Jr. Lecturers Recruitment: పరీక్షకు నిరాకరణ... జేఎల్‌ అభ్యర్థుల ఆందోళన!

క్యాంపస్‌ లోపలికి వచ్చిన తర్వాత కూడా పరీక్షకు అనుమతించకపోవడంపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

తిమ్మాపూర్‌: మండలంలోని వాగేశ్వరి ఇంజినీరింగ్‌ కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌ పరీక్షల్లో అభ్యర్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఉదయం 10గంటలకు జరగాల్సిన పరీక్షకు అభ్యర్థులు 9:30లోపే హాజరు కావాలి. అభ్యర్థులు నిర్ణీత సమయంలో ప్రధానగేటు లోపలికి వచ్చారు.

క్యాంపస్‌లో ఐయాన్‌ డిజిటల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండు సెంటర్లలో ఎప్పటికీ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు ఏ సెంటర్‌లో పరీక్ష ఉందో తెలియక రెండు నిమిషాలు లేటుగా సెంటర్లోకి చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పరీక్షకు అధికారులు అనుమతించలేదు. క్యాంపస్‌ లోపలికి వచ్చిన తర్వాత కూడా పరీక్షకు అనుమతించకపోవడంపై అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

ప్రతి పరీక్షకు ప్రధాన గేటు లోపలికి వచ్చాక అనుమతి ఇస్తారని ఇప్పుడెందుకు ఇవ్వడం లేదని ఆందోళనకు దిగారు. తొమ్మిది నెలల నుంచి కుటుంబానికి దూరంగా ఉండి ప్రిపేర్‌ అయ్యానని, నిమిషం నిబంధనతో తనను అనుమతించలేదని పెద్దపల్లి చెందిన ఓ మహిళ అభ్యర్థి కంటతడి పెట్టింది. అనంతరం అభ్యర్థులు చేసేదేం లేక తిరుగు పయనమయ్యారు.

#Tags