APPSC Group 1 Ranker Inspirational Story : ప్రాణాపాయం నుంచి భయటపడ్డానిలా.. ఎన్నో వివక్షతలు ఎదుర్కొంటూనే గ్రూప్-1 ఉద్యోగం కొట్టానిలా.. కానీ..
కుటుంబ నేపథ్యం :
నా పేరు కవిరాజ్. మాది అనంతపురం జిల్లా బెళుగుప్ప గ్రామం. మా తల్లిదండ్రులకు నేను, చెల్లి ఇద్దరు సంతానం. గ్రామంలో మట్టి ఇంటిలో నివసిస్తూ.., చిన్న కారంపొడి, పిండి మిషన్లను నిర్వహస్తూ.. మేము జీవనోపాధి పొందేవారు.
ప్రాణాపాయం నుంచి..
జన్మతః ఆరోగ్యవంతుడైన నేను, తీవ్ర జ్వరం కారణంగా శారీరక బలహీనత ప్రారంభమై.. దివ్యాంగుడిగా మారాను. నా ఆరోగ్యం బాగుపరచాలనే తపనతో అమ్మానాన్నలు ఎన్నో అప్పులు చేసి.., బెంగళూరులోని సెయింట్ జాన్స్ హాస్పిటల్ లో చికిత్స చేయించి, ప్రాణాపాయం నుంచి కాపాడగలిగారు.
ఎడ్యుకేషన్ :
తీవ్రమైన నా ఆర్ధిక, అనారోగ్య సమస్యలను గమనించి.., గ్రామంలోని శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ కరెస్పాండెంట్ శ్రీనివాసులు గారు ఉచిత ప్రాథమిక విద్యనందించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివి, పదిలో 2007-08 లో మండల టాపర్గా నిలిచాను.
సర్జరీల ద్వారా..
ఆర్థిక సమస్యలు, అనారోగ్య ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు ఉన్నత విద్య ఎలా సాగించాలి అన్న క్లిష్ట పరిస్థితుల్లో.. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు అనే స్వచ్ఛంద సేవా సంస్థ పన్నెండు లక్షల రూపాయల వైద్య సాయం అందింది. సర్జరీల ద్వారా నిలిచిపోయిన నడక తిరిగి ప్రారంభమైంది. తర్వాత అనంతపురం నలంద కాలేజీలో ఇంటర్, కళాశా జ్ఞాన భారతి కాలెజీలో టీటీసీ ఫీజులు కట్టి పూర్తి చేయించింది. కుటుంబం ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి జీవనోపాధి మార్గం కూడా చూపించిన ఆర్డిటి సంస్థకు నా మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు.
ఎన్నో వివక్షతలు ఎదుర్కొంటూనే.. గ్రూప్స్కు..
ఈ క్రమంలో ఎన్నో వివక్షతలు ఎదుర్కొంటూనే.., డీఎస్సీ-2012లో ఓపెస్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. దీంతో కణేకళ మండలం, హనకనహాళ్ గ్రామంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాను. ఈ క్రమంలోనే ఎస్కే యూనివర్సిటీ దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్స్కు సన్నద్ధం అయ్యాను.
శ్రీరామచంద్ర మెంటార్ షిప్ ప్రోగ్రాం ద్వారా..
సబ్జెక్ట్ పరిజ్ఞానం ఉన్నప్పటికి గ్రూప్స్లో పరాజయం చెందాను. తర్వాత మిత్రులు అనిత, నరేష్ సూచనల మేరకు.. 2022లో డీఎస్పీగా ఎంపికైన శ్రీరామచంద్ర గారిని సంప్రదించాను. తన శ్రీరామచంద్ర మెంటార్ షిప్ ప్రోగ్రాం ద్వారా, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం సార్ సొంతంగా చేతిరాతలో రాసిన మెటీరియల్ సమకాలీన అంశాలు, సమర్థమైన విషయ నిర్మాణం, చక్కటి విశ్లేషణ, మంచి ప్రెజంటేషన్ కలిగి ఉంటుంది. దీనిని నాకు ఉచితంగా అందించారు. అలాగే ఇంటర్ప్యూ గైడెన్స్ను నిర్వహించారు. ఇదే నా గ్రూప్-1లో ఎంపీడీఓగా విజయం సాధించడానికి కీలకంగా తోడ్పడింది. ఇందుకు శ్రీరామచంద్ర సార్కు చాలా కృతజ్ఞతలు.
నా లక్ష్యం ఇదే..
కడప యోగివేమన యూనివర్సిటీలో గంగయ్య సార్ ఆధ్వర్యంలో హిస్టరీలో పీహెచ్డీ చేస్తున్నాను. ఇంకా కష్టపడి చదివి.. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించి.., నేను అందించే సేవల పరిధిని మరింత విస్తృత పరచుకోవాలని కొరుకుంటునాను.
గ్రూప్-1లో కీలకం ఇవే..
గ్రూప్-1 సాధనకి సిలబస్పై మంచి అవగాహన, నిత్యం రైటింగ్ సాధన, విశ్లేషణ ఎంతో కీలకం. ఒత్తిడులను అధిగమిస్తూ ప్రణాళికతో చదువుతూ.. ముందుకెళితే విజయం చేరువయ్యే మార్గం కనిపిస్తుంది. నాకు అన్ని వేళలా తోడుగా నిలిచి నా తల్లిదండ్రులకు, గ్రామస్థులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.