Union Budget: రైతులకు భారీ బొనాంజ... 20 లక్షల కోట్ల రుణాలు
ఇందులో భాగంగా రైతులకు భారీగా కేటాయింపులు చేపట్టింది కేంద్రం. ఇందులో భాగంగా ప్రతీ ఏడాది ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే భారీగా రుణాలు అందజేసి వ్యవసాయానికి తోడ్పాటునిచ్చేందుకు కృషి చేసింది.
20 లక్షల కోట్లు...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023–24లో వ్యవసాయంలో ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. రైతులకు రూ.20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు. రైతుల కోసం కిసాన్ సమ్మాన్ నిధిని మరింత పెంచుతున్నామన్నారు. కరువు ప్రాంత రైతులకు రూ.5,300 కోట్లు కేటాయించారు.
అనుబంధ వృత్తులకు ప్రోత్సాహకాలు...
వ్యవసాయంతో పాటు డెయిరీ, మత్స్యశాఖలను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం ఈ ఏడాది భారీగా నిధులు కేటాయించారు. అందులో భాగంగా పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే రైతుల ఉత్పత్తుల నిల్వ కోసం గిడ్డంగుల ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.