Skip to main content

Free Admissions in Private Schools: కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో ఈ విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్‌ విద్య

అనంతపురం ఎడ్యుకేషన్‌: కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Free Education in Private Schools

విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తుండడంతో వేల రూపాయల డొనేషన్లు, ఫీజులు లేకుండా పేద విద్యార్థులు కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్ల్లో చదువుకునే అవకాశం కల్పిస్తోంది. విద్యాహక్కు చట్టాన్ని ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తుండడంతో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ముందుకు వచ్చాయి. ఇప్పటికే అనంతపురం జిల్లాలో 473, శ్రీసత్యసాయి జిల్లాలో 294 పాఠశాలల యాజమాన్యాలు అంగీకారం తెలుపుతూ విద్యాశాఖ వద్ద రిజిస్ట్రేషన్‌ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.

చదవండి: Dress Code For School Teachers: స్కూల్‌ టీచర్లకు డ్రెస్‌ కోడ్‌.. జీన్స్‌, టీషర్టులు ధరించడానికి వీల్లేదు

దరఖాస్తులకు ఆహ్వానం

విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. 2024–25 విద్యాసంవత్సరానికి గాను ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైంది. విద్యాహక్కు చట్టం మేరకు ప్రభుత్వ గుర్తింపు ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలకు కేటాయిస్తే ఆ ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఈ క్రమంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జగన్‌ సర్కార్‌ సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంది.

ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు నిరాకరించిన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతేడాది (2023–24) ఉమ్మడి జిల్లాలో 804 మంది విద్యార్థులు 1వ తరగతిలో ప్రవేశాలు పొందారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్‌ విడులైనప్పటి నుంచి ఇప్పటి వరకూ అనంతపురం జిల్లాలో 835 మంది, సత్యసాయి జిల్లాలో 238 మంది దరఖాస్తు చేసుకున్నారు.

చదవండి: Free Admissions: పేద విద్యార్థులకు ఉచిత విద్యనందిస్తున్న విద్యా చట్టం..

సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌

అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను http://cse. ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా అందజేయాలి. ఇందుకు మార్చి 25 వరకూ విద్యాశాఖ గడువు విధించింది. అడ్మిషన్లపై క్షేత్రస్థాయిలో ఎంఈఓల ద్వారా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.

అందిన దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో పరిశీలించి లాటరీ విధానంలో విద్యార్థులను ఎంపిక చేసి, ఆయా స్కూళ్లకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. దీనిపై సందేహాల నివృత్తికి ప్రభుత్వం ప్రత్యేకంగా 1800–4258599 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది.

25 శాతం సీట్లు ఎవరికి?

అనాథ, దివ్యాంగ, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు 6 శాతం వెరసి మొత్తం 25 శాతం సీట్లను విద్యాహక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో కేటాయించాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 1.44 లక్షలు మించి ఉండరాదు.

విద్యార్థులు నివాసం ఉండే (ఆధార్‌కార్డు ఆధారం) ప్రాంతానికి కిలోమీటరు పరిధిలో ఉన్న పాఠశాలలకు తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మూడు కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలకు కేటాయిస్తారు. పూర్తి వివరాలకు సంబంధిత ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించాలి.

Published date : 16 Mar 2024 03:18PM

Photo Stories