Arrangements for Summative-1 Examinations: సమ్మేటివ్–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమయ్యే సమ్మేటివ్–1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని డీఈఓ విజయేంద్రరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్దేశించిన షెడ్యూల్ మేరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలు పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు.
గంట ముందు ప్రశ్నపత్రాలు తీసుకెళ్లండి..
ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు ఎంఈఓ కార్యాలయాల నుంచి ప్రశ్నపత్రాలను తీసుకెళ్లాలని డీఈఓ విజయేంద్రరావు సూచించారు. ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. సీబీఎస్ఈ పాఠశాలల్లో ఎనిమిదో తరగతికి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, తొమ్మిదవ తరగతికి మధ్యాహ్నం 1.30 గంట నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలను జరపాలన్నారు.
Also Read : Puzzle of the Day (27.11.2023): Logic Puzzle
పరీక్షలు పూర్తైన వెంటనే ఉపాధ్యాయులు వారి సబ్జెక్టుల్లో కీ స్వయంగా తయారు చేసుకుని జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని సూచించారు. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయడంతో పాటు నిర్ణీత సమయంలోపు స్టూడెంట్ ఇన్ఫో సైట్లో నమోదు చేయాలని తెలిపారు. అలాగే జవాబు పత్రాలను తనిఖీ నిమిత్తం భద్రపరచాలన్నారు. డిసెంబర్ 9వ తేదీన ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను అందజేయాలని డీఈఓ ఆదేశించారు.