన తర్వాతే... విద్యా రుణాలకు దరఖాస్తుల సంఖ్య పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

రీ పేమెంట్ హాలిడే :
విద్యా రుణాలు పొందిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిసొచ్చేలా రుణ మొత్తం తిరిగి చెల్లింపు పరంగా రీ పేమెంట్ హాలిడే విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది వరకు లేదా కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం లభించే వరకు.. ఈ రెండింటిలో ఏది ముందైతే అప్పటివరకు లోన్ రీపేమెంట్ చేయక్కర్లేదు. అంటే.. విద్యార్థులు కోర్సు పూర్తయ్యాక ఒక ఏడాది తర్వాత నుంచి లేదా ఈ లోపే ఉద్యోగం వస్తే అప్పటి నుంచి రీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా నెలవారీ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంది. గతేడాది ఎంహెచ్‌ఆర్‌డీ మరోకొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం-కుటుంబ వార్షికాదాయం రూ.4.5లక్షలలోపు ఉన్న విద్యార్థుల విషయంలో వడ్డీ సబ్సిడీ విధానాన్ని ప్రవేశ పెట్టింది.
వెబ్‌సైట్: www.vidyalakshmi.co.in  

విద్యా రుణం లభించేది వీటికే..
  1. ట్యూషన్ ఫీజు.
  2. ఎగ్జామినేషన్/లైబ్రరీ/లేబొరేటరీ ఫీజు.
  3. కంప్యూటర్ కొనుగోలు వ్యయం.
  4. హాస్టల్ ఫీజు.
  5. పుస్తకాలు, యూనిఫామ్, ఇతర అకడమిక్ సంబంధిత పరికరాల కొనుగోలుకు అయ్యే వ్యయం.
  6. విదేశీ విద్య ఔత్సాహికులకు ప్రయాణ ఖర్చులు.
  7. కోర్సు పరంగా అవసరమైన స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ తదితరాలకు అయ్యే ఖర్చు.
  8. ఇన్‌స్టిట్యూట్‌లు వసూలు చేసే కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రిఫండబుల్ డిపాజిట్‌లకు రుణం మంజూరు చేస్తారు. ఇవి నిర్దేశిత ట్యూషన్ ఫీజు మొత్తంలో 10 శాతానికి మించకుండా ఉండాలి.
  9. కంప్యూటర్ కొనుగోలు వ్యయం, స్టడీ టూర్స్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసం ఇచ్చే మొత్తం ట్యూషన్ ఫీజులో 20 శాతానికి మించకుండా ఉంటుంది.

విద్యారుణ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు..
  • ప్రవేశ ధ్రువీకరణ పత్రం.
  • అకడమిక్ అర్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు
  • తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ.
  • తల్లిదండ్రుల ఆదాయ స్థితిగతుల వివరాలు, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్స్.
  • నివాస ధ్రువీకరణ.
  • థర్డ్‌పార్టీ ఆదాయ ధ్రువీకరణ.
  • కోర్సు వ్యయానికి సంబంధించి ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి అధీకృత లెటర్స్
వెబ్‌సైట్: www.iba.org.in
Published date : 29 Apr 2019 03:28PM

Photo Stories