Skip to main content

ఇంటర్ తర్వాత దారెటు..

విద్యార్థి చదువుల సోపానాల్లో కీలకమైన ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. ఈ దశలో వేసే అడుగు భవిష్యత్తు కెరీర్‌కు పునాది వంటిది. అందుకే ఎంపిక చేసుకునే కోర్సు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ నేపథ్యంలో ఇంటర్ తర్వాత విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశాలపై స్పెషల్ ఫోకస్..

ఇంటర్మీడియెట్ తర్వాత ప్రధానంగా రెండు మార్గాలు తారసపడతాయి. అవి.. 1. ఉద్యోగావకాశాలు. 2. ఉన్నత విద్యావకాశాలు. విద్యార్థులు తమ లక్ష్యం ఏమిటనే దానిపై స్పష్టత ఏర్పరుచుకోవాలి. ఇప్పుడు చేసే తెలివైన ఆలోచన నాలుగు దశాబ్దాల కెరీర్‌కు బాటలు వేస్తుంది. ఇంటర్ పూర్తయ్యేనాటికి ఏది మంచి? ఏది చెడు? అని తెలుసుకునే మానసిక బలం ఉంటుంది కాబట్టి కెరీర్‌పై స్పష్టమైన లక్ష్య నిర్దేశనం చేసుకొని, దానికి అనుగుణంగా ముందడుగు వేయాలి.

ఇంటర్ ఎంపీసీ
పదో తరగతి పూర్తయ్యాక ఎక్కువ మంది విద్యార్థులు ఇంజనీరింగ్ కెరీర్‌ను అందుకునే లక్ష్యంతో ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూపులో చేరుతారు. ఈ ఏడాది ఇంటర్‌ను దిగ్విజయంగా పూర్తిచేసే వారు ఐఐటీ, నిట్‌లు, బిట్స్ పిలానీ క్యాంపస్‌లు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో సీటు సంపాదించేందుకు ప్రయత్నించవచ్చు. ఐఐటీలు, నిట్‌ల్లో చేరాలనుకుంటే.. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి. రాష్ట్రంలో ఎంపీసీ విద్యార్థులు ఎక్కువగా రాసే పరీక్ష ఎంసెట్. రాష్ట్రంలోని టాప్ 10 ఇంజనీరింగ్ కళాశాలలు.. బోధనా విధానం, క్యాంపస్ ప్లేస్‌మెంట్ల విషయాల్లో నిట్, ఐఐటీలతో పోటీపడుతున్నాయి కాబట్టి వాటిలో సీటు సంపాదించేందుకు ప్రయత్నించాలి. ఇంజనీరింగ్‌వైపు వెళ్లని వారు సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరొచ్చు. వీటితో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (బీబీఎం), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్‌ఏ) వంటి కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చు.

ఇంటర్ బైపీసీ
ఇంటర్మీడియెట్ బైపీసీ పూర్తిచేసిన వారు రాష్ట్ర స్థాయిలో ఎంసెట్ రాయొచ్చు. దీంతోపాటు జిప్‌మర్, ఎయిమ్స్, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్, బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యా పీఠం, డీవై పాటిల్, మణిపాల్ యూనివర్సిటీ తదితర ఎంట్రన్స్‌లు రాసి మెడికల్ కోర్సులో చేరొచ్చు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, మెడికల్ సీట్లు మాత్రం పరిమితంగానే ఉన్నాయి. దాంతో ఎంబీబీఎస్ కోర్సులో చేరాలనుకునే వారికి తీవ్ర పోటీ ఎదురవుతోంది. ఇంటర్ బైపీసీ విద్యార్థులకు బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీవీఎస్సీ అండ్ ఏహెచ్, అగ్రికల్చర్, ఫిజియోథెరపీ, ఫార్మసీ, బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ వంటి కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. నర్సింగ్ కోర్సుల్లోనూ చేరొచ్చు. ఇంటర్మీడియెట్ (సెన్సైస్-ఎంపీసీ/బైపీసీ) అర్హతతో డిప్లొమా ఇన్ ఫార్మసీ (డి.ఫార్మసీ) కోర్సులో చేరొచ్చు.

పారామెడికల్ కోర్సులు
ఇంటర్ బైపీసీ తర్వాత తక్కువ కాల వ్యవధిలో ఉద్యోగావకాశాలు అందించే కోర్సులు.. పారా మెడికల్ కోర్సులు. రోగికి డయాగ్నసిస్, ట్రీట్‌మెంట్, థెరపీ సరిగా జరిగేలా డాక్టర్‌కు సహకరించే వారే పారామెడికల్ నిపుణులు. ఆరోగ్య రంగంలో పారామెడికల్ నిపుణుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. దాంతో పారామెడికల్ కోర్సులు పూర్తిచేసిన వారికి ఆరోగ్య రంగంలో అవకాశాలు అపారం. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్,ఈసీజీ టెక్నీషియన్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నీషియన్, అనస్థీసియా టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, డార్క్ రూమ్ టెక్నీషియన్, మెడికల్ ఇమేజింగ్, ఎంపీహెచ్‌పీపీ, థియేటర్ టెక్నీషియన్ వంటి కోర్సులు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి.
  • బైపీసీ విద్యార్థులకు బ్యాచిలర్ డిగ్రీ అంటే వెంటనే గుర్తొచ్చేది సంప్రదాయ బీజెడ్‌సీ. కానీ మారుతున్న పరిస్థితులు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఇప్పుడు విద్యా సంస్థలు వినూత్న కాంబినేషన్లతో కోర్సులను అం దుబాటులో ఉంచుతున్నాయి. ఇటీవల కాలంలో బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్ వంటి విభాగాలు విస్తరిస్తుండటంతో ఆయా సబ్జెక్టులతో కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు ఆసక్తి ఉంటే ఇలాంటి గ్రూప్‌లను ఎంపిక చేసుకోవచ్చు.
ఇంటర్ సీఈసీ
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార రంగం శరవేగంగా విస్తరిస్తుండటంలో కామర్స్ విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. ఇంటర్‌లో సీఈసీ పూర్త్తిచేసిన విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీకాంలో చేరొచ్చు. దాంతో పాటు ప్రతిష్టాత్మక జాబ్ ఓరియెంటెడ్ ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎస్ వంటి కోర్సులను పూర్తిచేయొచ్చు. బీకాం పూర్తయ్యాక రెగ్యులర్‌గా మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(ఎంబీఏ), ఎంకాం (మాస్టర్ ఆఫ్ కామర్స్) తదితర కోర్సుల్లో చేరొచ్చు.

పత్యేక కోర్సులు
సంప్రదాయ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులతోపాటు కొన్ని స్పెషల్ కోర్సులకూ అవకాశాలు పెరుగుతున్నాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫొరెన్సిక్ సైన్స్, ఆప్టోమెట్రీ, డెయిరీ టెక్నాలజీ, న్యూట్రిషన్, హోంసైన్స్, ఓషనోగ్రఫీ, జెమ్మాలజీ, ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ థెరపీ, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, మర్చెంట్ నేవీ, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫిల్మ్ అండ్ మీడియా, సెక్రటేరియల్ వర్క్ తదితర స్పెషల్ కోర్సులనూ ఇంటర్ తర్వాత ఎంచుకోవచ్చు.

సెట్‌ల సోపానాలు
ఇంటర్ తర్వాత వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షల ద్వారా ఉన్నత కెరీర్‌కు సోపానాలు వేసుకోవచ్చు. ఉదాహరణకు చిన్న వయసులోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించి కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం కల్పిస్తోంది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ). ఇంటర్ తర్వాత రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి పాఠశాల విద్యాశాఖ ప్రతి ఏటా డైట్‌సెట్‌ను నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించడం ద్వారా రాష్ర్టవ్యాప్తంగా ఉన్న డీఎడ్ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. అదే విధంగా హాస్పిటాలిటీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి దేశంలోని ప్రముఖమైన సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ). ఇది బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్) కోర్సులో ప్రవేశాలకు ఏటా జారుుంట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) నిర్వహిస్తోంది. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్), లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (లాసెట్), ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీఈసెట్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఎంట్రెన్స్ టెస్ట్ వంటివి ఈ కోవకు చెందుతాయి.

ఇంటిగ్రేటెడ్ కోర్సులు
డిగ్రీ ఒక దగ్గర, పీజీ మరోచోట కాకుండా వరుసగా రెండూ ఒకే చోట పూర్తిచేయాలనుకునే వారి కోసం ప్రవేశపెట్టినవే.. ఇంటిగ్రేటెడ్ కోర్సులు. ఈ కోర్సుల ద్వారా ఇంటర్ తర్వాత ఎలాంటి విరామం లేకుండా పీజీ పూర్తిచేయొచ్చు. ఒకవేళ కోర్సులో చేరిన మూడేళ్ల తర్వాత వద్దనుకుంటే.. డిగ్రీ సర్టిఫికెట్; నాలుగేళ్ల తర్వాత వద్దనుకుంటే హానర్స్ సర్టిఫికెట్ తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఉద్యోగావకాశాలు
ఇంటర్మీడియెట్ అర్హతతో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఆర్‌పీఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, ఐటీబీపీ, భారతీయ రైల్వేల్లో వివిధ ఉద్యోగాలు, ఎస్‌ఎస్‌సీ నిర్వహించే వివిధ ఉద్యోగాలు, యూపీఎస్సీ నిర్వహించే స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్ ఇలా చాలా ఉద్యోగావకాశాలున్నాయి. వీటిలో ఖాళీల భర్తీకి ఎంప్లాయ్‌మెంట్ న్యూస్, రోజ్‌గార్ సమాచార్, ప్రముఖ దినపత్రికల్లో నోటిఫికేషన్‌లు వెలువడుతుంటాయి. రాష్ట్ర స్థాయిలో వీఆర్‌వో, వీఆర్‌ఏ, గ్రూప్-4, ఎక్సైజ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు వంటి ఉద్యోగావకాశాలుంటాయి. సరైన ప్రణాళికతో చదివితే కొలువును సొంతం చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూనే దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించొచ్చు.

అందుబాటులో దూరవిద్య
వివిధ కారణాల వల్ల రెగ్యులర్‌గా చదవలేనివారికి పలు యూనివర్సిటీలు దూరవిద్య విధానంలో రకరకాల కోర్సులు అందిస్తున్నాయి. తక్కువ ఫీజులతో కోర్సులు పూర్తి చేయడంతోపాటు ఉన్నత విద్యకు బాటలు వేసుకోవచ్చు. కోర్సులు పూర్తయ్యాక ఇచ్చే సర్టిఫికెట్లకు రెగ్యులర్ సర్టిఫికెట్లతో సమానంగా గుర్తింపు ఉంటుంది. ఇవి అటు ఉన్నత విద్యకు, ఇటు ఉద్యోగావకాశాలకు ఉపయోగపడతాయి. ఇగ్నో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు దూరవిద్యా విధానంలో కోర్సులందిస్తున్నాయి.

ఈ కోర్సులు ప్రయోజనకరం
పై చదువులు చదవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి వివిధ ప్రభుత్వ సంస్థలందించే కోర్సులు ప్రయోజనకరంగా ఉంటాయి. సెట్విన్, స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్, ఎంఎస్‌ఎంఈ వంటి సంస్థలు స్వయం ఉపాధి లేదంటే ఏదైనా ఉద్యోగాన్ని పొందేందుకు ఉపయోగపడే స్వల్పకాలిక కోర్సులు అందిస్తున్నాయి. ఇలాంటి వాటిలో హోటల్ మేనేజ్‌మెంట్, బ్యూటీషియన్, సెల్‌ఫోన్ రిపేరింగ్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, రేడియో అండ్ టీవీ మెకానిజం, జ్యుయెలరీ మేకింగ్, కార్పెంటరీ, డీటీపీ, వెబ్ డిజైనింగ్, ఎంఎస్ ఆఫీస్, మల్టీమీడియా వంటి కోర్సులు ఉన్నాయి.

ఇంటర్మీడియెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ పూర్తిచేసిన విద్యార్థులు విశ్లేషించుకోవాల్సిన అంశాలు.. తనకు అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటి? తనకు ఇష్టమైన సబ్జెక్టులేమిటి? బలాలు, బలహీనతలు ఏమిటి? కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? వంటి విషయాలను విశ్లేషించుకొని స్పష్టమైన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి.

అన్ని కోణాల్లోనూ విశ్లేషించుకోవాలి
Bavitha
మన బాగోగులను కోరుకునే వారి నుంచి సరైన సలహాలు తీసుకున్న తర్వాత విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సును ఎంపిక చేసుకోవాలి. ఆ కోర్సును జాతీయ, రాష్ట్ర స్థాయిలో అందించే ప్రముఖ సంస్థలు, అర్హతలు, ప్రవేశ విధానం తదితర అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ఇందుకోసం విద్యార్థులు ఇంటర్‌నెట్‌ను ఉపయోగించుకోవాలి. ఆయా సంస్థల వెబ్‌సైట్‌లను సందర్శించడం ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వీలైతే ఆయా సంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులను సంప్రదించాలి. ప్రస్తుతం ఏ కోర్సులకు డిమాండ్ ఉంది? అవి చేస్తే భవిష్యత్ ఎలా ఉంటుంది? తదితరాలను విశ్లేషించుకోవాలి.

లక్ష్యం దిశగా ప్రయాణం
Bavitha
ఇంటర్మీడియెట్ తర్వాత బీటెక్, ఎంబీబీఎస్, ఎల్‌ఎల్‌బీ, హోటల్ మేనేజ్‌మెంట్, సీఏ..
ఇలా ఏ కోర్సులో చేరినప్పటికీ స్పష్టమైన దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి.వాటి సాధన కోసం కోర్సులో అడుగుపెట్టిన రోజు నుంచి నిజాయితీగా కష్టపడాలి. కలల్ని నిజం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాల సముపార్జనకు కృషి చేయాలి. ఆయా రంగాలలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఒంటబట్టించుకోవాలి. సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు వాటి అప్లికేషన్ నైపుణ్యాలను సంపాదించుకుంటే చేసిన కోర్సు ఏదైనా అత్యుత్తమ ఫలితాలు సొంతమవుతాయి.
Published date : 03 Apr 2014 02:44PM

Photo Stories