Droupadi Murmu, President Of India : టీఎస్‌ నుంచి ఏపీకి వచ్చిన వారికి గుడ్‌న్యూస్‌..ఉద్యోగ, విద్యా రంగాల్లో

సాక్షి ఎడ్యుకేష‌న్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి తరలివచ్చి ఏపీలో స్థిర నివాసముంటున్న వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించేందుకు గత ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీచేశారు.
President of India

రాష్ట్ర విభజన అనతరం తెలంగాణ నుంచి ఏపీకి తరలి వచ్చిన‌ వారికి విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఏడేళ్ల పాటు స్థానికత కల్పిస్తూ 2014లో రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు.

విద్యా సంస్థల్లో ప్రవేశాలకు..
ఆ ఏడేళ్ల గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లు పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఏడేళ్లకు బదులు పదేళ్లుగా సవరణలు చేస్తూ డిసెంబ‌ర్ 10వ తేదీన (శనివారం) ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 1974 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ చేయగా.. ఉద్యోగుల స్థానికతకు సంబంధించి 1975నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేశారు.

మరో మూడేళ్ల పాటు..
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌(ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌)లో సవరణలు చేస్తూ తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి స్థిరపడిన వారికి డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లలో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌(రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్లు)లో సవరణలు చేస్తూ.. విద్యా సంస్థల ప్రవేశాల్లో మరో మూడేళ్ల పాటు స్థానికత కల్పించారు.

#Tags