Skip to main content

టీచర్.. బ్రైట్ ఫ్యూచర్

సమాజంలో బృహత్తర బాధ్యత ఉపాధ్యాయుడిది. తల్లిదండ్రుల్లో చదువుపై అవగాహన పెరగడం, ఉద్యోగ అవకాశాలు విస్తరించడంతో ఉపాధ్యాయవృత్తికి క్రేజ్ ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో డీఎస్సీ ద్వారా నియామకాలు, కార్పొరేట్ పాఠశాలల విస్తరణ ఈ రెండూ కలిసి సుశిక్షులైన డీఎడ్, బీఎడ్ అభ్యర్థులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్నాయి. సమాజంలో గౌరవం, ఆకర్షణీయ వేతనాలు, ఉపాధి గ్యారెంటీ....ఇవన్నీ కలసి ఉపాధ్యాయవృత్తిపై యువతలో ఆసక్తి పెంచుతున్నాయి.

టెట్ తప్పనిసరి...
విద్యా హక్కు చట్టం ప్రకారం.. ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టాలనుకునే ప్రతి అభ్యర్థీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్... టెట్. పరీక్షలో ఉత్తీర్ణత పొందాలి. ఈ అర్హత పరీక్ష స్కోరుకు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. అందుకే ప్రతి ఉపాధ్యాయ ఉద్యోగార్థికీ ‘టెట్’ ప్రథమ లక్ష్యంగా మారింది. టెట్ స్వరూపం, పరీక్ష విధానం ప్రయోజనాల విశేషాలు...

పరీక్ష విధానం:
ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లుగా చేరాలనుకుంటే పేపర్-1; ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ వృత్తిని ఆశిస్తే పేపర్-2 రాయాలి. ఒక్కో పేపర్‌లో 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటాయి. పేపర్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ.. సిలబస్‌లో కొన్ని ఉమ్మడి అంశాలు కూడా ఉంటాయి.

టెట్ వెయిటేజీ:
డీఎస్సీలో అభ్యర్థి సాధించిన 80 శాతం, టెట్ 20 శాతం మార్కులను కలిపి అభ్యర్థుల మొత్తం మార్కులను గణిస్తారు.

ప్రిపరేషన్:
అర్హత సాధించడం సులువే కానీ, భవిష్యత్తులో లభించే వెయిటేజీని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మార్కులు సాధించాలి.

సైకాలజీ:
ఈ సబ్జెక్టులో ముఖ్యంగా పేపర్-1 రాసే అభ్యర్థులు చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీలో నవజాత శిశువు నుంచి.. ఉత్తర బాల్య దశకు ఉండే ప్రవర్తనాంశాలను అధ్యయనం చేయాలి. పేపర్-2 అభ్యర్థులు కౌమార దశకు సంబంధించిన ప్రవర్తనాంశాలను క్షుణ్నంగా ఆకళింపు చేసుకోవాలి.

పెడగాజీ:
పెడగాజీ అంటే బోధన శాస్త్రం. అభ్యర్థులు ఎక్కువ ఆందోళన చెందే విభాగమిదే. మెటీరియల్, రిఫరెన్స్ బుక్స్ లభ్యత కనిష్టంగా ఉం టుంది. ఇందులోని కీలకాంశాలైన శిశువు వి ద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం - నాయకత్వం -మార్గనిర్దేశకత్వం- మంత్రణం (కౌన్సెలింగ్)లను సిలబస్ అనుసరించి విశ్లేషణాత్మకంగా చదవాలి.

లాంగ్వేజ్ 1 (తెలుగు):
పాఠశాల స్థాయిలో తెలుగు సబ్జెక్ట్ బుక్స్‌తోపాటు తెలుగు బోధన పద్ధతులను చదవడం ద్వారా ఈ విభాగంలో పట్టు సాధించొచ్చు.

కంటెంట్:
పేపర్-1లో ఐదో తరగతి స్థాయిలోని పాఠ్యాంశాలు, ఆ పాఠ్యాంశాల చివరన ఇచ్చే ప్రాక్టీస్ బిట్స్ చదవాలి. పేపర్-2 కంటెంట్‌కు సంబంధించి 6, 7, 8 తరగతుల పాఠ్య పుస్తకాలను టెట్ సిలబస్‌ను పరిగణనలోకి తీసుకుంటూ చదవాలి. పాఠ్యాంశాల చివరన ఇచ్చిన బిట్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. దీన్ని గమనించాలి.

సోషల్ స్టడీస్:
అరవై మార్కులకు ఉండే ఈ పేపర్లో ఎక్కువ మార్కులు సాధించడానికి.. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. భూగోళ శాస్త్రంలో ఒక ప్రాంతం గురించి చదువుతున్నప్పుడు ఆ ప్రాంతం ఏ అక్షాంశాల మధ్య ఉంది... వాతావరణ, భౌగోళిక పరిస్థితులు, నదులు.. వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.

సైన్స్
ఈ సబ్జెక్ట్ కోసం కూడా మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. పదో తరగతి వరకు పస్తకాలను చదవడం వల్ల పేపర్-2కు మరింత లాభిస్తుంది. విశ్లేషణాత్మక ప్రిపరేషన్ అవసరం. ఇందుకోసం ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. పేపర్-2 కోసం ప్రత్యేకంగా ఆరు నుంచి పదో తరగతి వరకు పుస్తకాలు చదవాలి. చదివేటప్పుడు ఆయా అంశాల నుంచి ప్రశ్నార్హమైన వాటిని గుర్తించి వాటిని బిట్స్ రూపంలో నోట్స్ రాసుకోవడం మేలు.

గణితం
మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు చదవాలి. ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ అవసరం. కంటెంట్‌పై పట్టు కోసం కమర్షియల్ మ్యాథమెటిక్స్‌లో రాణించాలి. తెలుగు అకాడెమీ పుస్తకాలు, ఆబ్జెక్టివ్ టీరియల్ చదవాలి. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి.

ఇంగ్లిష్
ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించాలంటే.. బేసిక్ గ్రామర్ మీద పట్టు చాలా అవసరం. టీచింగ్ మెథడ్స్, టీచర్ లెర్నింగ్ మెటీరియల్(టీఎల్‌ఎం), రీసెంట్ ట్రెండ్స్ దృష్టిలో ఉంచుకుని ప్రిపేర్ కావాలి.

ప్రవేశం.. ఇలా:
పదో తరగతి మొదలు.. డిగ్రీ అర్హతగా పలు విభాగాల్లో ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వ/ప్రైవేట్ పాఠశాలల్లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీలు కావొచ్చు.

మాంటిస్సోరి ట్రైనింగ్:
ప్రీ-ప్రైమరీ స్థాయి (3-5 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు) లో బోధించడానికి ఉద్దేశించిన కోర్సు మాంటిస్సోరి ట్రైనింగ్. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీయడం, బొమ్మల సహాయంతో వారిలో నైపుణ్యాలను పెంచేందుకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో తర్ఫీదునివ్వడం ఈ కోర్సు ప్రత్యేకత. ప్రస్తుతం ఐదు దశల్లో ఈ కోర్సు ఉంది. అవి.. సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; సర్టిఫికెట్ ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్(ఎర్లీ చైల్డ్‌హుడ్); డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; హయ్యర్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్; ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ మాంటిస్సోరి ట్రైనింగ్. వీటిలో సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి కనీస అర్హత పదో తరగతి. ఆ తర్వాత ఒక్కో దశ శిక్షణ పూర్తి చేసుకుంటూ డిగ్రీతో సమానమైన ప్రొఫెషనల్ డిప్లొమా వరకు చేరుకోవచ్చు. గతంలో నగరాలకు పరిమితమైన కిండర్‌గార్టెన్‌లు ఇప్పుడు టైర్-2 పట్టణాల్లోనూ విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 20వేలకు పైగా కిండర్‌గార్టెన్‌లు, నర్సరీ స్కూళ్లు ఉన్నాయి. ప్రతిభ, అనుభవం ఆధారంగా నెలకు రూ.5-10 వేలు వరకు వేతనం ఇస్తున్నారు.

డీఎడ్:
ఇంటర్మీడియెట్‌తోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని అందించే కోర్సు.. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడీ). ఈ కోర్సులో ప్రవేశానికి డైట్ సెట్ రాయూలి. కోర్సు వ్యవధి రెండేళ్లు. ప్రథమ సంవత్సరంలో.. విద్యామనో విజ్ఞాన శాస్త్రం, విద్యాతత్వ శాస్త్రం, జనరల్ అంశాలైన పూర్వ ప్రాథమిక విద్య-ప్రస్తుత విద్య, ఆరోగ్యం, విద్య- కంప్యూటర్ ఎడ్యుకేషన్, వయోజన విద్య తదితర సబ్జెక్టులు ఉంటారుు. రెండో సంవత్సరంలో.. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల బోధన పద్ధతులను బోధిస్తారు. కోర్సులో భాగంగా.. టీచింగ్ ప్రాక్టీస్ 75 రోజులు ఉంటుంది. ఇందులో 35 రోజులు ప్రాథమిక పాఠశాలలు, 10 రోజులు ప్రాథమికోన్నత పాఠశాలల్లో బోధించాలి. 30 రోజులపాటు పాఠశాలల్లో ఇంటర్న్‌షిప్ ఉంటుంది. రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 23 ప్రభుత్వ ‘డైట్’ కళాశాలలు ఉన్నారుు. ప్రతి కళాశాలకు 100 సీట్లు. ప్రైవేట్‌లో సుమారు రెండు వందల కళాశాలల్లో.. దాదాపు 10 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. డీఈడీ ఉత్తీర్ణులు ప్రభుత్వం నిర్వహించే ఉపాధ్యాయ నియామక పరీక్ష-డీఎస్సీలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ) పోస్టుకు అర్హులు. 2012 నుంచి ఎస్‌జీటీ పోస్టులను కేవలం డీఈడీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలనే నిర్ణయం ఈ కోర్సు చేసిన వారికి వరంగా మారింది.

బీఎడ్:
గ్రాడ్యుయేషన్ అర్హతతో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తున్న కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్). వ్యవధి ఏడాది. ఈ కోర్సులో ప్రవేశానికి ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎడ్‌సెట్) రాయాలి. విద్యాతత్వ శాస్త్రం, విద్యా మనో విజ్ఞాన శాస్త్రం, పాఠశాల పరిపాలన-నిర్వహణ, కమ్యూనికేటివ్ ఇంగ్లిష్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ టెక్నాలజీతోపాటు గ్రాడ్యుయేషన్ స్థారుులో చదివిన గ్రూప్ సబ్జెక్టుల్లో రెండింటికి సంబంధించిన బోధన పద్ధతులు బోధిస్తారు. శిక్షణ సమయంలో 45 రోజులపాటు పాఠశాలకు వెళ్లి బోధన (ప్రాక్టికల్స్) చేయూలి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి దాదాపు 615 కాలేజీల్లో సుమారు 65 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీఈడీ ఉత్తీర్ణులు.. ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు.

ఫిజికల్ ఎడ్యుకేషన్:
ఎడ్యుకేషన్‌లో భాగంగా ఆటలు, వ్యాయామం వంటి ఫిజికల్ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఉండాలి. అందుకే ప్రభుత్వం ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా ప్లే గ్రౌండ్ ఉండాలనే నిబంధన విధించింది. తదనుగుణంగా ప్రతి పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ) పోస్టులు ఉంటాయి. రాష్ట్రంలో రెండు రకాల పీఈటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్(యూజీడీపీఈడీ)-అర్హత: ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం; బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్(బీపీఈడీ) అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్. ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(పీఈసెట్) ద్వారా ప్రవేశం లభిస్తుంది. రాష్ర్టంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో కలిపి 13 కళాశాలల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీపీఈడీ చేసిన అభ్యర్థులు... హైస్కూల్స్‌లో ిపీఈటీలుగా కెరీర్ ప్రారంభించవచ్చు.

లాంగ్వేజ్ పండిట్స్:
తెలుగు, హిందీ వంటి లాంగ్వేజ్ సబ్జెక్టులను బోధించడానికి ఉద్దేశించినవి లాంగ్వేజ్ పండిట్ కోర్సులు. వీటిల్లో ప్రవేశానికి లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎల్‌పీసెట్) రాయాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో పండిట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
తెలుగు పండిట్: అర్హత: బీఏ (తెలుగు లిటరేచర్/ఓరియెంటల్ లాంగ్వేజ్-తెలుగు/తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్/ఎంఏ-తెలుగు).
హిందీ పండిట్: హిందీ ఆప్షనల్‌తో డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఓరియెంటల్ లాంగ్వేజ్-హిందీ/దక్షిణ భారత హిందీ ప్రచార సభ ప్రవీణ/ హిందీ ప్రచార సభ-హైదరాబాద్ విద్వాన్ కోర్సు/ ఎంఏ(హిందీ).
తెలుగులో కోర్సు పూర్తి చేసిన వారిని టీపీటీలుగా, హిందీ అభ్యర్థులను హెచ్‌పీటీలుగా పిలుస్తారు.

స్పెషల్ ఎడ్యుకేషన్:

గత దశాబ్ద కాలంగా ఆదరణ పొందుతున్న విభాగం స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. మానసిక, శారీరక వైకల్యాలతో బాధపడుతూ, సాధారణ పిల్లలతో సమానంగా పోటీ పడలేని చిన్నారులకు అవసరమయ్యే బోధనా పద్ధతుల్లో శిక్షణనిచ్చేదే స్పెషల్ ఎడ్యుకేషన్. ప్రస్తుతం ఈ కోర్సులో మెంటల్ రిటార్డేషన్, హియరింగ్, విజువల్, ఆటిజం, ఇంపెయిర్‌మెంట్, లెర్నింగ్ డిజబిలిటీ విభాగాల్లో డీఈడీ, బీఈడీ, ఎంఈడీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌ను ప్రత్యేకంగా పరిగణించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కరిక్యులం రూపకల్పన, కళాశాలల గుర్తింపు, పర్యవేక్షణ బాధ్యతలను రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఈ కోర్సులను పూర్తి చేస్తే దేశ, విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, వివిధ స్వచ్ఛంధ సంస్థలు, ట్రస్టుల కింద నడిచే పాఠశాలలు, సర్వశిక్షా అభియాన్ పరిధిలోని పాఠశాలల్లో టీచర్‌గా; వివిధ ఆస్పత్రులు, రిహాబిలిటేషన్ సెంటర్లలో ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్‌గా, రెగ్యులర్ ప్రీస్కూళ్లు, వివిధ పాఠశాలల్లో ప్రత్యేక విద్యార్థులకు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా సేవలందించవచ్చు. ఈసీఎస్‌ఈ/సీఎస్‌ఈల్లో రీసెర్చ్ ప్రాజెక్ట్‌ల్లో పనిచేయొచ్చు. అంగన్‌వాడీ పాఠశాలలు, ప్రైవేట్ ప్రీ స్కూళ్లలో ప్రత్యేక శిక్షణ అవసరమైన చిన్నారులకు కోఆర్డినేటర్‌గా అవకాశాలు లభిస్తాయి.
మన రాష్ట్రంలో: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ - సికింద్రాబాద్; స్వీకార్ రిహాబిలిటేషన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హ్యాండీక్యాప్డ్ -సికింద్రాబాద్; ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం; శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం-తిరుపతి; కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్-ఆంధ్ర మహిళ సభ-హైదరాబాద్ బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సును అందిస్తున్నాయి.

అవకాశాలు:
ప్రభుత్వం తరచూ ‘డీఎస్సీ’ నోటిఫికేషన్ ద్వారా వేలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాలు, వివిధ ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉండే స్కూల్స్‌లో కూడా అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ రంగం రోజురోజుకు విస్తరించి చిన్న పట్టణాల్లోనూ కాన్వెంట్‌లు, నర్సరీలు, కార్పొరేట్ విద్యాసంస్థలు ఏర్పాటవుతున్నాయి వీటిలోనూ ఉపాధి లభిస్తుంది. ప్రతిభ, అనుభవం ఆధారంగా ప్రైవేట్ సంస్థలు నెలకు దాదాపు రూ.15-రూ.20 వేల వరకు చెల్లిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో ఇంజనీరింగ్, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సుల్లో బోధించేవారికి రూ. 50 వేలు కూడా చెల్లిస్తున్నారు.

ప్రమోషన్లు:
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా.. ఎస్‌జీటీ, ఎస్‌ఏగా కేడర్‌లో కెరీర్ ప్రారంభించి, ఉన్నత విద్యనభ్యసిస్తే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. బీఈడీ/ఎంఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్ పొందొచ్చు. సీనియూరిటీతో మండల విద్యాధికారి, డిప్యూటీ డీఈవో స్థారుుకీ చేరుకోవచ్చు. పీజీ పూర్తిచేస్తే.. జూనియర్ లెక్చరర్ కూడా కావొచ్చు.

కావల్సిన లక్షణాలు:
  • విషయాన్ని ప్రభావవంతంగా వివరించే కమ్యూనికేషన్ స్కిల్స్
  • మూస ధోరణి కాకుండా విభిన్న పద్ధతుల్లో బోధించడం
  • ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వడం
  • పాజిటివ్ దృక్పథం కలిగి ఉండడం
  • సబ్జెక్ట్ పరంగా వస్తున్న మార్పులను గమనించడం
  • ఆర్గనైజింగ్ స్కిల్స్, సమయస్ఫూర్తి, ప్రతిభ
Published date : 15 Jun 2012 06:22PM

Photo Stories