DSC 2024: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం.. గ్రూప్‌ పరీక్షలు ఇలా నిర్వహిస్తాం..

నల్లగొండ: ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వంలో జరిగినట్లు పేపర్ల లీకేజీలకు తావులేకుండా యూపీఎస్‌సీ తరహాలో గ్రూప్‌ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండలో జ‌నవ‌రి 17న‌ ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మాదిరిగా ఎమ్మెల్యేల చుట్టూ తిరిగినట్లు ఇప్పుడు తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులతో పాటు తులం బంగారం ఇచ్చే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

చదవండి: స్కూల్‌ అసిస్టెంట్‌ సాధించాలంటే.. సబ్జెక్ట్‌ల ప్రిపరేషన్‌ సాగించండిలా..

‘కారు సర్వీసింగ్‌ కోసం షెడ్డుకు పోయిందని కేటీఆర్‌ అంటున్నారు. కానీ ఆ కారు స్క్రాప్‌కు పోయింది. ప్రజలే పాత ఇనుప సామాను మాదిరిగా అమ్మేశారు’అని మంత్రి అన్నారు. కారు బయటకు వచ్చే పరిస్థితి లేదని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో 14 సీట్లు గెలవబోతోందని పేర్కొన్నారు.

రెండు మూడు సీట్లలో బీజేపీతో పోటీ ఉంటుందని, ఇక బీఆర్‌ఎస్‌ తమకు పోటీయే కాదన్నారు. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అవినీతిలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఒకరు జైలుకు పోకతప్పదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన అన్నారు. 

#Tags