Skip to main content

తెలంగాణ ఉద్యమ క్రమంలో కమిటీలే కీలకం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ క్రమంలో ప్రభుత్వాలు నియమించిన కమిటీలు... వాటి నివేదికలు ఎంతో కీలకంగా నిలిచాయి. తొలి దశ నుంచి మలి దశ ఉద్యమం వరకు ఈ కమిటీల నివేదికలు, సిఫార్సులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి దోహదపడ్డాయి. ఈ నేపథ్యంలో గ్రూప్స్ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఈ ప్రాంత హక్కులు, ప్రజల ఆకాంక్షలకు సంబంధించి ఆయా కమిటీల నివేదికలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలని సూచిస్తున్న... టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్‌ఎస్‌ఆర్) సదరన్ రీజినల్ సెంటర్ డెరైక్టర్ ప్రొఫెసర్ జి. కృష్ణారెడ్డి అందిస్తున్న వ్యాసం సాక్షికి ప్రత్యేకం..
సామాజిక సమస్యల పరిష్కారానికి కమిటీల ఏర్పాటు, అవి అందించే నివేదికలు, వాటిలో పొందుపర్చిన సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకోవడం సాధారణంగా జరిగే పరిణామం. తెలంగాణ విషయంలోనూ వివిధ కమిటీల నివేదికలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను ఇవి కళ్లకు కట్టాయి. కొన్ని కమిటీలు తెలంగాణ ప్రాంతంలోని సీమాంధ్ర ప్రాంత వాసుల ఆందోళనల గురించి ప్రస్తావించినప్పటికీ... అధిక శాతం కమిటీలు తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నివేదించాయి.

ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం 2004 నవంబర్‌లో ఒక ఉపసంఘాన్ని నియమించింది. దీనికి ప్రణబ్ ముఖర్జీ చైర్మన్. రఘువంశ ప్రసాద్ సింగ్, దయానిధి మారన్‌లు సభ్యులు. గుర్తింపు పొందిన అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మధ్య తెలంగాణ అంశంపై సర్వసమ్మతి తీసుకురావడానికి ఈ కమిటీ ప్రయత్నించింది. రాష్ట్రంలోనూ తెలంగాణ అంశంపై అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి.. సీనియర్ కేబినెట్ మంత్రి కె.రోశయ్య నాయకత్వంలో సబ్ కమిటీని నియమించారు.

శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేకం
పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ 2009 నవంబర్ 29న టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. తదనంతర పరిణామాలతో కేంద్ర హోంశాఖ మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెడతామని ప్రకటించారు. కానీ తర్వాత సీమాంధ్ర నుంచి వచ్చిన ఒత్తిళ్లతో 2009 డిసెంబర్ 23న ఆయన రెండో ప్రకటన చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల, సంఘాల సంప్రదింపులను పరిశీలించిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటయ్యాయి. తెలంగాణ ప్రజలు అనేక రూపాల్లో నిరసనను తెలిపారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, సాధ్యాసాధ్యాలపై.. యూపీఏ ప్రభుత్వం 2010 ఫిబ్రవరి 3న జస్టిస్ బి.ఎన్.శ్రీకృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించింది. దీనిలో ప్రొఫెసర్ రణ్‌బీర్ సింగ్(వైస్ చాన్స్‌లర్, నేషనల్ లా యూనివర్సిటీ - ఢిల్లీ), డాక్టర్ అబుసలే షరీఫ్ (చీఫ్ ఎకనామిస్ట్/సీనియర్ రీసెర్చ్ ఫెలో, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్, ఢిల్లీ), ప్రొఫెసర్ రవీందర్ కౌర్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్- ఐఐటీ, ఢిల్లీ), వినోద్ కుమార్ దుగ్గల్ (కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి) సభ్యులు. ఈ కమిటీ 2010 డిసెంబర్ 30న తన నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేయగా.. 2011 జనవరి 6న కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. ఈ కమిటీ సమర్పించిన నివేదిక అత్యంత ప్రత్యేకమైనదిగా పేర్కొనొచ్చు.

క్షేత్రస్థాయిలో అధ్యయనం
తెలంగాణ ఏర్పాటు పరంగా ఇతర కమిటీలతో పోల్చితే శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేకత క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయడం! సమస్య మూలాలను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని మారుమూల గ్రామాల్లో సైతం కమిటీ పర్యటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాల్లోనూ కమిటీ సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా కమిటీ వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి మద్దతు, సహకారం, విలువైన సమాచారం పొందింది. తన నివేదికలో హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలన్నీ ఎంతో వెనుకబాటుతనంతో మగ్గుతున్నాయని కమిటీ పేర్కొంది.

అభిప్రాయాల స్వీకరణ
కృష్ణ కమిటీ పనితీరులో మరో ముఖ్యాంశం.. కేవలం కమిటీ సభ్యులే ఆయా ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికే పరిమితం కాలేదు. తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు స్వీకరించే విధంగా వ్యవహరించింది. ఈ క్రమంలో అరవై వేలకుపైగా అభిప్రాయాలు సేకరించింది. వాటన్నింటినీ క్షుణ్నంగా అధ్యయనం చేసింది. శ్రీకృష్ణ కమిటీ అధ్యయన క్రమంలో.. సాధారణ ప్రజానీకం, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు.. ఇలా అన్ని వర్గాలతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపింది. దళిత సంఘాలు, చర్మకార, ఇతర వృత్తులకు చెందిన వ్యక్తులు మొదలు న్యాయవాదులు, రాజకీయ పార్టీలు, జర్నలిస్ట్‌లు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయశాఖ సిబ్బంది, ఆయా సంఘాలు-వాటికి సంబంధించి ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీలతో చర్చించి తెలంగాణ ఆకాంక్ష గురించి ప్రత్యేకంగా తెలుసుకునే యత్నం చేసింది. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెస్‌పార్టీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం.. ఇలా అన్ని రాజకీయ పార్టీలతో వేర్వేరుగా సంప్రదింపులు జరిపి వారి నుంచి అభిప్రాయాలను సేకరించింది.

జేఏసీలతో సంప్రదింపులు
తెలంగాణ ప్రత్యేక ఉద్యమం నేపథ్యంలో ఏర్పాటైన ఆయా రంగాలు, వృత్తులకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీలతోనూ ప్రత్యేకంగా వేర్వేరుగా శ్రీకృష్ణ కమిటీ చర్చించింది. స్టూడెంట్ జేఏసీలు మొదలు; పొలిటికల్ జేఏసీ వరకు తెలంగాణలో ఉన్న అన్ని జేఏసీల అభిప్రాయాలు స్వీకరించేందుకు కృషి చేసింది. తెలంగాణ ప్రాంత వర్గాల నుంచే కాకుండా సీమాంధ్ర ప్రాంత వర్గాల నుంచి కూడా అభిప్రాయాలు స్వీకరించింది. ఈ క్రమంలోనే సీమాంధ్రకు చెందిన వారి అభిప్రాయాలకు కమిటీ నివేదికలో పెద్దపీట లభించిందనే ఆరోపణా ఉంది. అలాగే ఈ కమిటీ చేసిన నివేదికలు తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు - తెలుగు ప్రాంతాలకు సంబంధించి చేసిన ఆరు సిఫార్సుల్లో ఒక్కటి కూడా తెలంగాణకు ఆమోదయోగ్యంగా లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం.. సిఫార్సులు ఎలా ఉన్నప్పటికీ.. తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను, వెనుకబాటుతనాన్ని నివేదికలో పొందుపర్చి శ్రీకృష్ణ కమిటీ ఈ ప్రాంత సమస్యలను వెలుగులోకి తెచ్చిందన్నది వాస్తవం. ఉదాహరణకు హైదరాబాద్‌ను మినహాయిస్తే తెలంగాణలోని మిగతా తొమ్మిది జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రణాళిక సంఘం గుర్తించిన వైనాన్ని.. అదే విధంగా ఈ తొమ్మిది జిల్లాల్లో 87 శాతం ప్రజలు వెనుకబాటుతనంతో ఉన్నారని ప్లానింగ్ కమిషన్ పేర్కొన్న విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఉటంకించింది. అదే విధంగా 610 జీవో ఉల్లంఘనను సైతం ప్రస్తావించింది. 1975 నుంచి 2005 మధ్య కాలంలో 610 జీవో నిబంధనల అమలు తీరు, తెలంగాణ ప్రాంత ఉద్యోగులు వివక్షకు గురైనట్లు పేర్కొంది.

శ్రీకృష్ణ కమిటీ వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభిప్రాయాలను సేకరించి 2010 డిసెంబర్ 30న నివేదికను సమర్పించింది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ విషయంలో ఆరు రకాల ప్రత్యామ్నాయాలను ముందుకు తెచ్చింది. అవి..
  1. రాష్ట్రాన్ని విభజించకుండా ఉంచుతూ, తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధి కోసం, రాజకీయ సాధికారత కోసం రాజ్యాంగబద్ధమైన తెలంగాణ రీజనల్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేయడం.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది ఉన్నట్లుగా యధాతథ స్థితి కొనసాగింపు.
  3. ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ; రాయలసీమకోస్తాంధ్రాలుగా రెండు రాష్ట్రాలుగా విభజించడం; హైదరాబాద్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం చేయడం. దీనికి నల్లగొండ జిల్లా ఆగ్నేయంగా కోస్తా ఆంధ్రలోని గుంటూరుకు, మహబూబ్‌నగర్ జిల్లా ద్వారా దక్షిణంవైపు రాయలసీమలోని కర్నూలుకు భౌగోళిక అనుసంధానం చేయడం.
  4. ఆంధ్రప్రదేశ్‌ను.. రాయలసీమ తెలంగాణ ప్రాంతాలు కలిపి రాయల తెలంగాణగా, కోస్తా ఆంధ్రాగా విభజించడం, హైదరాబాద్‌ను రాయల తెలంగాణాలో అంతర్భాగం చేయడం.
  5. తెలంగాణ, రాయలసీమ-ఆంధ్రా ప్రాంతాలను రెండు రాష్ట్రాలుగా విభజించడం, విస్తరించిన హైదరాబాద్‌ను ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం.
  6. తెలంగాణ, రాయలసీమ-కోస్తాంధ్రలను ప్రస్తుతమున్న జిల్లా సరిహద్దులను దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్రాలుగా విడగొట్టి, హైదరాబాద్‌ను తెలంగాణకు రాజధానిగా ప్రకటించడం; మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు చేయడం.
  • ఇక కమిటీ స్వయంగా చేసిన వ్యాఖ్య ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను తెలుపుతుంది. అది.. In view of the complex background of the situation and the rather serious and sensitive emotional aspects involved, the committee is of the unanimous view that it would not be practical to simply maintain the status quo in respect of the situation.
అంటే.. సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన క్లిష్టమైన అంశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో యథాతథస్థితిని కొనసాగించడం ఆచరణలో సులభ సాధ్యం కాదని కమిటీ ఏకగ్రీవ అభిప్రాయంగా స్పష్టం చేసింది. ఇలా.. తుది నివేదికలో ఎలాంటి సిఫార్సులు చేసినా.. ఎనిమిదో చాప్టర్ విషయంలో వివాదాస్పదమైనప్పటికీ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక, అందులోని సిఫార్సులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను జాతీయ స్థాయిలో ప్రతిబింబించాయి.

ఆంటోని కమిటీ
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఏర్పాటు క్రమంలో మరో ముఖ్యమైన కమిటీ.. ఎ.కె. ఆంటోని కమిటీ. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తర్వాత పరిణామ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎ.కె. ఆంటోని నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఎ.కె. ఆంటోనితోపాటు అప్పటి కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లు సభ్యులుగా ఉన్న ఈ కమిటీ కూడా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నాయకుల అభిప్రాయాలు సేకరించి నివేదిక అందించింది.

ప్రజాస్వామ్య భావాలు ప్రస్ఫుటం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కమిటీలు, నివేదికలను మినహాయిస్తే అత్యంత ప్రధానంగా గమనించాల్సిన అంశం ప్రజాస్వామ్య భావాలు ప్రస్ఫుటమైన విధానాలు. భావ స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, ప్రాంతీయ స్వేచ్ఛ వంటి ప్రజాస్వామ్య భావాలు బలంగా కనిపించాయి. ఇందుకు జాయింట్ యాక్షన్ కమిటీలే ఉదాహరణలు.

పార్టీలను నడిపించిన జేఏసీలు
ఒక విధంగా తెలంగాణ ఉద్యమ క్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీలే పార్టీలను నడిపించాయని చెప్పొచ్చు. వాస్తవంగా రాజకీయ పార్టీలతో తెలంగాణ ఉద్యమం ఆరంభమైనప్పటికీ.. తర్వాత క్రమంలో ఏర్పడిన జేఏసీలు ఆ రాజకీయ పార్టీల ఉనికికి ఎంతో తోడ్పడ్డాయి. ఒక విధంగా మార్గనిర్దేశం చేశాయి. జేఏసీల మద్దతు లేకుండా పార్టీలు ముందుకు వెళ్లలేని పరిస్థితులు సైతం ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పాటులో జేఏసీల పాత్ర ప్రశంసనీయం!!

సలహా
గ్రూప్స్ ఔత్సాహిక అభ్యర్థులు ఆయా కమిటీల నివేదికలు మొదలు ఆయా పార్టీలు, వాటి విధానాలు, ఎన్నికల సందర్భంలో వాటి మేనిఫెస్టోలు అన్నిటిపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలి. ముఖ్యంగా ఉద్యమ పార్టీగా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని నెలకొల్పిన టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో/ అజెండాలోని అంశాలు; ప్రస్తుతం ఆ అంశాల్లో ప్రగతి తీరుపై అధ్యయనం చేయాలి. అదే విధంగా నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా ఉన్న నేపథ్యంలో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధతో చదవాలి.
Published date : 19 Nov 2015 03:51PM

Photo Stories