Skip to main content

AP CM YS Jagan : పాఠశాలలకు పెద్దలు వీరే..అన్ని బాధ్యతలు వారిపైనే

సాక్షి, తాడేపల్లి : విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
CM YS Jagan

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో న‌వంబ‌ర్ 17వ తేదీన (బుధవారం) జరిగిన ఈ సమావేశంలో నూతన విద్యా విధానం అమలు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం వంటి అంశాలపై చర్చించారు. అలాగే ఈ సందర్భంగా శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ ప్లస్‌స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌పై సీఎం జగన్‌కు అధికారులు వివరాలు అందించారు.

9.5 లక్షల మంది విద్యార్థులకు.. 
2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో నూతన విద్యా విధానం మూడు దశలుగా పూర్తిగా అమలు కానున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు. దీనిలో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ(అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేయనున్నట్లు తెలిపారు. తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2,663 స్కూళ్లు  విలీనం చేశామని, 2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని అధికారులు సీఎంకు వివరించారు.
         ఈ సందర్భంగా  సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సీఎం జగన్‌ ఆదేశించారు.

సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ మీదపైన‌..
➤ 1092 స్కూల్స్‌ 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ జరిగాయని అధికారులు వివరించారు.
➤ ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదోతరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు.
➤ అంతర్జాతీయంగా 24వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉందని పేర్కొన్నారు.
➤ ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఇవ్వడం రికార్డని అధికారులు తెలిపారు.
➤ టీచర్‌ ట్రైనింగ్‌ ఇస్తున్న డైట్‌ సంస్థల సమర్థత పెంచాలని సీఎం ఆదేశించారు.
➤ టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని అన్నారు.
➤ టీచర్లకు శిక్షణకార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని సూచించారు.
➤ స్కూళ్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌చేసేలా ఒక నంబర్‌ పెట్టాలని ఆదేశించారు.
➤ ప్రతి స్కూళ్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలని, ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని, తగిన చర్యలు    తీసుకోవాలని అధికారులకు సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

ఇంగ్లీష్‌పైన‌..
➤ ఇంగ్లిషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం పేర్కొన్నారు.
➤ దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టిపెట్టాలన్నారు.
➤ పిల్లలకు ఇదివరకే డిక్షరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలని తెలిపారు.
➤ ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు నేర్పించాలని ఆదేశించారు.

ఎయిడెడ్‌ పాఠశాలల అప్పగించడం పైన‌.. 
➤ ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందం అని సమావేశంలో మరోసారి సీఎం స్పష్టం చేశారు.
➤ వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని ప్రస్తావించారు.
➤ ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయొచ్చని, లేదంటే యథా ప్రకారం నడుపుకోవచ్చని మరోసారి స్పష్టం చేశారు.
➤ విలీనం చేస్తే.. వారి పేర్లు కొనసాగిస్తామని తెలిపారు.
➤ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని సూచించారు.
➤ విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశమని స్పష్టం చేశారు.
►ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలు కూడా తగవని స్పష్టం చేశారు.

మరుగుదొడ్లు నిర్వహణ..
➤ మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని అధికారులకు సూచించారు.
➤ నాణ్యమైన సదుపాయాలు అన్నది అందరి లక్ష్యం కావాన్నారు.
➤ అందుకనే పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలని ఆదేశించారు.
➤ టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక... అవి చివరకు దుర్గంధంతో నిండిపోయి ఎవరూ వినియోగించని పరిస్థితులు చూశామని, అలాంటి పరిస్థితులను నాడు-నేడు ద్వారా మార్చామని గుర్తు చేశారు
➤ ఇప్పడు వాటిని సరిగ్గా పర్యవేక్షించి పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉండాలని తెలిపారు.
పాఠశాలలకు హెడ్‌మాస్టర్లు కుటుంబ పెద్దలు..
➤ పాఠశాలలకు హెడ్‌మాస్టర్లు కుటుంబ పెద్దలు అని, ఆ పాఠశాలల్లో నాణ్యమైనరీతిలో బోధన దగ్గరనుంచి మొదలు భోజనం నుంచి ఇతర సదుపాయాలు, మౌలిక వసతులపై  తనిఖీలు చేసి  వాటిని సవ్యంగా ఉండేలా వారుచూడాలన్నారు.
➤ ఆవిధంగా హెడ్‌ మాస్టర్లను చైతన్యం చేయాలని, ప్రతిరోజూ మానిటరింగ్‌ జరగాలని పేర్కొన్నారు.

గోరుముద్దపై..
➤ గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
➤ పిల్లల నుంచి, తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని తెలిపారు.
➤ ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
➤కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని, స్వయంగా వారు భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలన్న సీఎం జగన్‌ ఆదేశించారు.

లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌..
ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలని అధికారులకు సీఎం నిర్దేశం చేశారు.

Published date : 17 Nov 2021 05:39PM

Photo Stories