Skip to main content

Inspiring Story Of Jones Manikonda: మురికి వాడల్లో ట్యూషన్‌ సెంటర్స్‌.. వాళ్లకు చదువు చెప్పడం కోసం అవివాహితగా మిగిలిపోయిన జోన్స్‌

Inspiring Story Of Jones Manikonda

విజయవాడకు చెందిన 50 ఏళ్ల జోన్స్‌ మానికొండ వెనుక ఏ ఆర్థిక అండాదండా లేదు. కాని ఆమె విజయవాడలో, కృష్ణాజిల్లాలో ఇంకా రాష్ట్రవ్యాప్తంగా మురికివాడల పిల్లల కోసం 60 ట్యూషన్‌ కేంద్రాలను వాలంటీర్లతో నడుపుతోంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రుల వల్ల స్కూల్‌ పాఠాల పట్ల భయం ఏర్పడకుండా, స్కూల్‌ మానేయకుండ ఈ ఈవెనింగ్‌ ట్యూషన్స్‌ సాయపడుతున్నాయి. మొత్తం 6 వేల మంది పిల్లలు ఇప్పటికి జోన్స్‌ వల్ల మేలు పొందారు.

మురికివాడల్లో ట్యూషన్‌ సెంటర్స్‌
మామూలు పిల్లల సాయంత్రాలు వేరు. తల్లి వారికి స్నానం చేయించి, తినడానికి ఏదైనా ఇచ్చి, కాసేపు ఆడుకోనిచ్చి, ఆ తర్వాత చదువుకు కూచోబెడుతుంది. చదివిస్తుంది. లేదంటే ట్యూషన్‌కు పంపుతుంది. మరి మురికివాడల్లోనో? ఆ పిల్లలు స్కూల్‌కు వెళ్లడమే కష్టం. ఇంటికొచ్చాక పాఠాలు చదివించాలంటే తల్లికి తీరిక ఉండదు. లేదా ఆమెకు చదువు రాదు. తండ్రికి అసలే పట్టదు.

మరుసటి రోజు స్కూల్‌కు వెళితే హోమ్‌వర్క్‌ చేయలేదని టీచర్‌ తిడుతుందని భయం. దాని బదులు స్కూల్‌ ఎగ్గొట్టడమే నయం. ఇలా ఆ పిల్లలు డ్రాపవుట్స్‌గా మారితే? అందుకే జోన్స్‌ మానికొండ మురికివాడల్లో ట్యూషన్లు నడుపుతుంది. ఆదర్స్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్స్‌ పేరుతో ఆమె నడుపుతున్న ట్యూషన్లు ఆంధ్రప్రదేశ్‌లో పిల్లల చదువుకు మేలు చేస్తున్నాయి.

చదువే గౌరవం
విజయవాడలోనే పుట్టి పెరిగిన జోన్స్‌ మానికొండ ఏడుగురు సంతానంలో రెండవది. సోషియాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ చేశాక ఎం.ఈడీ. చేసి, సైకాలజీలో మరో పీజీ చేసింది. ‘మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అందరం బాగా చదువుకున్నాం. చదువు మాత్రమే మనిషికి గౌరవం, ఉపాధి ఇవ్వగలదు. కాని నేటికీ చాలా పేదవాడల్లో పిల్లలకు చదువు అందడం లేదు. మురికివాడల్లోని పిల్లల కోసం ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నాను. ప్రతి ఒక్కరూ చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే కాదు సమాజం మీద కూడా ఉంది’ అంటుందామె. సమాజసేవ కోసం అవివాహితగా ఉండాలని నిర్ణయించుకుంది జోన్స్‌.

వెనుకబడ్డ సమూహాలు
మురికివాడల్లో ఎక్కువగా ఉంటున్నది వెనుకబడ్డ సమూహాలు అని గమనించి ఆ సమూహాల మీద దృష్టి పెట్టింది జోన్స్‌. యానాది, ఎరుకల, వడ్డెర, జంగం, సుగాలి, కోయ... ఇలా 19 సమూహాలను గుర్తించి వారి నివాస ప్రాంతాల్లో ట్యూషన్‌ సెంటర్లను నిర్వహిస్తోంది. మొత్తం కృష్ణాజిల్లాలో 22, విజయవాడలో 13, వైజాగ్‌లో 4, హైదరాబాద్‌లో 3 సెంటర్లు ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. 48 టీచర్లు, 13 మంది వాలంటీర్లు మురికివాడల్లో ట్యూషన్లు చెబుతూ పిల్లలు స్కూళ్లకెళ్లి బాగా చదువుకునేలా సహాయం చేస్తున్నారు.

బంధుమిత్రుల సాయంతో..
జోన్స్‌ నిర్వహిస్తున్న ఈవెనింగ్‌ ట్యూషన్లకు నెలకు దాదాపు 2 లక్షల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చులో దాదాపు ఎక్కువ భాగం సౌత్‌ ఆఫ్రికాలోని ఒక సోదరుడు, సింగపూర్‌లో ఉన్న ఒక సోదరి ఇస్తారు. మరికొంత సాయం స్నేహితుల వల్ల... దాతల వల్ల అందుతుంది. ‘కేవలం చదువు మాత్రమే కాదు... ఈ పిల్లలకు పౌష్టికాహారం, పరిశుభ్రమైన బట్టలు కూడా కావాలి. ఆ దిశగా కూడా నా సేవ కొనసాగాలని కోరుకుంటున్నాను. పేదరికం వల్ల పిల్లల్ని పనుల్లో పెట్టే తల్లిదండ్రులను ఒప్పించి ఆ పిల్లలను బడికి పంపేలా చూడటం మాకున్న అతిపెద్ద సవాలు’ అంటుంది జోన్స్‌.

లెక్చరర్‌గా ఉద్యోగం మానేసి మరీ ఆమె చేస్తున్న ఈ సేవకు సమాజం నుంచి మరింత మద్దతు దొరుకుతుందని ఆశిద్దాం.

Published date : 21 Feb 2024 04:09PM

Photo Stories