AP Jobs 2023 : నిరుద్యోగులకు వరం.. 8 వేల మందికి ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పుంగనూరు నియోజకవర్గం పారిశ్రామికాభివృద్ధి పరంగా పరుగులు తీస్తోంది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ, లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇటీవ‌లే ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు పుంగనూరులో ఎలక్ట్రికల్‌ బస్సుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.4,640 కోట్లతో జర్మన్‌ పెప్పర్‌ కంపెనీ దీనిని స్థాపనకు ముందుకొచ్చింది. పరిశ్రమ ఏర్పాటైతే 8 వేల మందికి నేరుగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మండలంలోని ఆరడిగుంట, మేలుందొడ్డి గ్రామాల్లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌కు సుమారు రెండు వేల ఎకరాలను మంత్రి, ఎంపీ కేటాయించారు. 

నిరుద్యోగులకు వరంగా..
ఈ ప్రాంతంలో ఎలక్ట్రికల్‌ బస్సుల నిర్మాణ కంపెనీకి స్థలాన్ని ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన స్టీల్‌ ఫ్యాక్టరీ పనులు చేస్తున్నారు. అలాగే గ్యాస్‌ సిలిండర్ల ఫ్యాక్టరీకి స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఎలక్ట్రికల్‌ బస్సు పరిశ్రమకు ఆమోదం లభించడంతో పారిశ్రామిక ముఖచిత్రం మారుతోంది. పుంగనూరు నియోజకవర్గం గత 3 దశాబ్దాలుగా కరువు కాటకాలతో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి, ఎంపీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. నాలుగున్నరేళ్లలో అభివృద్ధిని పరుగులు తీయించారు. పరిశ్రమల ఊసేలేని పుంగనూరులో పరిశ్రమలు ఏర్పాటు చేయడంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. 

కర్ణాటక, తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న పుంగనూరు అభివృద్ధి చెందడంతో వ్యాపార లావాదేవీలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా నీటి సమస్య తీర్చేందుకు పుంగనూరులో ఆవులపల్లె, నేతిగుట్లపల్లె ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఈ విషయాలపై ఎంపీ మిథున్‌రెడ్డి పారిశ్రామికవేత్తలతో చర్చించడం..వారు పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా స్పందించడం నిరుద్యోగులకు వరమైంది.

మా లక్ష్యం ఇదే.. : మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మా కుటుంబానికి అండగా ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి, ప్రజల ఆర్థిక స్థితిగతులు మరింత మెరుగు పరచాలన్నదే మా లక్ష్యం. 30 ఏళ్లుగా జరగని అభివృద్ధిని చేసి చూపిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక నిధులు, పరిశ్రమలు కేటాయించడంతో పుంగనూరుకు గుర్తింపు లభించింది. ప్రజలకు అవసరమైన అన్నింటినీ శక్తివంచన లేకుండ పూర్తి చేస్తాం .

నిరుద్యోగులకు ఉపాధి లభించే మరిన్ని పరిశ్రమలను..

నిరుద్యోగులకు గత ప్రభుత్వంలా కల్లబొల్లిమాటలు చెప్పకుండా వారి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ముఖ్యమంత్రి జగనన్న ఆశీర్వాదంతో సరిహద్దుల్లో ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో రెండు రిజర్వాయర్లు, గండికోట నుంచి పైపులైన్లు ద్వారా నీటి సమస్య పరిష్కరిస్తున్నాం. పరిశ్రమలకు అవసరమైన నీరు పుష్కలంగా లభిస్తుండడంతో పారిశ్రామికవేత్తలు పుంగనూరుకు రావడం ఆనందంగా ఉంది. ప్రజలకు, నిరుద్యోగులకు ఉపాధి లభించే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాం.
               – పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి, ఎంపీ, రాజంపేట

#Tags