AI Courses Will Be Started In Degree Colleges- డిగ్రీ కాలేజీల్లోనూ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సులు

వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌(ఏఐ) కోర్సులు ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్య కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. మధురానగర్‌ స్థానిక మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం రాష్ట్రంలోని 54 ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ప్రిన్సిపాల్స్‌, ఇంటర్నల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ సెల్‌ సమన్వయకర్తల శిక్షణ కార్యక్రమం జరిగింది.

డిగ్రీ పూర్తయ్యేలోపు కొలువులు

కార్యక్రమంలో విద్య కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కళాశాల ప్రిన్సిపాల్‌ స్థానికంగా ఉన్న పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ చేయించాలని సూచించారు. అలాగే డిగ్రీ పూర్తయ్యేలోపు ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ, వర్చువల్‌ రియాలిటీని ఉపయోగించుకుని విద్యాబోధన మరింత సరళతరం చేయాలన్నారు. అనంతరం అమెరికాకు చెందిన జెడ్‌ స్పేస్‌ టెక్నాలజీ వారు రూపొందించిన 3డీ వీడియోలను ప్రదర్శించారు. జంతు, వృక్ష, రసాయన, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ 3డీ వీడియోలను ఆగ్యుమెంటెడ్‌ రియాలిటీ ప్రజెంటేషన్‌ను ఆ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ గౌతం మేందు అందించారు.
 

#Tags