High Court: విద్యాశాఖ కమిషనర్ ప్రొసీడింగ్స్ అమలు నిలుపుదల
![High Court](/sites/default/files/images/2022/09/02/aphighcourt10-1662113537.jpg)
ఈ ప్రొసీడింగ్స్ ఉచిత, నిర్బంధ విద్య హక్కు చట్ట నిబంధనలకు, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు 20 కన్నా తక్కువ, అసలు ప్రవేశాలే లేని పాఠశాలల గుర్తింపును ఎందుకు ఉపసంహరించరాదో వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విద్యాశాఖ కమిషనర్ 2021 నవంబర్ 24న ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి కె.తులసీ విష్ణుప్రసాద్, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపిస్తూ.. ఉచిత విద్యా హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన నిబంధనలు ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలకు వర్తించవన్నారు. ప్రభుత్వం నుంచి తాము ఎలాంటి సాయం పొందడం లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు 2012లో తన తీర్పు ద్వారా స్పష్టం చేసిందని వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి విద్యాశాఖ కమిషనర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేశారు.
![Sakshi Education Mobile App](/sites/default/files/inline-images/CAs_0.jpg)