డాక్టర్‌ ‘విద్యార్థి’..! 55 ఏళ్ల వయస్సులో పీజీ చదివేందుకు సిద్ధం

గుంటూరు జీజీహెచ్‌లో న్యూరాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గాజుల రామకృష్ణ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా మూడు పీజీ వైద్య విద్యలు అభ్యసించి.. తాజాగా నాల్గో పీజీ వైద్య చదివేందుకు సిద్ధమయ్యారు.
డాక్టర్‌ రామకృష్ణ

గుంటూరు జిల్లా వేమూరు మండలం చావలికి చెందిన గాజుల రామకృష్ణ.. గుంటూరు వైద్య కళాశాలలో 1986–92లో ఎంబీబీఎస్, 1998–2000లో పల్మనాలజీలో పీజీ చేశారు. 2001 నుంచి 2004 వరకు వెల్దుర్తి మండలం ఉప్పలపాడు పీహెచ్‌సీ మెడికల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. 2004 నుంచి 2006 వరకు ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో ట్యూటర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకు జనరల్‌ మెడిసిన్‌ లో గుంటూరులో పీజీ చదివారు. 2009 నుంచి 2011 వరకు గుంటూరు జీజీహెచ్‌లో జనరల్‌ మెడిసిన్‌ వైద్య విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2011 నుంచి 2014 వరకు తిరుపతి స్విమ్స్‌లో న్యూరాలజీలో పీజీ వైద్య విద్యనభ్యసించారు. 2014 నుంచి ఇప్పటి వరకు గుంటూరు జీజీహెచ్‌ న్యూరాలజీ వైద్య విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ.. పీజీ నీట్‌ ఎంట్రన్స్ లో కార్డియాలజీ సూపర్‌ స్పెషాలిటీ పీజీలో సీటు దక్కించుకున్నారు. మంగళగిరి ఎన్నారై వైద్య కళాశాలలో కార్డియాలజీ పీజీ చదివేందుకు కౌన్సెలింగ్‌లో ఆపన్ ఎంచుకున్నారు. తిరుపతిలో పీజీ వైద్య విద్యార్థీగా ఉన్న సమయంలో 86 స్పోర్ట్స్‌ మెడల్స్‌ దక్కించుకుని, 33 న్యూరాలజీ క్విజ్‌ పోటీల్లో విజేతగా నిలిచి అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. 2014లో నేషనల్‌ క్విజ్‌ పోటీలో విన్నర్‌గా నిలిచారు. 55 ఏళ్ల వయస్సులో కార్డియాలజీ పీజీ చదివేందుకు సిద్ధమైన డాక్టర్‌ గాజుల రామకృష్ణను స్విమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వెంగమ్మ, జీజీహెచ్‌ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్వీ‌ సుందరాచారి, జ్వరాల ఆస్పత్రి రిటైర్డ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గడ్డిపాటి బాబూరావు తదితరులు అభినందించారు.

#Tags