Skip to main content

స్వయం ఉపాధికి మార్గం.. సెట్విన్ కోర్సులు

స్వయం ఉపాధితో నిరుద్యోగ సమస్యను చాలావరకు తగ్గించే ఉద్దేశంతో 1978లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ సెట్విన్(సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్). స్వయం ఉపాధి పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది సెట్విన్. పది.. అంతకంటే తక్కువ విద్యార్హతలు ఉన్నవారికి కూడా సరికొత్త ఉపాధి మార్గం చూపడంలో సెట్విన్ పాత్ర మరువలేనిది. నిరుద్యోగ యువత మొదలు వ్యాపార రంగంపై అవగాహన, ఆసక్తి ఉన్న ప్రతిఒక్కరికి ఉపాధి కల్పించడంలో ఈ సంస్థ ఎనలేని పాత్ర పోషిస్తోంది. ఎప్పటికప్పుడు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులకు రూపకల్పన చేస్తూ.. పది, ఇంటర్, అంతకంటే తక్కువ చదువుకున్న వారికి అనేక స్వయం ఉపాధి మార్గాలు చూపుతోంది!!

సెట్విన్‌లో కోర్సులు నేర్చుకున్నవారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా డేటాఎంట్రీ ఆపరేటర్స్, ఎలక్ట్రీషియన్లు, మోటార్ మెకానిక్ కోర్సులు నేర్చుకున్నవారికి ఇన్ఫోసిస్, ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఐసీఐసీఐ, రిలయన్స్ ఫ్రెష్, మోర్, మెట్రోలాంటి పెద్ద సంస్థలతోపాటు చిన్నచిన్న కంపెనీలు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆసక్తికర విషయమేమంటే... కంపెనీలు ఈ స్కిల్స్ ఉన్న అభ్యర్ధులు కావాలంటూ సెట్విన్‌ను తరచూ సంప్రదిస్తుంటాయి. నేర్చుకోవాలనే తపన, జీవితంలో స్థిరపడాలన్న జిజ్ఞాస ఉన్నవారు సెట్విన్‌లో చేరితే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి ద్వారా జీవితంలో త్వరగా స్థిరపడొచ్చు. కోర్సు పూర్తి చేసుకున్నవారు సొంతంగా ఏదైనా చేయూలనుకుంటే రుణ సదుపాయం గురించి కూడా కావాల్సిన సమాచారాన్ని సెట్విన్‌లో అందిస్తున్నారు.

శిక్షణ...ఆపై ఉపాధి:
సెట్విన్ నిరుద్యోగులకు అనేకరకాల వినూత్న కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. వికలాంగులు, మహిళలు, విద్యార్థులు, ఉన్నత చదువులు చదువుకున్న వారికి సైతం ప్రయివేట్ రంగంలో పలు విభాగాల్లో అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ, మినీబస్ ట్రాన్స్‌పోర్టు పథకాలు, కంప్యూటర్ శిక్షణ, వేజ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్, ఉత్పాదక పథకాలు, ట్రేడింగ్, స్వయం ఉపాధి పథకాలతోపాటు ఇక్కడ కోర్సులు పూర్తిచేసిన వారికి పలు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చేవిధంగా ప్రత్యేకంగా ప్లేస్‌మెంట్ సెల్ నిర్వహిస్తోంది.

అందిస్తోన్న కోర్సులు:

మూడు నెలల కంప్యూటర్ కోర్సులు: ఎంఎస్ ఆఫీస్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ ఎయిర్‌లైన్ టికెటింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ(అడ్వాన్స్‌డ్), యూనిక్స్, సీ, సీ++ మొదలైనవి.

45 రోజుల కోర్సులు: కాల్‌సెంటర్ ట్రైనింగ్, కంప్యూటర్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రాం.

ఆరు నెలల టెక్నికల్ కోర్సులు (ఏడో తరగతి విద్యార్థులకు):
ఆటో ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, గోల్డ్ పాలిషింగ్ (3 నెలలు), ఆరు నెలల సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మెషినరీ వర్క్, ప్లంబింగ్, కార్పెంటరీ కోర్సులకు ఏడో తరగతి పాస్, లేదా ఫెయిల్ అయినా అర్హులే.

పదోతరగతి అర్హతతో వృత్తివిద్యా కోర్సులు:
రేడియో అండ్ టీవీ(బ్లాక్ అండ్ వైట్, కలర్), (9 నెలలు); రేడియో, టీవీ కలర్ బ్లాక్ అండ్‌ వైట్ (6 నెలలు); కలర్ టీవీ( 3 నెలలు), రిఫ్రిజిరేషన్ (6 నెలలు)... ఈ కోర్సులకు టెన్త్ పాస్, లేదా ఫెయిల్ అయినా అర్హులే. టైప్ రైటింగ్ (6 నెలలు); టెలిఫోన్ ఆపరేటర్ (45 రోజులు); సెల్‌ఫోన్ రిపేరింగ్ (6 నెలలు); షార్ట్‌హ్యాండ్(6 నెలలు); సివిల్ డ్రాఫ్ట్‌మెన్ షిప్ (6 నెలలు); ఆర్కిటెక్చురల్ డ్రాఫ్ట్‌మెన్‌షిప్ (6 నెలలు); స్పోకెన్ ఇంగ్లిష్ (3 నెలలు); జ్యుయెలరీ మేకింగ్ (6 నెలలు); సర్టిఫికేట్ కోర్సు ఇన్ డ్రాఫ్ట్‌మెన్ సివిల్ (ఏడాది) మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

మహిళల కోసం: మహిళలకు ఉపాధి కల్పించే విధంగా కటింగ్ అండ్ టైలరింగ్, బ్యూటీషియన్, జిగ్‌జాగ్, బంజారా అండ్ మిర్రర్ వర్‌‌క, ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ బ్యూటీకేర్ వంటి ఎన్నో కోర్సులు ఉన్నాయి.

జీతాలు భారీగానే:
వివిధ విభాగాల కింద సెట్విన్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 140 కోర్సుల వరకు నిర్వహిస్తోంది. వీటిలో అత్యధిక శాతం ప్రైవేట్ రంగంలో అవకాశాలు కల్పించడంతో పాటు సొంతంగా ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి కూడా వీలుకల్పిస్తాయి. సెట్విన్ కోర్సుల్లో అధిక శాతం మెడికల్, హోటల్ రంగాలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోర్సులు పూర్తిచేస్తే దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నర్సుల నుంచి ఆస్పత్రి నిర్వహణ, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎక్స్‌రే, ఇతర అవయవాల స్కానింగ్ విభాగాల్లో తక్షణం ఉపాధి పొందే అవకాశముంది. ఇప్పుడు దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రుల్లో పది, ఇంటర్ పూర్తి చేసి ఈ కోర్సులు చదివిన వారికి మంచి డిమాండ్ ఉంది. నెలకు రూ.12 వేలకు పైగా ఆదాయం పొందొచ్చు. దీనికితోడు మహిళల కోసం ప్రవేశపెట్టిన బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల ద్వారా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో సొంతంగా వ్యాపారం చేయడంతోపాటు రూ.6వేల నుంచి రూ.9వేల వరకు ఆదాయం సంపాదించవచ్చు. చివరకు ఏడో తరగతి పూర్తిచేసిన వాళ్లు సైతం కార్పెంటర్లు, మేస్త్రీలుగా అవకాశాలు దక్కించుకోవచ్చు. అంతేకాదు.. ఫైర్ సర్వీసులో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులు పూర్తిచేస్తే బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాల కాంప్లెక్సులు, ప్రయివేట్ పారిశ్రామిక సంస్థల్లో అవసరం మేరకు మంచి జీతంతో ఉపాధి లభిస్తుంది.
వెబ్‌సైట్: www.setwinapgov.org

వృత్తి నైపుణ్యాలకు వేదిక ‘ఐటీఐ’
ఏదైనా దేశ ఆర్థిక ప్రగతి వేగం అక్కడి మానవ వనరుల నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటుంది. మంచి వృతి నైపుణ్యాలున్న మానవ వనరులు ఎక్కువగా ఉంటే... ఆ దేశ ప్రగతి వేగవంతమవుతుంది. ఆ సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఎంత ఎక్కువగా వృత్తి నైపుణ్యాలుంటే.. అంత త్వరగా, అంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల శిక్షణతో జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ సొంతమవుతారుు. దాంతో స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం అవుతుంది.

ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఐటీఐ)లు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ (ఐటీసీ)లు.. టెక్నికల్ రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(డీజీఈటీ), మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ పర్యవే క్షణలో పనిచేస్తాయి. దేశవ్యాప్తంగా 9400లకు పైగా ఐటీఐల్లో 3 లక్షలకు పైగా సీట్లు ఉన్నాయి. అదేవిధంగా 2850 ఐటీసీల్లో 3,05,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 500 ఐటీఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల కింద ప్రపంచబ్యాంక్ సహాయంతో అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
అర్హత: పదో తరగతి.

మన రాష్ట్రంలో 733: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొత్తం 96 జనరల్ ఐటీఐలు, 21 మహిళల ఐటీఐలు నడుస్తున్నాయి. అదే విధంగా 608 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. 33 ఇంజినీరింగ్ ట్రేడ్‌లు, 8 నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో శిక్షణ ఇస్తున్నారు. 423 ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్లు(ఐటీసీ)ప్రైవేట్ రంగంలో ఉన్నారుు.

ఐటీఐ- ఇంజినీరింగ్ ట్రేడ్స్(రెండేళ్ల కోర్సు): ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, రేడియో అండ్ టెలివిజన్, డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, రిఫ్రిజరేషన్ అండ్ ఎరుయిర్ కండీషనింగ్, వైర్‌మెన్, మెకానిక్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రోప్లాటర్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, అటెండెంట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, పెయింటర్, డీజిల్ మెకానిక్, ప్లంబర్, వెల్డర్, కార్పెంటర్, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, మాసన్ (బిల్డింగ్ కనస్ట్రక్షన్)

నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్స్: స్టెనోగ్రఫీ, సెక్రటేరియల్ ప్రాక్టీస్, డ్రెస్‌మేకింగ్, కట్టింగ్ అండ్ టైలరింగ్, బుక్ బైండింగ్, హ్యాండ్ కంపోసర్, కార్పెట్ వేవింగ్.

అప్రెంటీస్‌షిప్: ఐటీఐ పాసయ్యాక అభ్యర్థి సంబంధిత జిల్లా అసిస్టెంట్ అప్రెంటీస్‌షిఫ్ అడ్వైజర్ వద్ద తన పేరును నమోదు చేసుకోవాలి. అప్రెంటీస్‌షిప్ అడ్వైజర్ ట్రేడ్‌ల వారీగా, మెరిట్ ఆధారంగా, సీనియారిటీ ఆధారంగా జాబితాను తయారు చేస్తారు. ఆయా సంస్థలు ఈ జాబితా నుంచి విద్యార్థులను ఎంపిక చేసుకుంటాయి. అప్రెంటీస్‌షిప్ సమయంలో స్టైఫండ్ లభిస్తుంది.

ఉపాధి: ఐటీఐ కోర్సులను పూర్తిచేసిన వారికి నేడు ఉపాధికి ఢోకా లేదు. వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్ వంటి కోర్సులతోపాటు తాజాగా విభిన్న నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చే అంశంపై ఐటీఐలు దృష్టిసారించారుు. ఉపాధి అవకాశాలు మెరుగవుతుండటంతో విద్యార్థులు ఐటీఐ కోర్సుల పట్ల మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏటా 20 వేల మందికి, ప్రైవేట్ రంగంలో 80 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ ఐటీఐ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు.

సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్: ఐటీఐలను సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీఓఈ)లుగా తయూరుచేయూలనే ఉద్దేశంతో కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా మొదటి సంవత్సరం సంప్రదాయ ట్రేడ్లలో శిక్షణ ఇస్తారు. అనంతరం ఆరు నెలలపాటు ప్రత్యేక నైపుణ్యాల్లో శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఆరు నెలలు పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారు.

ఒకేషనల్ కోర్సులు
వృత్తి విద్య నేటి పోటీ ప్రపంచంలో నిరుద్యోగ నిర్మూలనకు, స్వయం ఉపాధి కల్పనకు దోహదం చేస్తుంది. పదో తరగతి తర్వాత ఒకేషనల్ కోర్సుల ద్వారా స్వల్ప కాలంలోనే ఉద్యోగావకాశాలు సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఉన్నత విద్యకూ ఒకేషనల్ కోర్సులు అవకాశం కల్పిస్తున్నాయి.

మన రాష్ట్రంలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్.. పదో తరగతి పాసైన విద్యార్థుల కోసం 31 రకాల ఒకేషనల్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.

ప్రవేశం ఎలా: పదో తరగతి ఫలితాలు వెలువడగానే ఒకేషనల్ కోర్సుల్లోకి ప్రవేశాల ప్రక్రియను ఇంటర్మీడియెట్ వృత్తి విద్యా విభాగం చేపడుతుంది. అందుకు సంబంధించి ఏటా నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. స్వల్పకాలిక కోర్సుల్లో ఏడాదంతా ప్రవేశాలు జరుగుతూనే ఉంటాయి.

స్వల్పకాలిక కోర్సులు: ఇంటర్మీడియెట్ విద్యా డెరైక్టర్ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్ర వృత్తి విద్యా సంస్థ 58 స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను నిర్వహిస్తోంది. పదో తరగతి/ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన వారికోసం, డ్రాప్ అవుట్స్ కోసం ఈ కోర్సులను ఉద్దేశించారు. 3 నెలలు, 6 నెలలు, 9 నెలల వ్యవధి గల కోర్సులివి.

రెండేళ్ల కోర్సులు: బిజినెస్-కామర్‌‌స: అకౌంటింగ్-ట్యాక్సేషన్, ఆఫీస్ అసిస్టెంట్‌షిప్, బేసిక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, మార్కెటింగ్ సేల్స్‌మన్‌షిప్, ఎక్స్‌పోర్‌‌ట- ఇంపోర్‌‌ట ప్రాక్టీసెస్-డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్‌‌స, ఆఫీస్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, పర్చేజింగ్ - స్టోర్ కీపింగ్.

హెల్త్-పారామెడికల్:
మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మగ), మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (ఆడ), డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనిస్ట్,. ఆప్తాల్మిక్ టెక్నీషియన్, ఎక్స్‌రే టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, ఫిజియోథెరపీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్.

హోమ్ సైన్‌‌స: కమర్షియల్ గార్మెంట్ డిజైన్ - మేకింగ్, క్రష్ -ప్రీ స్కూల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ గార్మెంట్ మేకింగ్, హెల్త్ కేర్- బ్యూటీకల్చర్, కేటరింగ్- రెస్టారెంట్ మేనేజ్‌మెంట్,. ఇన్‌స్టిట్యూషనల్ హౌస్ కీపింగ్.

ఇంజనీరింగ్ - టెక్నాలజీ: రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్‌‌స, రేడియో, టి.వి.టెక్నీషియన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, వాటర్ సప్లై-శానిటరీ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్-సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ, డి.టి.పి.- ప్రింటింగ్ టెక్నాలజీ.

అగ్రికల్చర్:
డైరీయింగ్, సెరికల్చర్, క్రాప్ ప్రొడక్షన్, ఫిషరీస్, హార్టికల్చర్, సీడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ, సాయిల్ సైన్‌‌స - ప్లాంట్ ప్రొటెక్షన్, వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ - సాయిల్ కన్సర్వేషన్.

హ్యుమానిటీస్:
కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, టూరిజం ట్రావెల్ టెక్నిక్స్, కమర్షియల్ ఆర్‌‌ట.

కోర్సుల తీరు:
ఒకేషనల్ కోర్సులో థియరీకి, ప్రాక్టికల్స్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు. 50 శాతం మార్కులు థియరీకి, 50 శాతం మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి.

బ్రిడ్జి కోర్సుతో లాభాలెన్నో: ఒకేషనల్ విద్యార్థుల ఉన్నత విద్యకు బ్రిడ్జ్ కోర్సు పునాది. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సులు పాసైన వారు.. బీఏ/బీకామ్‌లలో అడ్మిషన్ తీసుకోవచ్చు. బ్రిడ్‌‌జ కోర్సుతో బీఎస్సీలో చేరొచ్చు. బ్రిడ్జ్ కోర్సుతో ఎంసెట్‌కు హాజరై ఇంజనీరింగ్/మెడిసిన్‌లలో కూడా చేరొచ్చు. ఇంజనీరింగ్ ట్రేడ్స్‌లో ఒకేషనల్ కోర్సులు పాసైనవారు బ్రిడ్జ్ కోర్సుతో పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో 10 శాతం కోటా కింద రెగ్యులర్/ కరస్పాండెంట్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. అదేవిధంగా ఎం.పి.హెచ్.డబ్ల్యూ(ఎఫ్) కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్‌లో.. ఎంఎల్‌టీ కోర్సు పాసైన విద్యార్థులు బీఎస్సీ ఎంఎల్‌టీలో చేరొచ్చు. డెంటల్ హైజెనిస్ట్, క్లినికల్
అసిస్టెంట్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వంటి హెల్త్ అండ్ పారా మెడికల్ కోర్సులు పాసైన విద్యార్థులు బ్రిడ్జ్ కోర్సు, ఎంసెట్ ద్వారా మెడికల్ కోర్సుల్లో చేరొచ్చు. అగ్రికల్చర్, హోంసైన్స్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో చేరేందుకు అర్హులు. వృత్తివిద్యా శిక్షణ పొంది ఉత్తీర్ణులైన వారికి మరింతగా నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలుగా అప్రెంటీస్‌షిప్ చేసే అవకాశం కూడా ఉంది. అప్రెంటీస్‌షిప్ పీరియడ్‌లో స్టైఫండ్ కూడా లభిస్తుంది.
వెబ్‌సైట్: www.bieap.gov.in
Published date : 14 Jun 2012 07:32PM

Photo Stories