New Election Commissioners: ఎలక్షన్ కమిషనర్లుగా జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సంధూ
వీరి నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను మార్చి 14వ తేదీ కేంద్ర న్యాయ శాఖ విడుదలచేసింది. అంతకుముందు 212 పేర్లను సెర్చ్ కమిటీ ఎంపికచేసి మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్కు పంపించింది.
ఇద్దరూ 1988 బ్యాచ్ అధికారులే..
ఎలక్షన్ కమిషనర్లుగా ఎంపికైన సుఖ్బీర్, జ్ఞానేశ్లు 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు. సుఖ్బీర్ ఉత్తరాఖండ్ క్యాడర్ అధికారి కాగా, జ్ఞానేశ్ కేరళ క్యాడెర్ అధికారి. సుఖ్బీర్ గతంలో ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చైర్మన్గా పనిచేశారు. అఖిలభారత సర్వీస్లోకి రాకముందు సుఖ్బీర్ అమృత్సర్లో ఎంబీబీఎస్ చదివారు. జ్ఞానేశ్ గతంలో కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా చేశారు. అమిత్ షా మంత్రిగా ఉన్న సహకార శాఖలోనూ కార్యదర్శిగా ఉన్నారు.
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పించిన ఆర్టికల్ 370ని రద్దుచేయడంలో జ్ఞానేశ్ హోం శాఖలో పనిచేస్తూ కీలకపాత్ర పోషించారు. ఐఐటీ(కాన్పూర్) పట్టభద్రుడైన జ్ఞానేశ్ 2014లో ఢిల్లీలో కేరళ రెసిడెంట్ కమిషనర్గా ఉన్నారు.