CUET PG 2024 Exam: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్సర్ కీపై కీలక అప్డేట్
దేశంలోని వివిధ సెంట్రల్ యూనివర్సిటీలు,ఇతర వర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET)పీజీ పరీక్షలు ముగిశాయి. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి క్యూట్–పీజీ పరీక్షలు మార్చి 11వ తేదీ నుంచి 28 వరకు పరీక్షలు జరిగాయి.
మొత్తం 4.62 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా,మొత్తం 75.14 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గతంతో పోలిస్తే ఈసారి హాజరు శాతం పెరిగింది. తొలిసారి 2022లో ఈ పరీక్షలను నిర్వహించగా హాజరు శాతం కేవలం 55.13 శాతంగానే ఉంది. గతేడాది ఇది 61.51కి పెరగగా, ఈసారి మరింత మంది అభ్యర్థులు హాజరయ్యారు.
మొత్తం 565 కేంద్రాల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానంలో పరీక్షలు నిర్వహించారు. వీటిలో భారత్లోని 253 నగరాలతో పాటు దేశం వెలుపల మనమా, దుబాయ్, ఖట్మాండు, మస్కట్, రియాద్, ఒట్టావా, అబుదాబి, వియన్నా, ఖతార్లాంటి నగరాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)తెలిపింది.
త్వరలోనే ఆన్సర్ కీని వెల్లడిస్తామని, అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్లో సవాలు చేయొచ్చని, తుది కీని https://pgcuet.samarth.ac.in/ పోర్టల్లో అప్లోడ్ చేస్తామని పేర్కొంది.