Skip to main content

Haritha,RDO: గ్రూప్‌–1 ఉద్యోగం కొట్టానిలా..

‘‘అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడడం మంచి పద్ధతి కాదు. కొడుకైనా, కూతురైనా ఒక్కటే. కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది.
RDO Haritha
RDO Haritha Story

వారి అభిరుచిని గుర్తించి సహకరిస్తే విజయాలు సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది’’.

మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, చిన్నతనం నుంచే ఐఏఎస్‌ లక్ష్యంగా ముందుకు సాగుతూ కష్టపడి చదివి గ్రూప్‌–1 అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌గా విజయం సాధించారు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని దామలచెరువుకు చెందిన డీ హరిత. కడపలో ఆర్డీఓగా తొలిసారి ఉద్యోగంలో చేరిన ఆమె అనంతరం జిల్లాకు బదిలీ పై వచ్చారు. డ్వామా పీడీగా, నెల్లూరు ఆర్డీఓగా ప్రజలకు మెరుగైన సేవలందించి పలువురి మన్ననలు పొందుతున్నారు. ఆర్డీఓ హరిత మహిళా సాధికారత సాధన కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఎప్పటికైనా ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్నారు. పట్టుదలతో విధి నిర్వహణలోనూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈ మేరకు సాక్షితో తన మనోగతాన్ని పంచుకున్నారు.

ప్ర: జీవితాశయంలో మీకు ఆదర్శప్రాయులు ఎవరు..?
జ:మా నాన్నే నాకు ఆదర్శం. చిన్నతనం నుంచి ఐఏఎస్‌గా చూడాలనేది ఆయన ఆశయం. అయన ఆశయ సాధన కోసం శ్రమిస్తున్నా. మా నాన్న విశ్రాంత తహసీల్దార్‌ దామలచెరువు చిన్నయ్య, తల్లి నిర్మల న్యాయవాది.

ప్ర: మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది..?
జ: తిరుపతిలోని లిటిల్‌ ఏంజెల్స్‌ హైస్కూల్లో పదో తరగతి వరకు, తిరుపతిలోని క్యాన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేశాను. విద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో ఎంటెక్‌ చదివా.

ప్ర: మీ కుటుంబ నేపథ్యం..?
జ:అన్నయ్య హరికిశోర్‌ టాటా ప్రాజెక్ట్‌లో పనిచేస్తుండగా, తమ్ముడు హరికృష్ణ వ్యాపారంలో స్థిరపడ్డారు. 2012లో పెద్దల సమక్షంలో కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నా. భర్త అనిల్‌కుమార్‌రెడ్డి వ్యాపారంలో రాణిస్తున్నారు. కుమారుడి పేరు ప్రణయ్‌ కార్తికేయ.

ప్ర: అందుకున్న అవార్డులు, సత్కారాలు..?
జ: తొలుత కడప ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన 2013– 14లో ఉత్తమ అధికారి గా అవార్డును అందుకున్నా.

ప్ర: మహిళా సాధికారతపై మీ అభిప్రాయం..?
జ: కుటుంబంలో మహిళలను ప్రోత్సహించిన నాడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది. మహిళలకు ఆయా రంగాల అభిరుచికి తగ్గట్లుగా కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తే మంచి విజయాలను సాధించడంతో పాటు ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అమ్మాయిని ఒక విధంగా, అబ్బాయిని ఒక విధంగా చూడటం మంచి పద్ధతి కాదు. కొడుకైనా.. కూతురైనా ఒక్కటే. మహిళలు ఉద్యోగాలు చేయకూడదనే భావన కొన్ని కుటుంబాల్లో నేటికీ ఉంది. ఇది పోవాలి. మహిళా సాధికారతపై కుటుంబాల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.

ప్ర: కుటుంబంలో ప్రోత్సాహం ఎలా ఉంది..?
జ: భర్త అనిల్‌కుమార్‌రెడ్డి ప్రోత్సాహం ఎంతో బాగుంది. దీనికి తోడు మా అత్తగారింట్లో ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడంతో పాటు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించేందుకు ఎంతగానో ప్రోత్సాహం అందిస్తున్నారు.

లక్షల్లో జీతం..కాద‌ని..
ఆమె చదివింది ఎంటెక్. పైగా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సు. క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో లక్షల్లో జీతం ఆఫర్.. అయినా ఆమె కళ్లముందు కదలాడుతున్న లక్ష్యాన్ని కాదనుకోలేదు.. మరోవైపు కుటుంబంలో బంధువులు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా రాణిస్తుండడంతో.. వారినే స్ఫూర్తిగా తీసుకున్నారామె! ఎలాగైనా అదేబాటలో పయనించాలకున్నారు.. మొక్కవోని ధైర్యంతో ప్రిపరేషన్ మొదలుపెట్టారు.. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సొంతం చేసుకున్నారు. గ్రూప్-1 ఫలితాల్లో ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు.

గ్రూప్-1లో విజయం సాధించి ఆర్డీవోగా ఎంపికయ్యారు. ఏమనిపిస్తోంది?
మొదటి ప్రయత్నంలోనే విజేతగా నిలవడంతోపాటు కోరుకున్న పోస్టింగ్ దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడి ఆరేళ్లపాటు బీటెక్, ఎంటెక్ చేసి.. వేరే కెరీర్ వైపు దృష్టిసారించినప్పుడు కొంతవరకు ఆందోళన కలిగింది. అయినాసరే సక్సెస్ కావడం మంచి అనుభూతి నింపింది.

ఎంటెక్ చేసిన మీరు గ్రూప్-1 ఎందుకు రాయాలనుకున్నారు?
వాస్తవానికి ముందునుంచి నాకు మ్యాథ్స్ సబ్జెక్టు అంటే చాలా ఇష్టం. అందుకే బీటెక్ తీసుకున్నా. బీటెక్ చదివే సమయంలో బయోఇన్ఫర్మేటిక్స్ సబ్జెక్టు నన్ను అమితంగా ఆకట్టుకుంది. దాంతో ఎంటెక్ చేయాలని నిర్ణయించుకున్నా. ఎంత చదివినా జీవితంలో ఏదో వెలితి వేధిస్తుండేది. కుటుంబంలో చాలామంది బంధువులు సివిల్స్, గ్రూప్1ల్లో విజయం సాధించి మంచి స్థానాల్లో ఉన్నారు. గ్రూప్-1 రాసి విజయం సాధిస్తే పేదలకు సాయపడవచ్చని భావించా. అనుకున్నదే తడవుగా ఇంజనీరింగ్‌ను వదిలి.. గ్రూప్-1 రాయాలని నిర్ణయించుకున్నా. ఎంటెక్ పూర్తయ్యాక ప్లేస్‌మెంట్‌లో అయిదంకెల జీతంతో ఆఫర్ వచ్చింది. అయినాసరే ప్రజాసేవ చేయాలన్న ఆలోచన వీటిని వదులుకున్నా.

మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించగలననుకున్నారా?
చాలామంది కంప్యూటర్ రంగం నుంచి వచ్చినవాళ్లు పోటీపరీక్షల్లో విజయం సాధించలేరనే ప్రచారం ఉంది. నేను దీన్ని సీరియస్‌గా తీసుకున్నా. కచ్చితంగా విజయం సాధించగలననే నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టా. మొదటి నుంచీ ఆర్ట్స్ సబ్జెక్టులతో సంబంధంలేకుండా చదవడంతో కొంతవరకు గ్రూప్1 మెయిన్స్‌లో కొంత ఇబ్బంది పడ్డా. అయినా వాటిని అధిగమించగలిగా.

గ్రూప్-1 మెయిన్స్ ఎలా ప్రిపేరయ్యారు? ఎలాంటి వ్యూహాలు అనుసరించారు?
పిలిమ్స్‌ పాసయ్యాక మెయిన్స్ కష్టమని అర్థమైంది. దాంతో ప్రిపరేషన్ ప్లాన్ లేకుండా రాణించడం కష్టమని తెలుసుకుని ప్రణాళికబద్ధంగా ముందుకు కదిలా. రోజుకు 6 నుంచి 8 గంటలు కష్టపడి చదివాను. పైగా నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య చాలా సమయం అందుబాటులో ఉండడంతో ప్రిప‌రేష‌న్‌కు బాగా ఉపయోగపడింది. ఈ సమయంలో ప్రణాళికబద్ధంగా చదివాను. ఎకానమీ, పాలిటీ సబ్జెక్టులు కొంచెం కష్టమనిపించాయి. ఇందుకోసం పాఠ్యపుస్తకాలతోపాటు మంచి మెటీరియల్ ఫాలో అయ్యా. ఆంగ్ల పత్రికలు, సాక్షి భవిత చాలావరకు ఉపయోగపడ్డాయి.

మీ ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఏం ప్రశ్నలు అడిగారు?
ఇంటర్వ్యూ సుమారు 25 నిమిషాలు జరిగింది. రేచల్ చటర్జీ ఇంటర్వ్యూ చేశారు. నేను బిటెక్‌లో బయోటెక్నాలజీ చదవడంతో దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

ముఖ్యంగా...
డిప్యూటీ కలెక్టర్‌లో ఎలాంటి లక్షణాలు అవసరం?
➤ బీటెక్ బయోటెక్నాలజీ చేశారు కదా.. జన్యుమార్పిడి అంటే?
➤ బీటీ కాటన్ గురించి మీకు తెలిసింది చెప్పండి?
➤ సరోగసి గురించి చెప్పండి?
➤ ఆర్డీవో అయితే మద్యపాన నిషేధం కోసం ఎలా ప్రయత్నం చేస్తారు?
➤ జీవ వైవిధ్యం అంటే?
➤ పంచాయతీరాజ్ గురించి వివరించగలరా?
➤ 73, 74వ రాజ్యాంగ సవరణల గురించి మీకేం తెలుసు?
➤ పంచవర్ష ప్రణాళకల గురించి చెప్పగలరా?
➤ బయోఇన్ఫర్మేటిక్స్ అంటే?
➤ ఇండియాలో మహిళ సీఎంల పేర్లు?
➤ ఈ జనరేషన్‌లో మహిళలు ఇంకా అభద్రతాభావానికి గురవుతున్నారు? కారణం?
➤ పరిశోధన రంగంలో మహిళల పాత్ర ?
➤ ఇంజనీరింగ్ కెరీర్ వదిలి ఇటువైపు రావడానికి ప్రేరణ ?

    మా కుటుంబంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు ఉన్నారు. తాత పేరం వెంకటయ్య రిటైర్డ్ ఐపీఎస్. కజిన్ పేరం రాధిక మహరాష్ట్ర క్యాడర్ ఐఎఎస్ అధికారి. బావ వికాస్ చంద్ర రాస్తోబి ఐఎఎస్ అధికారి. మరో కజిన్ లక్ష్మిపతి హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్. పెదనాన్న బాస్కర్ రిటైర్డ్ ఐపీఎస్. పెద్దమ్మ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. వీరంతా నాకు స్ఫూర్తి. వీరిని ఆదర్శంగా తీసుకుని గ్రూప్-1 రాశాను.

ప్రిలిమ్స్, మెయిన్స్‌లో ఏయే పుస్తకాలు చదివారు? 
ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్ విభాగానికి టాటామెక్గ్రాహిల్ పుస్తకాలు, ఆర్సీరెడ్డి వివేక్ పుస్తకాలతోపాటు కోచింగ్ తీసుకున్నా. మెయిన్స్‌లో జనరల్ ఎస్సే పేపర్‌కు ఎమ్మెల్సీ నాగేశ్వర్ వద్ద కోచింగ్ తీసుకున్నా. ఇండియన్ హిస్టరీ పేపర్‌కు కృష్ణారెడ్డి పుస్తకాలు, ఏపీ హిస్టరీకి పి.రఘునాధరావు రాసిన హిస్టరీ ఆఫ్ మోడ్రన్ ఆంధ్రప్రదేశ్ పుస్తకం, ఇండియన్ ఎకానమీలో మునిరత్నం నాయుడు నోట్స్, దత్ అండ్ సుందరం పుస్తకాలు, ఏపీ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషియో ఎకనామిక్ సర్వే, పాలిటీకి కృష్ణప్రదీప్ నోట్స్, టాటామెక్గ్రాహిల్ మెటీరియల్ చదివాను. ఇండియన్ పాలిటీ విభాగంలో ఇండియన్ పాలిటీ బై లక్ష్మికాంత్ పుస్తకాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇంటర్నెట్, బయోటెక్నాలజీకి వై.సూర్యనారాయణ, ఎన్విరాన్మెంటల్కు అంజిరెడ్డి పుస్తకాలు చదివాను. పేపర్ 5కు ఆర్.ఎస్. అగర్వాల్ డాటా ఇంటర్ప్రిటేషన్ పుస్తకాలు చదివాను. కరెంట్ అఫైర్స్ విభాగంలో సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా.

మీ జీవిత లక్ష్యం?
మా కుటుంబంలో చాలామంది ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నారు. వారిని చూసి నేను కూడా ఈ రంగంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనుకున్నా. అందుకు సివిల్సర్వెంట్ కావాలన్నదే నా లక్ష్యం.
 
గ్రూప్1కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మీ సలహా?
ప్రిపరేషన్ విషయంలో పక్కవాళ్లతో పోల్చుకోకూడదు. గ్రూప్1కు విపరీతమైన మెటీరియల్ దొరుకుతోంది. ఇదంతా చదివితే విజేతలుగా నిలవలేం.మెటీరియల్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రూప్1 సిలబస్ను ముందు అవగాహన చేసుకోవాలి. దానికి అనుగుణంగానే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. ప్రణాళికలేకుండా గ్రూప్1లో విజయం సాధించడం కష్టం. అదేవిధంగా మెయిన్స్ చాలాకీలకం. పరీక్షకుముందు ప్రాక్టీస్చేస్తే మంచి స్కోరింగ్కు వీలవుతుంది. సొంతంగా ప్రిపరేషన్ చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

Published date : 15 Dec 2021 05:52PM

Photo Stories