New School Textbooks: కొత్త పాఠ్యపుస్తకాలు వచ్చాయ్..తెలుగు, ఇంగ్లిష్లో పుస్తకాల ముద్రణ
![Preparing for the new academic year New School Textbooks Textbooks arranged for government school students](/sites/default/files/images/2024/05/07/books-1715067997.jpg)
సూర్యాపేటటౌన్: వచ్చే విద్యాసంవత్సరం (2024–25)లో ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పుస్తకాలను జిల్లా కేంద్రానికి చేరవేస్తున్నారు.
ఐదు లక్షల పుస్తకాలకు గాను..
జిల్లాలో మొత్తం 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 62వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ ఏటా ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తోంది. మొత్తం పార్ట్–1, పార్ట్–2కు సంబంధించి ఐదు లక్షల వరకు పుస్తకాలు అవసరం ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రెండు విడతల్లో 27,680 పుస్తకాలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు కూడా విడతల వారీగా జిల్లా కేంద్రంలోని గోదాంకు వస్తాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. విద్యా సంవత్సరంలో రెండుసార్లు పంపిణీ చేస్తుండగా పార్ట్–1 పుస్తకాలు వస్తున్నాయి. అర్ధ సంవత్సరం ముగిసేలోపు పార్ట్–2 పుస్తకాలు పంపిణీ చేస్తారు.
తెలుగు, ఇంగ్లిష్లో ముద్రణ
ప్రస్తుతం పుస్తకంలో ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్లో ముద్రిస్తున్నారు. దీంతో రెండు మాధ్యమాల వారు చదువుకునే వీలుంది. రెండేళ్ల క్రితం తొలిసారిగా 3 నుంచి 8వ తరగతి వరకు సరఫరా చేశారు. ఈ ఏడాది 9వ తరగతి వరకు బైలింగ్వెల్ పుస్తకాలు రానున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రతి పాఠానికి రెండు భాషల్లో ముద్రించడంతో విద్యార్థుల్లో విజ్ఞానం పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
జూన్ వరకు పూర్తిస్థాయిలో వస్తాయి
ఇప్పటి వరకు రెండు విడతల్లో పుస్తకాలు వచ్చాయి. వాటిని జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలోని గోదాంలో భద్రపరుస్తున్నాం. జూన్ వరకు పూర్తి స్థాయిలో వస్తాయి. వచ్చాక మండలాలకు పంపిస్తాం. విద్యార్థులకు పుస్తకాల కొరత లేకుండా చూస్తాం. బైలింగ్వెల్ పుస్తకాలతో విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుంది.
– అశోక్, డీఈఓ, సూర్యాపేట