Civils Prelims 2024 Results : సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అర్హత సాధించిన వారు మెయిన్స్కు ఎంపిక.. తేదీ!
దేశ వ్యాప్తంగా ఈ నెల 16న ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది! దాదాపు 11 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 51 శాతం మేరకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 42,560 మంది పరీక్ష రాసినట్లు సమాచారం. సోమవారం ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. సివిల్స్ ప్రిలిమ్స్–2024 విశ్లేషణ, మెయిన్ పరీక్ష విధానం,మెయిన్లో రాణించేందుకు ప్రిపరేషన్ తదితర వివరాలు..
Sailor Posts at Indian Navy : సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే!
- 1,056: సివిల్స్–2024 నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల సంఖ్య.
- ఆరు లక్షలు: ప్రిలిమ్స్కు హాజరైన అభ్యర్థుల సంఖ్య అంచనా.
- 12 వేల నుంచి 13 వేలు: మెయిన్కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య.
- ప్రిలిమ్స్లో ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:13 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి మెయిన్స్కు ఎంపిక చేస్తారు.
ప్రిలిమ్స్ సులభంగానే
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 16న నిర్వహించారు. ఒక్కో పేపరు 200 మార్కుల చొప్పున రెండు పేపర్లు 400 మార్కులకు పరీక్ష జరిగింది. సివిల్స్ ప్రిలిమ్స్–2024 పరీక్ష గతంతో పోలిస్తే కొంత సులభంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది.
అన్ని సబ్జెక్ట్లకు సమ ప్రాధాన్యం ఇస్తూ ప్రశ్నల రూపకల్పనలో సమతుల్యత పాటించారని పేర్కొంటున్నారు. సబ్జెక్ట్ల వారీగా చూస్తే.. జాగ్రఫీ నుంచి 16–18 ప్రశ్నలు, పర్యావరణం 12–14 ప్రశ్నలు, ఎస్ అండ్ టీ 10–12 ప్రశ్నలు, హిస్టరీ 14–16 ప్రశ్నలు, ఎకనామిక్స్ 15–20 ప్రశ్నలు, పాలిటీ 14–16 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి 6–8 చొప్పున ప్రశ్నలు అడిగారు. పాలిటీలో ఈసారి ప్రశ్నలు నేరుగా అడగడం అభ్యర్థులకు ఉపశమనం కలిగించే విషయం. జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో అధిక శాతం ప్రశ్నలు కరెంట్ అఫైర్స్ అనుసంధానంగా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ నుంచి డైరెక్ట్ కొశ్చన్స్ అడిగారు.
రెండో పేపర్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో రీడింగ్ కాంప్రహెన్షన్ 22–24 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 23–25 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ 35–40 ప్రశ్నలు అడిగారు. ఈసారి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు సైతం సమాధానాలను గుర్తించగలిగేలా ప్రశ్నలు ఉన్నాయి.
Indian Navy : ఇండియన్ నేవీలో ఎంఆర్ మ్యుజీషియన్ పోస్టులకు దరఖాస్తులు..
కాన్సెప్ట్స్, అప్లికేషన్ అప్రోచ్
ఆయా సబ్జెక్ట్ల కాన్సెప్ట్లపై క్లారిటీతోపాటు అప్లికేషన్ అప్రోచ్ను పరీక్షించేలా ప్రిలిమ్స్లో ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ప్రామాణిక పుస్తకాల అధ్యయనం, సమకాలీన పరిణామాలపై పట్టు, అన్వయం దృక్పథం కలిగిన అభ్యర్థులు సరైన సమాధానాలు గుర్తించడంలో ముందంజలో ఉంటారని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలను క్షుణ్నంగా అధ్యయనం చేసిన అభ్యర్థులు స్కోర్ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు.
మెయిన్లో రాణించేందుకు
ప్రిలిమ్స్లో ఎంపికైన అభ్యర్థులు.. తక్షణమే రెండో దశ మెయిన్ ఎగ్జామినేషన్పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మెయిన్ ఎగ్జామ్ను సెప్టెంబర్ 20 నుంచి అయిదు రోజుల పాటు నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్ష మొత్తం ఏడు పేపర్లలో 1750 మార్కులకు జరుగుతుంది. ఒక్కో పేపర్కు 250 మార్కులు.
వీటికి అదనంగా అర్హత పేపర్లుగా ఇంగ్లిష్, రీజనల్ లాంగ్వేజ్ పేపర్లు ఉంటాయి. మెయిన్లో ప్రతిభ ఆధారంగా అంతిమంగా 275 మార్కులకు పర్సనాలిటీ టెస్ట్/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
Degree admissions 2024 : నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
పేపర్ 1 (జనరల్ ఎస్సే)
తొలుత జనరల్ ఎస్సే విభాగంలో అడిగేందుకు అవకాశమున్న అంశాలను గుర్తించాలి. సమకాలీన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అంతర్జాతీయ పరిణామాలు,కరోనా విపత్తు ప్రభావాలు,వ్యాక్సినేషన్ విధానాలు, పర్యావరణ అంశాలు,జాతీయ స్థాయిలో ఇటీవల చర్చనీయాంశంగా మారిన అంశాలను అభ్యసించాలి. వీటికి విశ్లేషణాత్మక సమాధానాలు రాసే విధంగా ప్రాక్టీస్ చేయడం ఎంతో ముఖ్యం.
పేపర్–2 (జీఎస్–1)
హిస్టరీకి సంబంధించి సంగీతం, సాహిత్యం, నాట్యం, వాస్తు–శిల్పకళ, మత ఉద్యమాలు, తత్వాలు తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఈ అంశాలను ప్రాచీన, మధ్య, ఆధునిక భారత దేశ చరిత్రలకు అనుసంధానిస్తూ చదవాలి. 18వ శతాబ్దం మధ్య కాలం నుంచి ఇప్పటి వరకు చోటుచేసుకున్న ప్రధాన సంఘటనల్ని పరిశీలించాలి. స్వాతంత్య్రోద్యమం గురించి ప్రత్యేకంగా చదవాలి. అదే విధంగా రాజ్యాంగం, పంచవర్ష ప్రణాళికలు, భూ సంస్కరణలు, నెహ్రూ విదేశాంగ విధానం, అలీనోద్యమం, హరిత విప్లవం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ప్రపంచ చరిత్రకు సంబంధించి పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, ఐరోపాలో నూతన రాజ్యాల ఆవిర్భావం, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లో వలసవాదం వంటి వాటిని ప్రధానంగా చదవాలి. జాగ్రఫీకి సంబంధించి భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు, తుపానులు తదితరాల గురించి శాస్త్రీయ అవగాహన పెంపొందించుకోవాలి. ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే సహజ వనరుల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
AP Open school Results 2024:ఎస్ఎస్సీ, ఇంటర్ ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
పేపర్–3(జీఎస్–2)
ముందుగా సిలబస్ను క్షుణ్నంగా పరిశీలించాలి. ఈ పేపర్ సిలబస్ ప్రజా పరిపాలన, రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ సంబంధాల సమ్మేళనంగా ఉంది. భారత రాజ్యాంగం గురించి చదివే క్రమంలో.. 1858 భారత ప్రభుత్వ చట్టం దగ్గరి నుంచి 1947 స్వాతంత్య్ర చట్టం వరకు చదవాలి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలపై దృష్టి సారించాలి. రాజ్యాంగం మూల నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు కేశవానంద భారతి కేసు–1973, మినర్వా మిల్స్ కేసులను పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాల విభజన, భారత రాజకీయ వ్యవస్థలోని అర్ధ సమాఖ్య స్వభావంపై దృష్టిపెట్టాలి. 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రభావాన్ని పరిశీలించాలి. ప్రభుత్వ పథకాల పనితీరు, ఉద్దేశం, లక్ష్యం, ఫలితాలను అధ్యయనం చేయాలి.
పేపర్ 4 (జీఎస్–3)
ఈ పేపర్లో టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి, బయో డైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లను అధ్యయనం చేయాలి. ప్రణాళికా పెట్టుబడుల్లో భాగంగా ప్రభుత్వ రంగ వనరుల సమీకరణకు ఆధారాలు, వాటి ధోరణులు, వివిధ రంగాల మధ్య వనరుల పంపిణీ తదితర అంశాలను క్షణ్నంగా చదవాలి. భారత్లో సమ్మిళిత వృద్ధి పాత్ర, ఆహార భద్రత, బడ్జెటింగ్ తీరుతెన్నులతో పాటు స్వాతంత్య్రం తర్వాత వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులను చదవాలి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధితో పాటు దైనందిన జీవితంలో దాని అనువర్తనాలపై దృష్టిపెట్టాలి.
AP TET 2024 Notification Released : ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
పేపర్ 5 (జీఎస్–4)
ఈ పేపర్లో సిలబస్లోని ఎక్కువ అంశాలు ప్రభుత్వ పాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)కు సంబంధించినవి. కాగా మరికొన్ని ఫిలాసఫీ, సైకాలజీకి చెందినవి. అభ్యర్థులు పరిపాలనలో నైతిక విలువల ఆవశ్యకతకు సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి. వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో విలువలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో తెలుసుకోవాలి. నైతిక శాస్త్రంలో ప్రధానంగా అప్లయిడ్ ఎథిక్స్ (అనువర్తిత నైతిక శాస్త్రం)పై దృష్టి పెట్టాలి. ప్రధానంగా అభ్యర్థులు ‘పబ్లిక్ సర్వీస్ ఎథిక్స్’కు సంబంధించిన అంశాలను చదవాలి. ప్రభుత్వ విధానాల అమలు, నిధుల ఖర్చు, విధుల నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకతలో నైతికత ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలి. మతం–నైతికత,వర్ణ వ్యవస్థ–నైతికత, కుటుంబం–నైతికత..ఇలా వివిధ సామాజిక అంశాలను,సమకాలీన అంశాలతో అనుసంధానిస్తూ చదవాలి. నైతిక విలువలు పెంపొందించడంలో కుటుంబం, సమాజం, విద్యా సంస్థల పాత్ర ఏమిటో తెలుసుకోవాలి. లక్ష్య సాధనలో, విధి నిర్వహణలో ఎంతో కీలకంగా నిలిచే వైఖరి గురించి ప్రత్యేక శ్రద్ధతో అధ్యయనం చేయాలి.
పేపర్ 6, 7.. ఆప్షనల్ సబ్జెక్ట్కు ఇలా
మెయిన్స్లో అభ్యర్థులు ఒక ఆఫ్షనల్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, ఫిలాసఫీ, సైకాలజీ తదితర ఆప్షనల్స్ జనరల్ స్టడీస్కు కలిసొచ్చే విధంగా ఉన్నాయి. ఆప్షనల్ ఏదైనా సరే.. సిలబస్ను ఆమూలాగ్రం అధ్యయనం చేయాలి. ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉన్న అంశాలను గుర్తించి.. వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేయాలి. గత కొన్నేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించి, ప్రాక్టీస్ చేయడం ఉపయుక్తంగా ఉంటుంది.
900 మార్కులు లక్ష్యంగా
మెయిన్స్లో మొత్తం 1,750 మార్కులకు గాను 900 మార్కులు సాధించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం నిరంతరం ప్రాక్టీస్ టెస్ట్లకు హాజరవుతూ వాటిలో కనీసం వేయి మార్కులు సాధించేలా యత్నించాలని పేర్కొంటున్నారు. ఫలితంగా పరీక్ష సమయంలో కొద్దిపాటి పొరపాట్లు జరిగినా.. 900 మార్కులను సాధించే సామర్థ్యం లభిస్తుందని సూచిస్తున్నారు.