Skip to main content

Student Success Story : ఓ మారుమూల గ్రామ గిరిజన యువకుడు.. ఏకంగా రూ.కోటి జీతంతో ఉద్యోగం కొట్టాడిలా.. కానీ...

ప్ర‌తిభ ఎవ‌రి సోత్తుకాదు.. అది స‌రైన టైమ్‌లో స‌రిగ్గా ఉప‌యోగించుకుంటే.. సామాన్యుడు.. అసామాన్యుడు కాగ‌ల‌డు. ఇక ఆ కుర్రాడు కూడా తల్లిదండ్రుల కష్టాలు చూస్తూ పెరిగాడు. చదువుతోనే తమ కష్టాలు తీరతాయని.. తల్లిదండ్రులకు గౌరవం అని అర్థం చేసుకుని.. కష్టపడి చదివాడు.
తిరుపతి అమ్మ రాంచందర్‌, శకుంతల   tribal Student tirupati got 1 core salary package

తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న ఆశలను నిజం చేశాడు. మామూలు గిరిజన కుటుంబంలో పుట్టి కష్టాలను దాటుకుని.. చదువులో మంచి ప్రతిభ చూపుతూ.. చివరకు ఏకంగా అమెరికాలో ఏడాదికి కోటి రూపాయల వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఈ యువ‌కుడి పేరు తిరుపతి. కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు గర్వపడుతున్నారు. ఈ నేప‌థ్యం ఎందరికో ఆదర్శంగా నిలిచిన తిరుపతి స‌క్సెస్ స్టోరీ మీకోసం..

త‌ల్లిదండ్రులు బిడ్డల కోసం భారీగా ఆస్తులు కూడబెట్టాల్సిన పని లేదు. వారికి విలువలతో కూడిన సంస్కారం.. మంచి విద్యనందిస్తే చాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తల్లిదండ్రులు కూడా అదే పాటించారు. తాము చదువుకోలేదు. అందువల్ల జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నారు. తాము పడ్డ బాధలు.. తమ బిడ్డలు పడకూడదని భావించారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. పేదరికం అడ్డు వచ్చినా సరే.. బిడ్డలకు మాత్రం మంచి చదువును అందించాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల చదువు మాత్రం ఆపలేదు.

కుటుంబ నేప‌థ్యం :
ఆదిలాబాద్‌కు చెందిన గిరిజన యువకుడు తిరుపతి. అమెరికాలో కోటి వేతనంతో ఉద్యోగం సాధించి.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు. తెలంగాణ‌లోని ఆదిలాబాద్‌ జిల్లా.. నెన్నెల మండలం గుడిపేట గ్రామానికి చెందిన మాలోతు రాంచందర్‌, శకుంతల దంపతులకు తిరుపతి, దిలిప్‌ అని ఇద్దరు కొడుకులు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు నిరక్షరాస్యులు. కానీ బిడ్డలను మాత్రం బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. ఎన్ని కష్టాలు.., అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయలేదు. 

వీరి గ్రామంలో కనీస మౌలిక సౌకర్యాలు కూడా..
తిరుపతి తల్లిదండ్రులు ఊళ్లోనే వారికున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ.. బిడ్డల్దిదరిని ఉన్నత చదువులు చదివించారు. ఈ గిరిజన గ్రామంలో కేవలం 40 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కనీస మౌలిక సౌకర్యాలు సైతం ఉండవు. అలాంటి గ్రామం నుంచి వచ్చిన తిరుపతి.. ఏకంగా అమెరికాలో కోటి రూపాయల వేతనంతో ఉద్యోగం సాధించడం విశేషం.

ఎడ్యుకేష‌న్ : 
తిరుపతి కూడా తల్లిదండ్రులు కష్టాన్ని గమనించి.. చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. పదో తరగతిలో మంచి మార్కులతో పాస్‌ అయ్యాడు. ఈ క్రమంలో విజయ‌వాడలో పాఠశాల విద్య, వరంగల్‌లో ఇంటర్‌, ముంబైలో ఐఐటీ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌, సౌదీ అరేబియాలో ఎంటెక్‌ పూర్తి చేశాడు. ఆ తర్వాత అమెరికాలోని జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్శిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసి.. మే 21వ తేదీన‌ పట్టా అందుకున్నాడు. 

ఏడాదికి కోటి రూపాయల వేతనంతో..
ఆ మరుసటి రోజే అంటే.. మే 22వ తేదీన‌.. థర్డ్‌ వేవ్స్‌ సిస్టమ్‌లో రీసెర్చ్‌ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. ఏడాదికి కోటి రూపాయల వేతనంతో ఈ ఆఫర్‌ అందుకున్నాడు. గిరిజన బిడ్డ టాలెంట్‌ను ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. సమాజంలో ఎందరికో అతడు ఆదర్శం అంటున్నారు. ఇక తిరుపతి సోదరుడు దిలీప్‌ కూడా ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడు.

Published date : 25 May 2024 06:20PM

Photo Stories