Women's Day Celebrations: వైవీయూలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
![Women's Day Celebrations at Yogi Vemana University International Women's Day](/sites/default/files/images/2024/03/09/womens-day-yvu-1709981990.jpg)
వైవీయూ: ప్రతి బాలిక ఉన్నత విద్యావంతురాలు కావాలని, తద్వారా వివక్ష లేని సమాజాన్ని సంపూర్ణంగా చూడవచ్చని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్ పేర్కొన్నారు. వైవీయూలోని సురభి సమావేశ మందిరంలో గురువారం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ మహిళల ప్రగతి ద్వారా సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఎస్కేయూ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య పి. కుసుమకుమారి మాట్లాడుతూ మహిళలు వారి హక్కును సాధించి తీసుకోవాలన్నారు. మహిళల అభ్యుదయం కోసం రాజా రామ్మోహన్ రాయ్, వీరేశలింగం వంటి సంఘసంస్కర్తలు కృషి చేశారని తెలిపారు. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విశ్వవిద్యాలయాల పాలకమండలిలో 50 శాతం మందిని తీసుకున్నారని తెలిపారు. వైవీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రఘునాథరెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రవేశించని రంగం లేదని, ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు.
Spanish Course: స్పానిష్ బోధనకు ఉపాధ్యాయురాలి నియామకం
పాలకమండలి సభ్యులు ఆచార్య చంద్రమతి శంకర్ మాట్లాడుతూ ఉన్నత స్థలాల్లో నిలిచేందుకు మహిళలు ప్రయత్నించాలన్నారు. వైవీయూ మహిళా సెల్ సమన్వయకర్త ఆచార్య పి. రమాదేవి మాట్లాడుతూ మహిళా దినోత్సవం వెనుక ఉన్న చరిత్రను సంక్షిప్తంగా వివరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు అతిథులు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆచార్య జి.కాత్యాయని, డా.ప్రమీల మార్గరేట్, డా.ఎల్.దాక్షాయణి, కె.వేణి సుజాత, అధ్యాపకులు, విద్యార్థులు, పాల్గొన్నారు.
Intermediate Exams 2024:నేటి నుంచి ఇంటర్ సంస్కృత మూల్యాంకనం