AP Half Day Schools 2024 : ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి అంటే..? అలాగే స్కూల్ టైమింగ్స్ ఇవే.. కానీ..!
ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కావాల్సింది ఉంది. ఈ ఏడాది మూడు రోజులు ఆలస్యంగా పెట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్కూల్స్ టైమింగ్స్ ఇవే..
ఇకపై ఆంధ్రప్రదేశ్లోని స్కూల్స్కు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా ఆరు బయట, చెట్ల కింద తరగతులు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్కూల్ పిల్లలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులు స్కూల్స్ ఆదేశాలు జారీ చేశారు.
10వ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి ఈ అంశంపై అధికారిక ప్రకటన లేదు. అయితే.. ఆంధ్రప్రదేశ్లో మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హాల్టికెట్లను కూడా విడుదల చేసిన విద్యాశాఖ. రాష్ట్రవ్యాప్తంగా 3,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మార్చి 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సెలవులు ఉంటాయని విద్యాశాఖ పేర్కొన్నట్లు ఆ వార్తల సారాంశం. ఈ తేదీల్లో సెలవులు ఇచ్చినందుకుగాను ఈనెల 24, 31 తేదీల్లో అలాగే.. ఏప్రిల్ 7, 13,14, 21 తేదీల్లో క్లాసులు నిర్వహించాలని స్కూల్ యాజామాన్యాలను ఆదేశించినట్లు కూడా పేర్కొన్నారు. అయితే.. ప్రస్తుతానికి ఈ అంశంపై విద్యాశాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి విద్యార్థులు ఆయా స్కూల్ యాజమాన్యం నిబంధనల ప్రకారం నడుచుకోవడం మంచిది.
తెలంగాణలో రేపటి నుంచే ఒంటిపూట బడులు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తం ఎండలు మండుతున్నాయి. ఈ ఎండ తీవ్రతతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మార్చి 15వ తేదీ నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ఏపీలో కంటే మూడు రోజులు ముందుగానే తెలంగాణలో ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది.
తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.