Skip to main content

నక్సలిజం(Naxalism)

నక్సలిజానికి మూలాలు ఏంటి? పశ్చిమబెంగాల్‌లోని నక్సల్‌బరీలో వచ్చిన ఉద్యమం తెలుగు ప్రాంతాలకు ఎలా విస్తరించింది? నక్సల్‌బరీలో వచ్చిన ఉద్యమం అక్కడ ఎక్కువ రోజులు మనలేదు కానీ, తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఉద్యమం కొనసాగడానికి కారణాలేమిటి? తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం గురించి సమగ్ర అవగాహన పొందేందుకు.. ముందుగా నక్సలైట్ ఉద్యమానికి కారణాలు, నాటి జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు; తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటం, దాని ప్రభావం గురించి తెలుసుకోవాలి. గ్రూప్-1 పేపర్-6లో, అదేవిధంగా గ్రూప్-2 పేపర్-4లో నక్సలిజం అంశాన్ని చేర్చారు. ఈ నేపథ్యంలో గ్రూప్స్ అభ్యర్థుల కోసం ఈ వ్యాసం
స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో బ్రిటిష్ ఆధీనంలోని ప్రెసిడెన్సీ ప్రాంతాల్లో జాతీయ ఉద్యమం బలంగా ఉండేది. కానీ రాచరిక పాలన కొనసాగిన ప్రాంతాల్లో మాత్రం స్వాతంత్య పోరాటాలు పెద్దగా లేవనే చెప్పొచ్చు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోనూ స్వాతంత్య్ర ఉద్యమాలు లేవు. బ్రిటిష్ పాలనలో ఉన్న ఆంధ్రప్రాంతంలో స్వాతంత్య్ర పోరాటాలు, సంస్కరణ ఉద్యమాలు జరిగాయి. వ్యవసాయాభివృద్ధి కూడా జరిగింది. నిజాం పాలనలో హైదరాబాద్ నగరం కొంత అభివృద్ధి చెందింది, కానీ ఈ సంస్థానంలోని గ్రామాల్లో ప్రగతి జాడలేదు.
 
భూస్వామ్య వ్యవస్థ అరాచకం
నిజాం పాలనలో ఎలాంటి ప్రామాణికత లేని పన్నుల విధానంతో ప్రజలు, రైతులు వేధింపులకు గురయ్యారు. నిజాం రాజుల కాలంలో తెలంగాణలో భూస్వామ్య విధానం ఉండేది. భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండేలతో కూడిన అరాచక వ్యవస్థ ఉండేది. వీళ్లు వేలాది ఎకరాల భూములు కలిగి ఉండేవారు. గ్రామాల్లో ప్రజలు ఈ భూస్వాముల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి జీవనం సాగించేవారు. ముఖ్యంగా మహిళలు, రైతులు, కూలీల జీవనం దయనీయంగా ఉండేది. వెట్టి వ్యవస్థ అమల్లో ఉండేది. వ్యవసాయం చేయడం చాలా కష్టమనే నిస్సహాయ పరిస్థితి రైతుల్లో కనిపించేది. హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్ర ఉద్యమాలు జరగకపోవడం, కాంగ్రెస్ పార్టీని నిషేధించడం, సామాజిక ఉద్యమాలకు వెసులుబాటు లేకపోవడం లాంటి కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, బడుగులు, దళితులు దయనీయ జీవనం గడిపారు. దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమం కూడా గ్రామీణ స్థాయిలో భూ సంస్కరణల కోసం దోహదపడలేదు. రైతులను సమీకరించి వారి సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయలేదు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమం వలసవాదాన్ని వ్యతిరేకిస్తూ ముందుకుసాగినా.. అది భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నం చేయలేదు. దీంతో వలసవాదులు దేశం విడిచివెళ్లి, అధికార మార్పిడి జరిగినప్పటికీ భూస్వామ్య విధానం అలాగే కొనసాగింది. భూస్వామ్య వ్యవస్థ ముఖ్య లక్షణం.. ఉత్పాదకతను పెరగనీయకపోవడం. అయితే 1930వ దశకం నాటికి వ్యాపార పంటల విస్తరణ జరగడం వల్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని గ్రహించిన భూస్వాములు వేలాది ఎకరాల భూములను పడావుగా ఉంచారు. దీంతో పేద ప్రజలకు పని దొరకని పరిస్థితి ఏర్పడింది. 1940వ దశకం నాటికి తెలంగాణలో విధ్వంసం ఊహించలేని స్థాయికి చేరింది. భూస్వాములు మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. మహిళలు లైంగిక వేధింపులకు కూడా గురయ్యారు.
 
సాయుధ పోరాటం
దేశవ్యాప్తంగా 1930వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ భూమిలేని రైతులను సమీకరించి, భూస్వాములను ఎదురించడం ప్రారంభించింది. ఆంధ్ర ప్రాంతంలోనూ కమ్యూనిస్టు పార్టీ బలమైన శక్తిగా అవతరించింది. తెలంగాణలో భువనగిరిలో 1944లో జరిగిన పదకొండో ఆంధ్రమహాసభలో సైద్ధాంతిక విభేదాల వల్ల మితవాద సభ్యులు ఆంధ్రమహాసభ నుంచి నిష్ర్కమించారు. దీంతో ఆంధ్రమహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణలో రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తదితరులు పుచ్చలపల్లి సుందరయ్య సహాయంతో సాయుధ పోరాటాన్ని ఉధృతం చేశారు. భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో 5 లక్షల ఎకరాలకుపైగా భూమిని పేదలకు పంచారు. ఈ సమయంలో కొందరు భూస్వాములు మరణించారు. మరికొందరు వలస వెళ్లారు. 1944 నుంచి 1952 వరకు జరిగిన సాయుధ పోరాటానికి చారిత్రక నేపథ్యం ఉంది. సాయుధ పోరాటాన్ని అర్థం చేసుకోకపోతే తెలంగాణలో నక్సలైట్ ఉద్యమాన్ని అవగాహన చేసుకోలేం.
 
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినా..
1940లలో అంతర్జాతీయంగా, జాతీయంగా కీలక పరిణామాలు సంభవించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గెలిచినప్పటికీ.. యుద్ధంలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. మూడో ప్రపంచ దేశాలపై బ్రిటన్ ప్రభావం, పట్టు క్రమేణా సడలుతూ వచ్చింది. జాతీయంగా మన దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం స్వేచ్ఛా వాయువులకు దూరంగానే ఉన్నారు. ఇక్కడ సాయుధ పోరాటం జరుగుతూనే ఉంది. హైదరాబాద్ సంస్థానంలో నిజాం పాలనే కొనసాగుతోంది. ఆ సమయంలో ఒకవేళ హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనమైనా.. ఈ ప్రాంతం కమ్యూనిస్టుల ఆధీనంలో ఉండటం అప్పటి జాతీయ నాయకత్వానికి ఏమాత్రం ఇష్టం లేదు. సాయుధ పోరాటాన్ని అణిచివేయాలనే యోచన తప్ప, దాన్ని స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం ఇష్టపడలేదు. భారత సైన్యంతో ఇక్కడి కమ్యూనిస్టులను, సాయుధ పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం జరిగింది. మరోవైపు నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలపడానికి అంగీకరించలేదు. ఇక్కడ నిజాం ‘రజాకార్లు’ అనే ప్రైవేట్ మిలటరీ వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. వీరు ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన విధ్వంసాన్ని సృష్టించారు. ప్రజలను చంపడం, మహిళలపైఅత్యాచారాలు లాంటి అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. అలాంటి పరిస్థితుల్లో రజాకార్లను ఎదుర్కొని ప్రజలకు రక్షణ కల్పించింది కమ్యూనిస్టు పార్టీయే. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలోకి రజాకార్ల ఆగడాలను అరికట్టడానికి సైన్యాన్ని పంపించింది. కానీ, సైన్యం రజాకార్లకు చెక్ పెడుతూనే.. ఇక్కడి కమ్యూనిస్టు పార్టీని కూడా అణిచివేసింది. భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించిన పోలీస్ చర్యతో నిజాం రాజు భారత సైన్యానికి లొంగిపోయాడు. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్, భారత యూనియన్‌లో విలీనం అయింది. ఆ తర్వాత కూడా సాయుధ పోరాటం 1952 వరకూ భిన్న రూపాల్లో కొనసాగింది. భారత దేశానికి స్వాతంత్య్రం రావడం, హైదరాబాద్ భారత యూనియన్‌లో విలీనమవడం, ఇక్కడ రాచరిక వ్యవస్థ రద్దు తదితర కారణాలతో సాయుధ పోరాట విరమణ జరిగింది. కమ్యూనిస్టు పార్టీ 1952లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పూర్తి సీట్లను గెలుచుకుంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో బలమైన శక్తిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ తర్వాత విశాలాంధ్ర భావనను బలంగా సమర్థించింది. ఒకానొక సమయంలో అధికారం చేపడుతుందని అనుకున్న కమ్యూనిస్టు పార్టీ ఆ తర్వాత రాజకీయంగా ఎదగలేకపోయింది.
 
సరికొత్త అవతారంలో భూస్వాములు
1947 నుంచి 1967 వరకు భారత ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హామీలు, విశ్వాసం మేరకు తమ జీవితాలు మెరుగుపడతాయనీ కొత్త ఆశలు కలిగాయి. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా విశ్వాసం ఏర్పరచుకున్నారు.  అయితే స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ.. భూస్వాములతోగానీ, భూస్వామ్య వ్యవస్థతోగానీ పోరాటం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 1958లో జమీందారీ వ్యవస్థను రద్దు చేసింది. కానీ సరైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం, భూసంస్కరణలను పెద్ద ఎత్తున చేపట్టకపోవడం, వ్యవసాయిక సంబంధాల్లో తీసుకు రావాల్సిన మార్పులు తేవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. సాయుధ పోరాటంలో గ్రామాలను వదిలి నగరాలకు వలస వెళ్లిన భూస్వాములు.. కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ నేతలుగా మారి తిరిగి గ్రామాల్లోకి వెళ్లారు. వీరు గ్రామాల్లో తమ పూర్వ ఆధిపత్య పునరుద్ధరణ కోసం ప్రయత్నించారు. కమ్యూనిస్టు పార్టీ భావజాలాన్నే (భూసంస్కరణలు, భూస్వామ్య వ్యసస్థ రద్దు మొదలైనవి) తమ భావజాలంగా పేర్కొన్న కాంగ్రెస్ పార్టీ తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరింత బలపడ్డారు. 
 
నక్సల్‌బరీ నిప్పురవ్వ
ఇలాంటి  పరిణామాలు ప్రజల ఆశలను వమ్ము చేశాయి. స్వయం పాలన వచ్చినా తమ జీవితాలు బాగుపడలేదని గ్రామీణ ప్రజలు అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు వడ్డీ వ్యాపారుల దోపిడీ, భూస్వాముల అణచివేత చర్యలు అధికమయ్యాయి. వీటికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ‘నక్సల్‌బరీ’ గ్రామంలో గిరిజన రైతులు ఉవ్వెత్తున తిరుగుబాటు చేశారు. ఇక్కడ ఈ ఉద్యమం ఎక్కువ కాలం నిల్వలేదు. కొద్దికాలానికే అణిచివేశారు. కానీ, నక్సల్‌బరీలో ప్రారంభమైన పోరాటం భిన్నరూపాల్లో దాదాపు 45 ఏళ్లకు పైగా దేశవ్యాప్తంగా విస్తరించింది. రాజ్యం ఎన్ని అణచివేత మార్గాలను అనుసరిస్తున్నా.. ఉద్యమం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. నక్సలైట్ ఉద్యమం తెలుగు ప్రాంతాల్లో మొదటగా శ్రీకాకుళం జిల్లాలో మొదలైంది. నక్సల్‌బరీలానే ఇక్కడి గిరిజన రైతులు దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ ఉద్యమాన్ని కూడా ఏడాదిలోపే అణిచివేశారు. తర్వాత ఇది ఉత్తర తెలంగాణ ప్రాంతానికి విస్తరించింది. అయితే నక్సల్‌బరీ, శ్రీకాకుళం, ఉత్తర తెలంగాణ ఉద్యమాలకు మౌలిక తేడా ఉంది. నక్సల్‌బరీ, శ్రీకాకుళంలో గిరిజన పోరాటం జరిగింది. కానీ, ఉత్తర తెలంగాణకు మాత్రం ఈ ఉద్యమం రైతు కూలీల పోరాటంగా వచ్చింది. ఉత్తర తెలంగాణలో నక్సల్‌బరీకి ప్రతిస్పందన రావడానికి ప్రధాన కారణాలు... ఇదే ప్రాంతంలో రెండు దశాబ్దాల క్రితం సాయుధ పోరాటం జరగడం, నాటి సాయుధ పోరాటాన్ని అర్ధాంతరంగా విరమించడం, భూస్వాములు తిరిగి గ్రామాలకు వెళ్లడం, భూస్వామ్య పద్ధతులు మరో రూపంలో తిరిగి తెలంగాణలో చేరడం లాంటివి. అయితే  1940వ దశకంలో ఉన్న భూస్వామ్య పద్ధతులు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కొంతమేర తగ్గినా.. కరీంనగర్ జిల్లాలో 1970వ దశకంలో కూడా ఈ పద్ధతులు అంతే అమానుషంగా కొనసాగడం వల్ల జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు వచ్చాయి. ప్రత్యేకంగా ఈ ఉద్యమాల గురించి చెప్పుకోవడానికి కారణం.. ఈ రెండు కరీంనగర్ జిల్లాలోనే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం భూ సంస్కరణలు పెద్ద ఎత్తున ప్రవేశపెట్టి, భూస్వాముల అధికారాన్ని నియంత్రించి ఉంటే నక్సలబరీ ఉద్యమం రావడానికి చారిత్రక అవసరం ఉండేది కాదు. 
 
చరిత్ర కొనసాగింపు
స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత తిరిగి గ్రామాల్లోకి వచ్చిన భూస్వాముల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం రాజ్యం ద్వారా జరిగింది. చరిత్ర కొనసాగింపుగా అవే ఆధిపత్య, అణచివేత పద్ధతులు కొనసాగడం వల్ల ప్రజలు పోరాట రూపాలను తీసుకోవాల్సి వచ్చింది. ఆ రూపాలే నక్సల్‌బరీ ఉద్యమం. తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సాయుధ పోరాటానికి కొనసాగింపుగా, నక్సల్‌బరీ ఉద్యమ స్ఫూర్తిగా పెద్ద ఎత్తున యువత ఉద్యమంలోకి వచ్చారు. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల నుంచి బాగా చదువుకున్న యువత ఉద్యమంలో చేరి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారందరూ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. దీన్ని బట్టి  ఉద్యమంలో తెలంగాణ యువత భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. విరసం, పౌర హక్కులు, కవులు, కళాకారులు మొదలైన వారు ఈ ఉద్యమ ప్రభావానికి లోనయ్యారు. తెలంగాణ సమాజంలోని అన్ని రంగాల మీద దీని ప్రభావం ఉంది. ఈ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలకు ప్రజాస్వామ్య పరిష్కారానికి బదులుగా, అణచివేత మార్గాలనే ప్రభుత్వం అవలంబించడం వల్ల ఉద్యమానికి సంబంధించి ముఖ్యాంశాలు మరుగునపడి హింస.. ప్రతిహింసగా మారింది. దీంట్లో ప్రాణనష్టం క్రమక్రమంగా ఎక్కువ అవుతూ వచ్చింది. ప్రాణ నష్టం పోలీసులకు, నక్సలైట్లకే పరిమితం కాకుండా పౌర సంఘాల్లో పనిచేసే వారు, కవులు, కళాకారులు కూడా అభద్రతభావంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నక్సలైట్ ఉద్యమానికి పరిష్కారాన్ని శాంతి భద్రతల సమస్యగా కాకుండా, సామాజిక, ఆర్థిక సమస్యగా చూడాలి.
 
కొత్త ఆర్థిక నమూనా - సహజ వనరుల విధ్వంసం
రాజ్యాంగంలోని సమభావన, చట్టబద్ధ పాలన, భూ సంస్కరణలను పట్టించుకోకపోవడం వల్ల సమస్య నిరంతరం ఏదో ఒక రూపంలో కొనసాగుతోంది. 1983లో ప్రవేశపెట్టిన అభివృద్ధి నమునా సహజ వనరుల విధ్వంసంతో కూడుకుంది. 1991లో పీవీ నరసింహారావు హయాంలో ఆర్థికాభివృద్ధి పేరుతో వచ్చిన నమునా.. పారిశ్రామక అభివృద్ధి, వ్యవసాయక అభివృద్ధి కాకుండా నయా పెట్టుబడీదారి విధానం. ఇందులో సంపద సృష్టి కన్నా సంపద దోపిడీ ఎక్కువ. అంతర్జాతీయ సంస్థల రంగప్రవేశం, విదేశీ పెట్టుబడులు, గిరిజన ప్రాంతాల్లో ఉండే అడవులు, ఖనిజాల దోపిడీల కారణంగా నక్సలైట్ ఉద్యమం గిరిజన ప్రాంతాలకు విస్తరించింది. 1960-70 నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉద్యమం విస్తరించింది. ఆయా ప్రాంతాల్లోని సహజ వనరులను గిరిజనుల ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సింది. కానీ అభివృద్ధి ముసుగులో వారిని నిర్వాసితులను చేయడంతో ఉద్యమం ఉధృతమైంది.
 
నక్సలైట్ ఉద్యమం- ప్రత్యేక తెలంగాణ
తెలంగాణలో వచ్చిన నక్సలైట్ ఉద్యమ క్రమంలో.. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు అభద్రతాభావానికి లోనయ్యారు. ఈ పరిస్థితికి పరిష్కార మార్గం వెతికే క్రమంలో 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగింది. 1990వ దశకంలో నూతన ఆర్థిక విధానాన్ని అమలు చేశాక  దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి.  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రయోగశాలగా మార్చారు. నాటి విధ్వంసంతో నక్సలైట్ ఉద్యమం బలపడే సమయంలో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష మరోసారి తెలంగాణ ప్రజలను ఉద్యమబాట పట్టేలా చేసింది. ఈసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తెలంగాణలో ఉన్న భిన్న శక్తులు మద్దతు ఇచ్చాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నక్సలైట్ ఉద్యమం గుర్తించిన అనేక సమస్యలకు ప్రజాస్వామ్యమైన పరిష్కార మార్గాలను సూచించే దిశగా తెలంగాణ రాష్ట్రం వెళుతుందనే ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉంది.
తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టు, నక్సలైట్ పార్టీలు కూడా మద్దతునిచ్చాయి. 1990వ దశకంలో ఎస్.ఆర్.శంకరన్ నాయకత్వంలో ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కోదండరాం సహా తెలంగాణకు చెందిన 15 మంది  ప్రజాస్వామ్యవాదులు పౌర స్పందన వేదికను స్థాపించారు. 1996-2004 వరకు తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం లేవనెత్తిన సమస్యకు ప్రభుత్వం శాంతియుత పరిష్కారం చూపాలని, రాజకీయ కారణాలు పక్కన పెట్టి ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకొని చర్చించాలని, హింసా ప్రతిహింస తగ్గాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య చర్చలు జరిగాయి. చర్చల మొదటి రోజు తమ పార్టీని పీపుల్స్‌వార్ పార్టీ నుంచి మావోయిస్టు పార్టీగా మారుస్తున్నట్లు నక్సలైట్లు ప్రకటించారు. చర్చల్లో భాగంగా ప్రజల సమస్యలు ఏమిటి? హింస లేకుండా వాటికి పరిష్కారం ఎలా కనుగొనాలి అనే అంశాన్ని లేవనేత్తారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ చర్చలు విఫలమమ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అణిచివేత విధానాన్ని చేపట్టింది. నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఘర్షణలో ఉద్యమానికి ఎవరు మద్దతునిస్తున్నారు? ప్రజలు ఎందుకు మద్దతునిస్తున్నారు? వాటికి కారణాలేమిటి? మొదలైన వాటిని ప్రభుత్వమే పట్టించుకొని పరిష్కార మార్గాలు చూపిస్తే నక్సలైట్ల పాత్ర తగ్గుతుందని పౌర స్పందన వేదిక విశ్వసించింది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమంలో నుంచి వచ్చిన నాయకత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది. ఈ చారిత్రక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చరిత్ర నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందా...!! నక్సలైట్ ఉద్యమాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణిస్తుందా.. లేక సామాజిక, ఆర్థిక సంక్షోభంలో నుంచి వచ్చిన ఉద్యమంగా చూస్తుందా..! అనేది తెలంగాణ ప్రభుత్వం ముందు, ప్రజల ముందు ఉన్న సవాల్.. !
Published date : 08 Dec 2015 05:25PM

Photo Stories